Thursday, December 27, 2012

హాపీ బర్త్ డే సాహితి


సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం ఇదేసమయాని కి నేను ఓ సోఫాలో పడుకొని ఆంధ్రభూమి వీక్లీ చదువుతున్నాను . మా అబ్బాయి పక్క సోఫాలో లాప్ టాప్ మీద ఏదో పని చేసుకుంటున్నాడు . పొద్దటి నుంచి ఆలోచిస్తున్న విషయం మా వాడి ని అడగటాని కి ఇదే సమయం అనుకొని , " వరే బాబా " అని ముద్దుగా పిలిచాను . "ఏమిటి మాతే " అని అంతకన్నా గారంగా అన్నాడు మావాడు ." పొద్దున రవి బావ తెలుగు లో కూడా బ్లాగ్ వ్రాయవచ్చని చెప్పాడు కదరా ఎలా వ్రాయాలి " అని అడిగాను .జవాబు లేదు . కాసేపు వాడి వైపు చూసాను . చాలా సీరియస్ గా లాప్ టాప్ లో తలదూర్చి వున్నాడు . హుం కుయ్ అనడు , కయ్ అనడు . కాసేపు పైకి , కాసేపు లోపల విసుక్కొని , ఎవరిమీదైనా ఆధారపడితేలే అనుకొని నిరాశ తో బుక్ లోకి తల దూర్చేసాను


. కొద్ది నిమిషాలు నిశబ్ధం గా గడిచిపోయాయి . నేనూ చాలా సీరియస్ గా సీరియల్ చదువు కుంటున్నాను . " మాతే నీ బ్లాగ్ కు ఏమి పేరు పెడుదామనుకుంటున్నావు ?" అని వినిపించింది . నాకు వాడేమన్నాడో ఓ క్షణం అర్ధం కాలేదు . ఏమిటిరా అని అడిగాను . మళ్ళీ అదే ప్రశ్నను అడిగాడు . అప్పుడు నేను చదువుతున్న సీరియల్ లోని హీరోయిన్ పేరు సాహితి . ఆ పేరు నచ్చి వెంటనే " సాహితి " అన్నాను .

 మళ్ళీ నిశబ్ధం . నేను మళ్ళీ నా సీరియల్ లోకి ." మాం ఇదిగో నీ సాహితి " అని అరిచాడు . నేను ఒక్క ఉదుటున లేచి కూర్చొని ఏమిటీ అన్నాను . లాప్ టాప్ నా ముందు పెట్టి " సాహితి - మాల " అన్నది నీ బ్లాగ్ పేరు టెంప్లెట్ ఏమిపెట్టాలి అని అడిగాడు . ఒక్కసారే ఉక్కిరి బిక్కిరి ఐపోయాను . సింపుల్ టెంప్లెట్ అని చెప్పాను . నా ఆనందమో , ఆరాటమో ఏదో తెలీని స్తితిలో నేనుండగా ఇదిగో నీ బ్లాగ్ తయారైపోయింది . అని చూపించాడు . ఓ గంట సేపు దాని తో కుస్తీ పడి ఎలా వ్రాయాలి , ఎలా పోస్ట్ చేయాలి అన్నీ చూపించాడు . నా నోట్స్ లో గబ గబా రాసేసుకున్నాను . "ఇప్పుడేదైనా అందులో వ్రాయి " అన్నాడు . అమ్మో ఏమి వ్రాయాలి ? ఆలోచించుకొని రేపు వ్రాస్తాలేరా అన్నా .కాదు వ్రాయాల్సిందే అన్నాడు .

తడబడుతూ , సంతోషం ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలీక అబ్బ అప్పటి ఉద్వేగం చెప్పలేను . ఇదో ఇలా నేనూ , నా సాహితీ బ్లాగ్ లోకం లోకి వచ్చేసాము :) 

హాపీ బర్త్ డే సాహితి  :)





Friday, December 21, 2012

మిధునం



మావారు రవిశంకర్ 'ఆర్ట్ ఆఫ్ లివింగ్ 'క్లాస్ లో జాయిన్ అయ్యారు .అక్కడ ఆయనకు యోగా టీచర్ 'వెంకటేశ్'. ఓరోజు వాళ్ళ ప్రోగ్రాం వుందంటే నేనూ వెళ్ళాను . మాతోపాటు వెంకటేశ్ కూడా వచ్చారు . ఏదో మాటల్లో రేపు మా పిక్చర్ 'మిధునం'ప్రివ్యూ ప్రసాద్ లాబ్స్ లో వుంది మీరు రావాలి సార్ అన్నాడు . మీరు కూడా రండి మేడం అని నాతో అన్నాడు . ఒక్క నిమిషం నేను సరిగ్గా విన్నానా లేదా అనుకొని ఏది శ్రీరమణ రాసిన కథ , తణికెళ్ళ భరణి తీసిందేనా అన్నాను అనుమానంగా . అవును మేడం నేను దాని కి అసిస్టెంట్ డైరక్టర్ ని అని చెప్పాడు . అంతే ఎంత ఎక్సైట్ ఐపోయానో ! మావారి కంటే ముందే తప్పకుండా వస్తాము అనిచెప్పేసాను :) పొద్దున 8 గంటల కు అని చెప్పారు . రాత్రంతా నిద్ర పట్టలేదు , ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఆరాటమే . బహుషా నేను ఏ పిక్చర్ కోసమూ అంత ఎదురుచూడలేదనుకుంటాను :)

 ప్రముఖ రచయత శ్రీరమణ రచించిన కథ "మిధునం " ను అదే పేరు తో తెరమీద అద్బుతంగా చిత్రీకరించారు తణికెళ్ళభరణి . టైటిల్ పాటలో చెప్పినట్లుగా ఆదిదంపతులు అభిమానించే చిత్రమే మిధునం .చిన్నపటి నుంచి కళ్ళల్లో పెట్టుకొని పెంచిన పిల్లలు పెద్దవాళ్ళై వారి బాధ్యతలలో వారు మునిగిపోయినప్పుడు , వంటరిగా మిగిలిపోయిన అమ్మానాన్నల కథే మిధునం .పిల్లలంతా విదేశాలకు వెళ్ళిపోయాక , వాళ్ళను తలుచుకుంటూ బాధ పడుతున్న భార్యతో , బాధ పడవద్దని , ఇంతకు ముందు సంసారబాధ్యతలో పడి తీర్చుకోలేని కోరికలను తీర్చుకునేందుకు చక్కని అవకాశమని , జీవితాన్నీ ఎంజాయ్ చేయవలసిన తరుణమిది అని భార్యను ఓదార్చి చాలా తమాషాగా చూపిస్తాడు భర్త. పిల్లల చిన్నతనపు ముచ్చట్లు చెప్పుకుంటూ తన పెరటిలోని చెట్లకు వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు .అప్పదాసు , బుచ్చిలక్ష్మి ఓజంట . అరవై ఏళ్ళతరువాత వంటరిగా మిగిలిపోయి పోట్లాడుకుంటూ , కలుసుకుంటూ , మాటలాడుకుంటూ , చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ మొత్తమీద చిన్నపిల్లలైపోతారు :)


సినిమా అంతా చాలా తమాషాగా వుంటుంది . మొత్తం రెండు పాత్రల తోనే ఈ సినిమా అంతా నడుస్తుంది . కాని ఎక్కడా బోర్ కొట్టదు .అప్పదాసుగా యస్.పి బాలసుబ్రమణ్యం , బుచ్చిలక్షి గా లక్ష్మి చాలా బాగా నటించారు . పెద్దవాళ్ళంతా వంటరితనం మరిచిపోయి ఇలా హాయిగా బతకవచ్చు అనే ఫీలింగ్ వస్తుంది .భార్యా భర్తల సంబంధానికి మంచి నిర్వచనం మిధునం . సినిమా అంతా సరదా సరదా గా తీసి , చివరిలో మటుకు కంట తడి పెట్టిస్తారు . ముగింపులో బుచ్చి స్వగతం విని కంటతడి పెట్టనివారు ఎవరూ వుండరంటే అతిశయోక్తి కాదేమో ! పాటలు కూడా చాలా బాగున్నాయి . తప్పక చూడవలసిన సినిమా . పాటలు ఇక్కడ వినండి .

 ఇది మటుకు ఇక్కడ కూడా చూడండి :)

Friday, December 7, 2012

లక్ష్మిగారు అభినందనలు





పి.యస్. యం లక్ష్మి గారు యాత్ర లక్ష్మి గా బ్లాగ్ లలో అందరికీ పరిచయమే . ఆవిడ హైదరాబాద్ లోని ఎకౌంటెంట్ జనరల్ ఆఫీసు నుంచి సీనియర్ ఎకౌంటెంట్స్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు . అంతటి పదవిని నిర్వహిస్తూ , పిలల్లను , ఇంటినీ గృహిణిగా చూసుకుంటూ , తీరిక సమయాలలో  దేవాలయాలను దర్శించటం ఆవిడ హాబీ . అఫ్కోర్స్ ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళై సెటిలైపోయారనుకోండి :) విచిత్రమేమిటంటే వారి శ్రీవారు శ్రీ.యం . వెంకటేశ్వర్లు గారి కి కూడా ఈ హాబీ వుండటం .భార్యాభర్తలిద్దరి కీ ఒకే హాబీలుండటం  , అవి పాటించటం చాలా అరుదు .నాకంతా మావారి సహకారమే . ఆయన సహకరించకపోతే నేను ఇన్ని వూళ్ళు తిరుగగలిగేదానిని కాదు అంటారు లక్ష్మిగారు .

మామూలుగా ప్రశిద్ది చెందిన దేవాలయాలనే కాదు , ఎక్కడెక్కడో వున్న చిన్న చిన్న దేవాలయాలనూ , పురాతన దేవాలయాలనూ దర్శించారు లక్ష్మిగారు . వూరికే చూడటమే కాదు , వాటిగురించి , అవి ఎక్కడవున్నాయి , ఎలా వెళ్ళాలి , అక్కడి సదుపాయాలేమిటి , వాటి చరిత్ర అన్నీ వివరం గా వారి బ్లాగ్ "యాత్ర" లో వ్రాశారు . చాలా వరకు వివిధ పత్రికలలో వ్యాసాలుగా కూడా ప్రచురించారు .అంతేకాదు  ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యస్తలాలను పుస్తక రూపంగా తీసుకురావాలనే ఆకాంక్షతో ఇప్పటిదాకా నల్గొండ , వరంగల్ జిల్లా  పుణ్యక్షేత్రాలు , 'యాత్రా దర్శిని -నల్గొండజిల్లా', 'యాత్రా దర్శిని -వరంగల్ జిల్లా ' లను ఈబుక్స్ రూపం లో కొనిగె. ఆర్గ్ వారు ప్రచురించారు . ఇవేకాక కొనెగె వారు ప్రచురించిన మరొక ఈపుస్తకం ' పంచారామాలు - పరిసర క్షేత్రాలు '. ఇంకా త్వరలో రాబోతున్న ఈ బుక్స్ ' కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లూ

' హైద్రాబాదు నుంచి ఒక రోజులో '

హైద్రాబాదు నుంచి రెండు రోజులలో '




ఈ బుక్స్ గానే కాక "యాత్రాదీపిక , వరంగల్ జిల్లా " , వరంగల్ జిల్లా లో వున్న పుణ్యక్షేత్రాల గురించి వివరిస్తూ వ్రాసిన పుస్తకాన్ని ప్రింటు చేయించారు . మామూలుగా వరంగల్ అనగానే గుర్తువచ్చేది వేయిస్తంబాల గుడి , వరంగల్ దగ్గరగా వున్న రామప్ప దేవాలయం . కానీ ఈ పుస్తకం లో వరంగల్ , హనుమకొండ , ఖాజీపేటలలో వున్న 12 దేవాలయాల గురించి ,వరంగల్ చుట్టుపక్కల వున్న 11 దేవాలయాల గురించి వివరించారు .

ఈ రోజు 7-12-2012 శుక్రవారం మధ్యాహ్నం 1.05 నిమిషాలకు రంజని - తెలుగు సాహితీ సమితి, ఏ.జీఆఫీస్ హైద్రాబాద్ వారి ఆధ్వర్యం లో , ఏ. జీ ఆఫీస్ రంగస్తలం లో ఆవిష్కరించారు . ప్రక్యాత రచయత , కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుగ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ గారు పుస్తకావిష్కరణ గావించారు .ఆచార్య అయినవోలు ఉషాదేవి , పిఠాధిపతి , భాషాబివృద్ధి పీఠం , పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిధ్యాలయం గారు వక్త గా వ్యవహరించారు . అనుకోకుండా ఇద్దరు గెస్ట్ లూ వరంగల్ వాస్తవులే అయ్యారు :)




కార్యక్రమము  ముందుగా శ్రీమతి శిష్టా లీలా వసంత లక్స్మి బృందము ఆలపించిన గానలహరితో ప్రారంభం ఐనది .



తరువాత డాక్టర్ నవీన్ గారు పుస్త్కావిష్కరణ గావించారు . ఆచార్య ఐనవోలు ఉషాదేవి గారు , పుస్తకం లోని అంశాలను చూపుతూ ప్రసంగించారు . ఆపైన రంజని -తెలుగు సాహితీ సమితి వారు లక్ష్మిగారి ని శాలువతోనూ , పూలమాల తోనూ , జ్ఞాపిక తోనూ సత్కరించారు






వారే కాదు , లక్ష్మిగారి అక్క చెళ్ళెళ్ళు , వారి కాలనీ లోనివారి స్నేహితులూ శాలువాలతో , పూలమాలల తో , చీరల తో సత్కరించారు . అన్నట్లు  నేనూ ఓ పూల బుకే ఇచ్చానండోయ్ :)

కార్యక్రమము ఆసాంతమూ చాలా చక్కగా జరిగింది .




లక్ష్మిగారు , మీరు మరిన్ని వూళ్ళు తిరగాలని , ఆ విశేషాలన్నీ చక్కని పుస్తకాలుగా ప్రచురించాలనీ , ఇంకా ఇంకా సత్కారాలు పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ  మీకు అభినందనలు తెలియజేస్తున్నాను .  .

Wednesday, December 5, 2012

సౌందర్యం



ప్రఖ్యాతరచయత కొమ్మూరి వేణుగోపాలరావు గారి అబ్బాయి , కొమ్మూరి రవికిరణ్ రచించినదీ ఈ నవల " సౌందర్యం ". రచయత పేరు చూడగానే కొమ్మూరి వేణుగోపాలరావు గారి సంబందీకులదా అని తీసుకొని చూసాను . వారి అబ్బాయే అని తెలియగానే , ఎలా రాసారో చదువుదామనిపించి కొనేసాను .కొన్నందుకు , చదవగానే మంచి నవల అన్న సంతృప్తి కలిగింది . ఈ మధ్య తరుచుగా వినిపించేపదం "డిప్రెషన్" . అది ఎందుకొస్తోంది ? ఆ సమస్యమీద రాసినదే ఈ నవల . అలా అని ఏవేవో పెద్ద పెద్ద పదాలతోనో , నోరుతిరగని సమస్యల గురించో లేదు . ఐనా నేను చెప్పేదాని కన్నా , ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బరెడ్డి గారు ఈ నవల గురించి ఏమన్నారో చెపితే బాగా తెలుస్తుందేమో !

"సాహిత్యం జీవితాన్ని ప్రతిబింబింపజేస్తుంది .కొందరి జీవితాలనైనా తీర్చిదిద్దగలుగుతుందని రచయత తనవంతు బాద్యత గా సమాజానికి తెలియజెప్పిన నవల 'సౌందర్యం' . నవల అనేది జీవితాని కి అద్దం లాంటిది . ఈనవలలోని ఇతివృత్తం చాలా విస్తృతమైనది .కథకు అవసరమైన జీవితము లోని ముఖ్యమైన సంఘటనలు మాత్రమే ఏరుకొని వాటిని అవసరం మేరకు వివరించరించటము లో రచయతగా కొమ్మూరి రవికిరణ్ సఫలుడయ్యాడని చెప్పవచ్చు .ఈ నవల చదువుతున్నంతసేపు ఈ కథ ఎక్కడో జరగలేదు , మన మధ్యే మన ముందే జరుగుతున్నట్టుగా ఈ పాత్రలన్నీ మన చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది .

మానవసమాజం లో ప్రస్తుతం వచ్చిన మార్పుల వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్త దూరమై , మానవ సంబందాలకంటే , ఆర్ధిక సంబంధాలకే ప్రాధాన్యత ఇవ్వడంవల్ల రక్త సంబందీకుల మధ్యే సంబంధాలు తెగిపోయి ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తులను ,వానికనువైన రీతిలో పరిష్కరించేందుకు ఉన్నత వ్యక్తిత్వం వున్న వక వ్యక్తిని కథానాయకుడుగా నిలబెట్టి స్నేహపు విలవలకూ , రక్తసంబంధాలకూ ఎంత విలువ ఇవ్వాలి , వాటిని ఎలా కాపాడుకోవాలో ఈ నవలలో ఎంతో చక్కగా చెప్పాడీ రచయత ."

ఈ నవల గురించిన ముందుమాటలో డాక్టర్ రామసుబ్బారెడ్డి గారు ఇంకా చెప్పారు . అది చదివాక నేను నవల గురించి రాస్తే ఆ ముందుమాటల ప్రభావం తప్పకుండా వుంటుంది అందుకని ఆయన మాటలు నామాటలు గాచెప్పటం ఎందుకు ఆయన చెప్పినవే కొద్దిగా రాస్తే అందరికీ నవల గురించి కొంత అవగాహన కలుగుతుంది అనిపించింది :)

నాకు ఈ నవలలోని మురళి పాత్ర చాలా నచ్చింది . ఎక్కడా టెన్షన్ పడడు. తొణకడు , బెణకడు . అందిరి నీ చాలా స్మూత్ గా డీల్ చేస్తాడు . రామ్మోహన్ , సునంద , సావిత్రి లలో మార్పు తెచ్చేందుకు ఎంతో సహనం చూపిస్తాడు .సంక్షోబాలను , సంఘర్షణలనూ సంతృప్తికరంగా పరిష్కరించుకోవాలని , మానసిక బలహీనతలనూ , స్వార్ధాన్నీ జయించాలని తెలియజేసాడు .ఎవరికి వారు నా అనే స్వార్ధం తో బతుకుతున్న ఈ కాలం లో కుటుంబం అంటే భార్యా , పిల్లలు మాత్రమే కాదు బంధువులు స్నేహితులు కూడా నావాళ్ళే అని తెలియజేసాడు . మురళి పాత్ర ను చాలా ఉన్నతం గా తీర్చి దిద్దారు .

రచయత శైలి కూడా చాలా సులభంగా వుంది . ఒకసారి చదవటం మొదలు పెడితే పూర్తి అయ్యేవరకూ ఆపలేకపోయాను . నాకు ఈ నవల చాలా నచ్చింది .




Tuesday, November 6, 2012

ఒప్పుల కుప్పా వయ్యారి భామా




 
ఒప్పులకుప్పా వయ్యారి భామా ,
సన్నా బియ్యం చాయాపప్పూ ,
బిస్తీ బిస్తీ బీరాకాయా .

గుడు గుడు గుంచం గుండేరాగం ,
పాముల పట్టం పడగేరాగం,
పెద్దన్నపెళ్ళీ పోదము రండీ ,
చిన్నన్న పెళ్ళీ చూతము రండి .

ఏకాలమైయిందీ ఈ ఆటలన్నీ ఆడి . ఈ మద్య మా ఫ్రెండ్ ఈ బొమ్మలు ఎక్కడి నుండో తెచ్చి చూపించింది . అంతే తేనతుట్టె కదిలింది :)
బిస్తి గీస్తూ ఎంత గిర్రున తిరిగే వాళ్ళమో :) ఎవరు ముందు వదిలేస్తే వాళ్ళూ ఓడినట్లు . నా మొహం గెలిచినవాళ్ళూ , అంత స్పీడ్ లో తిరుగుతూ వాళ్ళు వదిలేయగానే వీళ్ళూ  ధన్ మని కింద పడిపోయేవారు :) కాని కళ్ళు తిరిగే వరకూ తిరగటం ఎంత మజా :)

గుడు గుడు గుంచం నుంచి , కాళ్ళా గజ్జా దాకా వచ్చి చక్కిలింతలు కలిగితే అదో ఆనందం .

రింగులు తిప్పికుంటూ బాల్యం లోకి వెళ్ళిపోయాను :)

ఈ మధ్య ఎక్కడో చదివాను , ఈ పాటలల్లో సైంటిఫిక్ రీజన్ వుంది అని వివరిస్తూ రాసారు . ఎక్కడ చదివానో గుర్తు రావటం లేదు .గుర్తొచ్చి , దొరికితే పెడతాను :)






Monday, September 3, 2012

లక్ష్మీనారాయణ యజ్ఞం



మావారు , ఆయన ఫ్రెండ్ అనుకోకుండా , జూబిలీహిల్స్ లోని పూరీజగనాథ ఆలయాని కి వళ్ళారుట . అక్కడ లక్ష్మీనారాయణ యజ్ఞం జరుగుతొందిట . మావారి కి ఆ యజ్ఞం చూడగానే , ఆయజ్ఞం లో కూర్చోవాలి అనిపించి , కార్యకర్త లను , మాకూ కూర్చునే అవకాశం ఇవ్వగలరా అని అడిగారట . ఆయనేమో , లేదండి అన్ని బుక్కైపోయాయి అన్నారట . ఐనా సరే నా నంబర్ తీసుకోండి , ఒకవేళ ఏకారణం చేతైనా , ఎవరైనా డ్రాప్ అవుతే మాకు అవకాశం ఇవ్వండి అని ఆయన ఫోన్ నంబర్ ఇచ్చి వచ్చారట .ఆ మరునాడే కార్యకర్త శంకర్ నారాయణజీ కాల్ చేసి మీ సంకల్పం చాలా బలంగా వుంది , 31 న ఒకరు డ్రాపైపోయారు , మీకు వీలైతే మీరు రావచ్చు అన్నారు . అంతే మావారు చాలా సంతోషపడిపోయి ఓ తప్పకుండా వస్తాము అన్నారు . అలా లక్ష్మీనారాయణ యజ్ఞం లో పాలుపంచుకునే అవకాశం మాకు వచ్చింది .




శుక్రవారం 31 వుదయం 8 గంటలకే యజ్ఞవాటిక కు వెళ్ళాము .మావారి కి దీక్షా వస్త్రాలు ఇచ్చారు . అవి వేసుకొని , గుడిలోకి వెళ్ళి స్వామివారి ధర్షనం చేసుకొని వచ్చాము . 8.30 కు యజ్ఞం మొదలైంది . మొత్తం ఐదు యజ్ఞ కుండాలు వున్నాయి . వాటి దగ్గర ఐదుగురు బ్రాహ్మలు , ఇద్దరు దంపతులు కూర్చున్నారు . యజ్ఞ ప్రధాన ఆచార్యులవారు లక్ష్మీకాంత్ జీ ధీక్షిత్ వారణాశి నుంచి వచ్చారు . ఇంకా పదహారుగురు ఆచార్యులు కూడా వారణాశి నుంచి , మిగిలిన ఆచార్యులు ఇక్కడివారు వున్నారు . మేము వెళ్ళిన ది యజ్ఞం మొదలైన ఆరోరోజు న . ఇలా యజ్ఞం లో కూర్చొవటం మాకు ఇదే మొదటిసారి . శుక్రవారం , పౌర్ణమి , శతబిషం నక్షత్రం వున్న రోజున మేము యజ్ఞం లో కూర్చోవటం చాలా మంచిదైంది అన్నారు ఆచార్యులవారు . అక్కడివారి పద్దతి ప్రకారము దంపతులలో మొగవారి కండువాకు , ఆడవారి వోణీ కొసకు , తొమ్మిది ముడులు వేసారు . అందులో రూపాయి కాసును , బియ్యం , ఇంకా ఏవో పెట్టారు . పూజలో వున్నంతసేపూ ఇద్దరి ముడులనూ అలాగే వుంచారు .

ముందుగా గణపతి పూజను ఆ తరువాత వాస్తుదేవుని పూజను చేయించారు . ఆ తరువాత యాగ కుండాల దగ్గర కూర్చోబెట్టి , అగ్ని లో నెయ్యి ని , నవధాన్యాలు వేయిస్తూ , ఉదయము , స్త్రీ సూక్తం తోనూ , మధ్యాహ్నము పురుష సూక్తం తోనూ యాగం చేయించారు . 12 .30 విరామం ఇచ్చి ప్రసాదం ఇచ్చారు . మళ్ళీ మధ్యాహ్నం 3.30 మళ్ళీ మొదలు పెట్టారు . మధ్య విరామ సమయంలో లలితాసహస్రనామం చేసారు . అప్పుడు తామరపూవులతో అమ్మవారిని పూజించారు . 6.30 యజ్ఞం ముగిసిన తరువాత లక్ష్మీనారాయణులకు హారతి , నివేదన చేసారు .




మరునాడు శనివారం సాయంకాలం 4.30 కు పూర్ణాహుతి కోసం వెళ్ళాము . ముందుగా ఈ ఏడురోజులూ యజ్ఞం చేసిన వారినందరినీ యాగస్తలం ఉత్తర్దిశగా తీసుకెళ్ళారు . అక్కడ అందరి మధ్యలో ఒక బుట్టలో శనిదేవుని విగ్రహం పెట్టి అందరూ దక్షణలను సమర్పించారు . ఆ తరువాత పూజ చేసారు . ఆపైన ఆ బుట్టను ఒకతను ( అతని ని ఏదో అన్నారు , మర్చిపోయాను ) నెత్తిన పెట్టుకొని అందరి చుట్టూ తిరిగాడు . అప్పుడు అందరిని తలలు వంచుకొని కళ్ళు మూసుకోమన్నారు . ఆ కార్యక్రమము చూడకూడదుట . అలాగే యజ్ఞవాటిక చుట్టూ కూడా తిప్పించారు . అప్పుడు మా అందరినీ దూరం గా వుండమన్నారు . ఆ తరువాత కాళ్ళూ చేతులు కడుక్కొని మళ్ళీ యజ్ఞవాటికలోకి వళ్ళాము . అందరినీ అన్ని కుండాలచూట్టూ నిలబెట్టి , కుండాలలో నెయ్యిని పోయించారు . దానికి అరటిబోదలతో పైపులా చేసి . కుండం ముందు వెదురుకర్రల సపోర్టుతో నిలబెట్టారు . దాని ద్వారా నెయ్యిని పోయించారు .( అగ్ని కి కి ఆజ్యం తోడవటం ఏమిటో అప్పుడు నాకు తెలిసింది ) ఆ తరువాత ప్రధాన ఆచార్యులవారు అందరి నీ ఆశీర్వదించి లక్ష్మీరూపును , ప్రసాదాన్ని ఇచ్చారు . కొంగుకు వేసిన ముడులను విప్పదీసి , అందులోని అక్షితలను మా శిరస్సున వేసారు . దాని తో యజ్ఞం ముగిసింది .

అలా మా రిటైర్మెంట్ రోజులు మొదలయ్యాయి :)


Tuesday, August 7, 2012

నా కళాఖండాలు :)))

నాకు చిన్నప్పటి నుంచి పేంటింగ్ అంటే ఇంటరెస్ట్ వుండేది . ఎప్పుడూ ఏదోవకటి వేస్తూవుండేదానిని . పి. యు . సి లో గ్రూప్ లో కూడా డ్రాయింగ్ వుంది . పెళ్ళైనాక , పూనా లో , సికింద్రాబాద్ లో కోర్స్ లు కూడా చేసాను . ఆ తరువాత చిన్నగా ఇంట్రెస్ట్ ఎలా తగ్గిందో తగ్గిపోయింది . అదంతే నాకు దేనిమీదా పట్టుమని పది సంవత్సరాలు ఇంట్రెస్ట్ వుండదు . చిన్నప్పటి నుంచీ సమ్మర్ వెకేషన్స్ లో ఏదో ఒకటి నేర్చుకోవటం అలవాటు . దానితో కొద్ది రోజులు కాగానే పాతది వదిలేసి కొత్తదాని మీద పడతాను :) అలా చాలా కోర్స్ లు చేసాను :)

పారేసినవి పారేయగా , గిఫ్ట్ లిచ్చినవి ఇయ్యగా మిగిలినవి ఇవీ నా పేంటింగ్స్ . ఇవి కూడా ఎక్కడో పడేసి వుంటే మా అమ్మాయి తీసి , "సిరి " ఆర్ట్ థియేటర్ లో కొంచం క్లీనప్ చేయించి , ఫ్రేంస్ పెట్టించి వాళ్ళింట్లో పెట్టుకుంది . ఆ మద్య జ్ఞానప్రసూన గారి పేంటింగ్స్ చూడటాని కి వెళ్ళినప్పుడు , వాళ్ళ సర్ తో , లాస్ట్ వీక్ నా పేంటింగ్స్ అన్నీ క్లీన్ చేసి ఇచ్చారు మీరు అనగానే ఆయనకు గుర్తొచ్చి అవునండి , చాలా బాగా వేసారు , ఎందుకు మానేసారు అని అడిగాడు . నేను నవ్వేసి వూరుకున్నాను . ఇప్పుడంత ఓపిక , ఇంట్రెస్ట్ లేవని ఎలా చెపుతాను :)

సెవంటీస్ ల లో మంచి మంచి కాలెండర్స్ వచ్చేవి . ఇవి ఆ కాలెండర్s చూసి వేసినవే :)
















Friday, July 6, 2012

ఎదురీత




just yellow media pvt ltd వారు టి.వి సీరియల్స్ అంటే నాకున్న అభిప్రాయాన్ని పోగొట్టారు . యద్దనపూడి నవల ఆధారం గా తీసిన సీరియల్ అని ఎక్కడో చదివి ' రాధ-మధు 'చూసాను . చాలా నచ్చేసింది . ఆ తరువాత వారే తీసినవి , 'అమ్మమ్మా.కాం' , ' లయ ' కూడా నచ్చాయి . చక్కని కుటుంబ కథ ల తో ఎక్కడా బోర్ కొట్టించకుండా , ఎత్తులూ పైఎత్తులూ , అత్తా కోడళ్ళ సంవాదాలు , ఓర చూపులూ , కోర చూపులూ , మొహాల మార్పిడులూ వగైరా టి.వి సీరియళ్ళ ఆనవాయితీలు లేకుండా చాలా నీట్ గా వున్నాయి . అందుకే వారు తీసిన సీరియల్ అని తెలిసి ' ఎదురీత ' చూసే సాహసం చేసాను .

రామకోటయ్య మొదటి భార్య ఒక కొడుకును కని చనిపోతుంది . ఆ బాబును చూసుకుంటూ వుందామనుకున్న రామకోటయ్య పరిస్తితుల వల్ల రెండో పెళ్ళి చేసుకుంటాడు . ఆ రెండో భార్య , మొదటి భార్య కొడుకు శేషు ను సరిగ్గా చూసుకోదు అన్న నెపం తో శేషుబాబు ను ఆస్తి తో సహా తీసుకుపోతుంది అమ్మమ్మ . రామకోటయ్య బుచ్చిరెడ్డిపాలెం లో వున్న తన పూర్వీకుల ఆస్తిని మొత్తం శేషుబాబు కు ఇచ్చి , వరిశలేరు వెళ్ళిపోతాడు .భార్య సులోచన , ఇద్దరు కూతుళ్ళు సత్య , వీణ , కొడుకు రాజా తో స్వయంకృషితో సంపాదించుకున్న 40 ఎకరాల పొలము తో,హాయిగా వుంటారు. ఆ వూరి లో అందరికీ తలలో నాలుకలా వుంటూ , గౌరవం పొదుతుంటాడు . అంత చక్కని కుటుంబం లో కాలక్రమేణ వచ్చే మార్పులు , శేషుబాబు అమ్మమ్మ సుగుణమ్మ పెట్టిన చిచ్చుతో ఎలాంటి మార్పులు వస్తాయి , ఆ మార్పులను ఎలా ఎదురొడ్డి తట్టుకున్నారు అన్నదే కథ . ఆ సీరియల్ ను ఇక్కడ చూడవచ్చు .అన్ని కథలూ మన ఇంట్లోనో , పక్కింట్లోనో జరిగినట్టుగా వున్నాయే తప్ప , ఏదో సీరియల్ చూస్తున్నట్లుగా లేదు .

కుటుంబపు పెద్దగా , ఓ తండ్రిగా రామకోటయ్య పాత్ర చక్కగా మలిచారు . పిల్లలను క్రమశిక్షణతో ,మంచి విలువలతో ఎలా పెంచాలో రామకోటయ్య పాత్ర చూపిస్తుంది .ఎన్ని అవాంతరాలొచ్చినా , ఎవరు ఎంత బెదిరించినా బెదిరిపోక , తను చూసిన హత్య గురించి కోర్టులో సాక్షం ఇస్తాడు . అందే పిల్లల కు ఆదర్శం ఐయింది . ఎన్ని కష్టాలు వచ్చినా బెదిరిపోక ధైర్యం గా నిలబడతారు . తము నమ్మిన దానిని ఆచరిస్తారు . కుటుంబమంతా చక్కగా కలిసి మెలిసి వుంటారు .కుటుంబం మధ్య అనురాగాలు , ఆప్యాయతలు చక్కగా చూపించారు . అందుకే అన్యాయం చేసిన అన్నయ్యను కూడా ఆదరిస్తారు .వారిదగ్గర పనిచేస్తున్న వెంకట్రావును ఇంటి మనిషిలా కలుపుకుంటారు . పెద్దరికం ఇస్తారు . చివరికి మెస్స్ కు ఓనర్ ను చేస్తారు . ఆడపిల్లలైనా విధి ని ధైర్యంగా ఎదురుకుంటారు . రాజా చివరి ఉత్తరాలు చదువుతుంటే నిజం గా కళ్ళలో నీరు తిరిగాయి .

మిగిలిన పాత్రలు కూడా చక్కగా నటించారు . సుగుణమ్మ గా కనిపించిందేకాని , శివపార్వతి గా కనిపించలేదు .ఆ పాత్ర మీద ఎంత కోపం వస్తుందంటే , సుగుణమ్మ ఎదురుగా కనిపిస్తే కొట్టాలన్నంత . అంటే అంత బాగా చేసిందన్నమాట . శేషుబాబు చివరి వరకూ డమ్మిలా వున్నా చివరలో చక్కని పరిణితి చూపించాడు . పెద్దన్నయ్యగా తండ్రి బాధ్యత లు చేపడతాడు .భాస్కర్, గౌతం , అంకయ్య, బెనర్జి , బుచ్చిబాబు, వెంకట్రావు , వెంకయ్య, నీలిమ ,విజయ్ ఇంకా మిగిలిన పాత్రధారులు అందరూ బాగా చేసారు .

ఇక చిత్రీకరణ , కథ , మాటలు బాగున్నాయి . మేకప్ కూడా సహజం గా వుంది .నిర్మాతకో , దర్శకుడికో పొడుగుజడలంటే ఇష్టమనుకుంటాను . అందుకే హీరోయిన్లకే కాదు వీలైనంతవరకు ఆడపాత్రలన్నిటికీ పొడుగు జడలుంటాయి . కాకపోతే ఇంకొంచం శ్రధ్ధ తీసుకుంటే ఇంకా బాగుండేది .అప్పుడప్పుడు సవరాలు కనిపిస్తూ వుంటాయి:) అరణ్య కు పఫ్ తీయకుండా మామూలుగా జడవేస్తే బాగుండేది . చీరలు చక్కగా కట్టారు . పాత్రధారుల ఎంపిక కూడా బాగుంది . సత్య పాత్రకు వీణను తీసుకున్నా , వీణ పాత్రకు సత్యను తీసుకున్నా సరిపోయేవారు కాదు . రాజా పాత్రధారి ముద్దుగా వున్నాడు . ఆ పాత్ర చనిపోయినప్పుడు చాలా దుఖం వచ్చింది . చంపకుండా వుంటే బాగుండు అనిపించింది . కాని ఆ తరువాత కథ అంతా దానిమీదే ఆధారపడి వుంది కదా :) అంతా బాగుంది కాని ఇందులో కాస్త కోర చూపులు ఓరచూపులు కొద్దిగా ఎక్కువైనాయి .అందులో నటించినటీనటుల పేర్లు , వారి పాత్ర పేర్లతో చూపిస్తే బాగుండేది . నాలాంటి వారు ఎవరు ఎవరిగా నటించారో తెలీక తన్నుకలాడుతారుకదా మరి :) ముందునుంచీ తాపీగా తీసుకొచ్చి చివరలో హడావిడి ముగించినట్లు అనిపించింది .

ఈ సీరియల్ కథా రచయత ; గంగరాజు గుణం ,

మాటలు , కథనం , ఆజాద్ చంద్రశేఖర్,

నిర్మాత ; ఊర్మిళా గుణం ,

దర్శకుడు ; వాసు ఇంటూరి ,

సంగీతం ; యస్. పి బాలచంద్రన్ ,

గాయకుడు ; యస్.పి బాలసుబ్రమణ్యం ,

రచయత; చిర్రాపూరి విజయకుమార్ ,

మేకప్; నల్ల శ్రీను .

అసలు ,వీరే రాధ- మధు టీం తో యద్దంపూడి నవల ఇంకోటి సీరియల్ గా తీస్తే చూడాలని వుంది :)))

Tuesday, June 26, 2012

మా వీధి మహారాణి కి పురుడొచ్చింది :)




మొన్న రాత్రి మంచి నిద్రలో వున్నాను . "బౌ . . . వూ. . " అన్న అరుపులతో మెలుకువ వచ్చింది . లేచి టైం చూస్తే 1 గంట కావస్తోంది . అబ్బ ఈ కుక్కలకు అర్ధరాత్రీ లేదూ . . . అపరాత్రీ లేదు ఒకటే మొరుగుతూవుంటాయి అని విసుక్కుంటూ పడుకున్నాను . కాని ఎంతసేపటి కీ అరుపు ఆగదు . కొంపదీసి మనింట్లోనుంచి కాదుకదా అన్నాను అప్పుడే లేచిన మావారి తో . ఏమో చూద్దాం అని తలుపు తీసారు . మెట్ల మీద నిలబడి మా తలుపు వైపు చూస్తూ అరుస్తోంది మావీధి మహారాణి . మమ్మలిని చూడగానే తోకవూపటం మొదలుపెట్టింది . పో పో అని వెళ్ళ గొడితే మెట్లు దిగి మావైపు చూసి అరుస్తోంది . గేట్ బైట దాని ఫ్రెండ్ అరుస్తోంది . అర్ధరాత్రి మద్దెల దరువు ఇదేమిగోల , పోకుండా అరుస్తూ వుందేమిటి అని విసుక్కున్నారు మావారు . గేట్ తీయాలేమో . అది కడుపుతో వున్నట్లుంది . ఎట్లాగో ఇటు దూకింది కాని బయటకు దూకలేకునట్లుంది అని గేట్ తాళంచెవి తీసుకొచ్చాను . ఆయన తాళం తీస్తుంటే పక్కన తోకాడిస్తూ నిలబడి , తాళం తీయగానే బయటకు పరిగెత్తింది !

అది నిజంగానే మహారాణిలా ఫీలైపోతూవుంటుంది . రోడ్ మధ్యలో పడుకుంటుంది . ఏ వెహికిల్ వచ్చినా పక్కకు జరగదు . వాళ్ళు హారన్ వేయగా వేయగా ఎంతసేపటికో పక్కకు జరుగుతుంది . ఆపైన మా వీధి వాళ్ళ వెహికిల్ కాకుండా వేరెవరిదైనా అవుతే అరుచుకుంటూ దానిని కొంచం దూరం తరుముతుంది .మా వీధిలోకి ఎవరూ రావటానికి వీలులేదు ! మా ఇంటి ముందు కూడా కాపలాకాస్తూవుంటుంది . ఏమిలేదు అప్పుడప్పుడు అన్నం పెడుతుంటాము . ఎండాకాలం ఏమో మట్టి ముంతలో నీళ్ళుపోసి బయటపెడుతాము . పాపం దానికే ఆ విశ్వాసం .అదొక్కతే మావీధిని ఏకచత్రాదిపత్యంగా ఏలుతూ వుంటుంది . అప్పుడప్పుడు దాని చుట్టాలో , స్నేహితులో వస్తూ వుంటాయి . అప్పుడు వాటిని తీసుకొని మా వీధంతా ఓ రౌండు తిప్పితీసుకొస్తుంది . దాని పర్మినెంట్ అడ్డా మా పక్క ఇల్లు . ఇంతకు ముందు అక్కడ ఏవో ఆఫీసులుండేవి . దానితో అక్కడ దానిని అదిలించేవాళ్ళెవరూ లేరు . యధేచ్చగా వుండేది . ఇప్పుడు ఫ్లాట్స్ కట్టాక , అందులోకి ఓనర్స్ వచ్చాక దానిని రానివ్వటంలేదు . ఐనా ఏలాగోలాగు దూరిపోతూవుంటుంది . ఇదీ దాని బాక్ గ్రౌండ్ కథ :)

నిన్న పొద్దున బయటకు వెళ్ళి వచ్చి గేట్ తీస్తూ వుంటే , మావారు మీ మహారాణి కి కానుపైనట్లుందే అన్నారు . ఎక్కడా అని చూస్తూవుంటే మా ఎదురుగోడ దగ్గర పిల్లలతో పడుకొని వుంది . అయ్యో నేను చూడనేలేదు సారూ , ఎప్పుడు ఈనిందో ఏమో అనుకుంటూ మా శైలజ , విస్తరిలో అన్నం పెట్టుకొని దాని దగ్గరకు వెళ్ళింది . అదొక్కసారే గుర్రు మంది . దూరంగా పెట్టేసి వచ్చేసింది .నేను ఖారం పొడి చేస్తూవుంటే శైలజ , ఎదురుగా పురిటాలు వుంది . వేడి వేడి అన్నం లో కాస్త ఖారం పొడి , నెయ్యి వేసి కలిపి పెట్టిరానా అంది . ఇంకా నయం దాని జోలికి పోకు , కరుస్తుందేమో అన్నాను :)

రాత్రైసరికి వానవచ్చే సూచనలు కనిపించాయి . అయ్యో పాపం అది పసి కూనలతో బయట వుంది ఎలాగా అని తర్జన భర్జన పడుతున్నాను .ఇంతలో శైలజ వచ్చి అమ్మా మన టి.వి బాక్స్ వుంది అదా దాని కి కప్పిరానా అంది . అది అట్టపెట్టెకదా శైలజ తడిసిపోతుందేమో . పాపం కదలలేక నిస్త్రాణం గా పడుకొని వుంది అన్నాను . మరేమి చేద్దామమ్మా అంది శైలజ . అదే చూస్తున్నాను . పోనీ మన పోర్టికోలోకి తీసుకొద్దామంటే దగ్గరికెళితేనే గుర్రు మంటోంది . తిక్క ముండ కరిచినా కరుస్తుంది ఎలాగా అంటే పోనీ బియ్యం బస్తా కప్పి వస్తానమ్మా అని ఖాళీ బియ్యం బస్తా తీసుకొని వెళ్ళింది . కాని అది దగ్గరకు రానిస్తేనా ! ఒకటే గుర్రు మంటోంది . ఇంతలో ఆ ఇంట్లో ట్యుటోరియల్ కాలేజ్ పెట్టినతను బయటకు వచ్చాడు. వెళ్ళిపోవటానికి గేట్ వేస్తూ శైలజ ను చూసి ఏమిటమ్మా అక్కడున్నావు అని అడిగాడు . ఇక్కడ కుక్క ఈనింది సార్ . వానవచ్చేట్లుగా వుంది దానికి కప్పుదామంటే దగ్గరకు రానీయటం లేదు అని చెప్పింది . ఓరినీ ఇది ఇక్కడుందా . మధ్యాహ్నం నుంచి కనపడటం లేదేమా అనుకుంటున్నాను అని అంటూ దాని దగ్గరకు వెళ్ళాడు . అతని ని చూసి అదేమనలేదు .అతను దాని తల నిమురుతూ ఇక్కడున్నావా . పిల్లలు పుట్టాయా . బాగున్నయిరా నీ పిల్లలు . వానవస్తుందేమో లోపల పడుకుందువు కాని అని దానిని బుజ్జగిస్తూ , ఒకో పిల్ల ను తీసి బియ్యం బస్తా మీద పడుకోపెట్టాడు . ఆ బస్తాను తీసుకెళ్ళి లోపల మెట్ల కింద గదిలో పడుకో బెట్టాడు . ఈ లోపల నేను పాలు గిన్నెలో పోసి శైలజ కిచ్చి పంపాను . మొత్తాని కి దానిని సేఫ్ ప్లేస్ లోకి చేర్చి , పాలుపోసి అమ్మయ్య అని టెన్షన్ ఫ్రీ అయ్యాము :)

ఈ రోజు పొద్దున కాసిని పాలు గ్లాస్ లో ఇచ్చి , దానికి పోసి , పప్పీస్ ను ఫొటో తీసుకొని రా శైలజ అని పంపాను . అతను నేను పాలు తెచ్చి పోసాను లేమ్మా అన్నాడుట . ఐనా పాలు పోసి , ఫొటో తీసుకొని వచ్చింది . దానికి ఆ బస్తా నచ్చనట్లుంది , కూనలను ఓ పక్కన పడుకో బెట్టిందిట . పాల గిన్నె ఇంకో మూల పెట్టిందిట . దాని కి నచ్చినట్లు రూం సద్దుకుందన్నమాట :) మొత్తాని కి నువ్వు నీ అసిస్టెంటు మీ మహారాణి కి పురుడు పోసారన్నమాట అని మావారు నవ్వారు :)

Tuesday, June 19, 2012

నా మొక్కల దీనగాధ :(((((




మా వారి పూజ కోసం దేవుడి ముందు అంతా శుభ్రం చేసి , పూలు కోసుకొద్దామని ,పూల బుట్ట అందుకున్నాను . అందుకునే ముందు ఓక్షణం ఆలోచించాను పెద్ద ది తీసుకోనా చిన్న బుట్ట తీసుకోనా అని పెద్ద బుట్టైతే చాలా పూలు పడుతాయి. అమ్మో అన్ని పూలు కోయటమే ! అందుకని చిన్నదే తీసుకొని , ఎందుకైనా మంచిదని టేబుల్ మీద బ్రేక్ ఫాస్ట్ సద్ది , మెడిసన్స్ పెట్టి పూల కోసం బయిలుదేరాను :)

నాతో పాటు మీరూ వస్తున్నారుగా తోటలోకి :)































ఏ పూవు చూసినా కోయబుద్ది కాదు . చెట్టుకే అందం గా వున్నాయి అనిపిస్తుంది . తోట అంతా తిరిగి , మొక్కలన్నిటినీ పలకరించి , నాలుగు పచ్చగన్నేరు , నాలుగు రెక్కవర్ధనం , ఓ రెండు మందారాలు కోసుకొని , ఇంట్లోకి నడుస్తూవుంటే మావారు మెట్ల మీద ఎదురైనారు . అదేమిటి అప్పుడే వెళుతున్నారు , పూజ చేసుకోరా అంటే చేసాను అన్నారు . బ్రేక్ ఫాస్ట్ అన్నా అదీ ఐందన్నారు . మెడిసన్స్ వేసుకున్నారా అంటే ఆ అన్నారు . మరి పూలు కోసుకొచ్చాను , దేవుడి కి పెట్టరా అంటే నువ్వు పెట్టేయ్లే అని బై చెప్పి వెళ్ళిపోయారు ! ప్రతిరోజూ అంతే . తొందరగా పూలు కోసుకొద్దామనే వెళుతాను కాని ఎప్పుడూ అంతే :) ఈ నాలుగు మొక్కలకేనా అనకండి ఇంకా చాలా మొక్కలుండేవి .

వుండేవి అంటే హూం వుండేవి అంతే . ఇదంతా గత వైభవం ! ఏమి చెప్పను నా దీనగాధ ! మా పక్కన ఇల్లు కూల గొట్టారు . అది కూల గొట్టేటప్పుడే బోలెడు దుమ్ము . ఇంటి నిండా , వంటి నిండా చాలక నా మొక్కల నిండానూ . సరేలే దుమ్మే కదా అనుకున్నాను .ఫ్లాట్స్ కట్టటం మొదలు పెట్టారు . అడ్డం గా తెర కట్టారు పర్లేదు అనుకున్నాను . ఓ తెల్లారి పూలు కోసేందుకు వెళ్ళి చూద్దునుకదా కుండీల నిండా సిమెంట్ :( గబ గబా కుండీలన్నీ ఇంకో వైపుకు మార్చాను . ఐనా లాభం లేక పోయింది . సిమెంట్ పడ్డ కుండీలలోని మొక్క లన్నీ చచ్చిపోయాయి :( వాటిని చూసి కన్నీళ్ళు ఆగలేదు :( కనీసం మిగిలిన వాటినైనా బతికించుకుందామని పక్కింటి కీ దూరంగా జరిపాను . అంతేనా ? ఎండాకాలం మొదలైంది . మొక్కలని బాదం చెట్టు నీడ లోకి మారుద్దామంటే పక్కింటి చెత్త అక్కడి దాకా పడుతోంది . మే ఎండింగ్ ఐయ్యేసరికి మా బోర్ ఇక నీళ్ళు ఇవ్వలేనని చేతులెత్తేసింది ! దానికీ కారణం పక్కవాళ్ళే ! మా బోర్ 400 అడుగుల లోతైతే వాళ్ళు 800 దాకా వెళ్ళారు :(

ఓ పక్క మండించే ఎండలు .ఇంకో పక్క అరా కొరా వచ్చే మున్సిపాలిటీ నీళ్ళు , బోర్ నీళ్ళ తో ఎలాగో రోజులు వెళ్ళదీస్తూ ,బియ్యం గట్రా కడిగిన నీళ్ళూ అవీ ఎలాగో నీళ్ళుపోస్తునే వున్నాను . కాని ఎండ వేడి కి తట్టుకోలేక నిప్పులో మాడ్చినట్లుగా అన్ని మొక్కలూ నల్లగా మగ్గిపోయాయి . పాపం అలానే కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని మందారాలు పూలు ఇస్తూనే వున్నాయి .ఓ రోజు మందారాలు కోస్తూ వుంటే పక్కింటి ఆవిడ , ఈ ఎండలకి , కుండిలల్లో ఐనా మందారాలు బాగానే పూస్తున్నాయండీ అంటూ ధీర్గం తీసింది . చేతిలో వున్న పూల బుట్టతో ఒక్కటి తగిలిద్దామన్నంత కోపం వచ్చింది . తమాయించుకున్నాను . అంతే ఆ దిష్ఠి కి అవీ మాడి పోయాయి :( అటుపక్క , ఇటుపక్క వాళ్ళ మూలంగా నా మొక్కలన్నీ పోయాయి . వా వా (((((((





పూల మొక్కల గాధ ఇలా వుంది . నేను చేసిన పోషణకు చక్కగా జామకాయలు ఓ ఇరవైదాకా కాసాయి . దోరకాయలు చాలా రుచిగా వున్నాయి . ఈ సారి చెట్టంతా పూత పిందె వేసాయి . చెట్టు కళకళ లాడుతూ వుంది . ఓకాయ కొంచం పెద్దగా కూడా అయ్యింది .అది మా బెడ్ రూం కిటికీ నుంచి కోసుకునేట్లుగా వుంది . ఇంకొంచం మాగాక కోద్దామనుకున్నాను . కొంచమాగండి కళ్ళ నీళ్ళు తుడుచుకొని చెపుతాను . . . . . నిన్న ఎక్కడి నుంచి వచ్చిందో రామదండు , మూడు కోతులొచ్చాయి . ఆ కాయ తోపాటు చెట్టంతా దులిపి పెట్టాయి . కొమ్మలు విరిచేసాయి వాఆఅ (((((






ఇహ కొబ్బరిచెట్టు దగ్గరకి పదండి . ఈ సంవత్సరమంతా ప్రతి శనివారం దేవుడి కి ఓ కొబ్బరికాయైతే ఇస్తోంది . ఇదొక్కటే అన్ని వడుదొడుకులను తట్టుకొని నిలబడ్డది :)




ఈ దీన పరిస్తితులలో మొన్నటి నుంచి వాన పడుతోంది :) చావలేక మిగిలివున్న మొక్కలన్నీ దుమ్ము , సున్నం వంటి నిండా కొట్టుకొని వున్నాయి. ఈ రెండు రోజుల వానతో అవన్ని చక్కగా స్నానం చేసి పచ్చని పట్టుచీరలు కట్టుకొని ముస్తాబయ్యాయి .బొజ్జ నిండా నీళ్ళు తాగి దాహం తీర్చుకుంటున్నాయి. మా మాలి ఈశ్వరయను పిలిచి కొత్త మొక్కలు పెట్టించాలనుకుంటూ వుంటే మా వారు , ఎండాకాలం మన నీళ్ళ ప్రాబ్లం గుర్తుంచుకొని తెచ్చుకో మొక్కలని . ఆ తరువాత మళ్ళీ ఏడ్చుకుంటూ కూర్చుంటావు అని హెచ్చరించారు .అప్పటి సంగతి అప్పుడే :) ఇప్పుడైతే బోలెడు మొక్కలు లిస్ట్ లో వున్నాయి .

Tuesday, June 12, 2012

అమ్మకొడుకు



" మమ్మీ వాడు చూడు ఎంత ముద్దుగా వూడుస్తున్నాడో " పక్కింటి వాచ్ మాన్ కొడుకు ను చూపిస్తూ మా అమ్మాయి అంది . మా పక్కన కొత్తగా కడుతున్న ఫ్లాట్స్ లో వాచ్ మాన్ గా కొత్తగా వచ్చారనుకుంటా . ఓ చిన్న బాబు వాళ్ళ అమ్మ వూడుస్తుంటే ఇంకో చీపురు తీసుకొని పక్కన వాడూ వూడుస్తున్నాడు . వెధవ ఆ చీపిరిలో సగం కూడా లేడు . సంవత్సరమున్నర వుంటుందేమో వాడి కి.. చాలా ముద్దుగా వున్నాడు .కష్టపడి ఆ చీపురును సాగదీస్తూ , పడుతూ లేస్తూ వూడుస్తున్నాడు . వాడి కి మేము చూస్తున్నామని ఎలా అర్ధమైందో , మా వైపు చూసి చేయి వూపాడు . వాడే వాళ్ళ అమ్మకు సాయ పడుతున్నట్లు పేద్ద ఫోజులూ వీడూనూ :) కాసేపు వాడిని ముచ్చట గా చూసి లోపలి కి వెళ్ళిపోయాము .

మా అమ్మాయి వెళుతుంటే బై చెప్పటానికి బయటకు వచ్చాము .ఫ్లాట్స్ లో మా ఇంటి వైపు గోడ దగ్గర పొయ్యి పెట్టి వుంది . అందులో కట్టెలు భగ భగా మండుతున్నాయి . పొయ్యి మీద ఏదో వుడుకుతోంది. ఇంతలో పక్క నుంచి ఆ చిన్నూగాడు పరిగెత్తుకుంటూ ఆ పొయ్యి దగ్గరకు వచ్చేస్తున్నాడు . . . ఒకాసారే అందరమూ ఉలిక్కి పడ్డాము . మావారు ఏయ్ . . . ఏయ్ . . . అని గాభరగా పిలుస్తూ గబ గబ మెట్లు దిగసాగారు . మావారి కేకలు విని గోడ పక్క నుంచి వాళ్ళ అమ్మ లేచి , నేను ఇక్కడే వున్నా సారూ అంది . అమ్మయ్య మా అందరి గుండెలు కుదుటబడ్డాయి . . . ఐనా మావారు వూరుకోలేదు . వాడి అమ్మను , నాన్నను పిలిచి చిన్న పిల్లవాడి తో జాగ్రత్తగా వుండండి . సాయంకాలం రోడ్ మీద చూసాను వాడి ని అని క్లాస్ పీకారు . అప్పుడు మేము గేట్ దగ్గరే వున్నాము సారు అన్నాడు వాడి నాన్న. నీ మొహం నువ్వెక్కడో గేట్ దగ్గర వున్నావు . వాడు రోడ్ మీద వున్నాడు ఏదైనా వెహికిల్ వస్తే వాడికి తప్పుకోవటం వచ్చా ? మోటార్ సైకిల్ మీద పిల్లలు జోరుగా వెళుతుంటారు . వాడిని బయటకు రానీయకండి అని ఇంకా గట్టిగా క్లాస్ తీసుకున్నారు . . .

అదో అలా . . . ఆ రోజు నుంచి బాల్కనీ లో కూర్చొని వాడి ని చూస్తూ వుండటం ఓ వ్యాపకమైపోయింది నాకు . వాడు ఎంత సేపూ వాడి అమ్మ వెనకాల వెనాకాలే తిరుగుతూ వుంటాడు . ఆమె పని చేసుకుంటూ వుంటే ఏదో సాయం చేయబోతూ అడ్డం పడుతూ వుంటాడు . ఆమె ఒకోసారి ముద్దుగా ఎత్తుకొని ముద్దుపెట్టుకుంటూ . . . అప్పుడప్పుడు కసురుకుంటూ వుంటుంది . సాయంకాలం కాగానే నల్లా దగ్గర స్నానం చేయించి , ఇంత పోడర్ మెత్తి , మంచి బట్టలు తొడిగి ముస్తాబు చేస్తుంది . ఆమె నన్ను పట్టించుకోదు కాని , ఆ దొంగ వెధవకి నేను వాడి ని గమనిస్తున్నానని ఎట్లా తెలుస్తుందో నా వైపు చూసి చిరునవ్వులు చిందిస్తాడు . ఒకోసారి అంజాన్ కొడుతుంటాడు . అలా ఓసారి ముస్తాబై వాళ్ళ నాన్న తో ఎటో వెళ్ళాడు. ఓ రోజంతా కనిపించలేదు . నాకు ఏమీ తోచలేదు . మా పనమ్మాయి శైలజ ను పిలిచి వాడెటువెళ్ళాడు అని అడిగితే అమ్మమ్మగారింటి కి వెళ్ళాడటమ్మా అంది .ఓ రోజు తరువాత వచ్చేసాడు . వాళ్ళ అమ్మకు బోర్ కొట్టి తెచ్చేసుకుందిట . వాడి అమ్మకేమో కాని నేను మటుకు ఈ రెండు రోజులూ వాడిని చాలా మిస్సైయ్యాను :)

మళ్ళీ వాడి అమ్మ వెనకాల తిరుగుతూ వాడు , వాడిని చూస్తూ నేను సెటిలైపోయాము :) ఈ మగపిల్లలు చిన్నప్పుడంతా ఇలాగే అమ్మ కొంగు పట్టుకొనే తిరుగుతూవుంటారు . ఎక్కడి కి వెళ్ళాలన్నా అమ్మ సాయం రావలసిందే . నాన్నను ఏమి అడగాలన్నా అమ్మ ద్వారా అడిగించాల్సిందే . ఏమి చెప్పలన్నా అమ్మే . అంతగా అమ్మను అతుక్కుపోతారు . ఆ పైన పెరుగుతున్నా కొద్దీ అమ్మకూ దూరమైపోతారు . వాళ్ళ ఫ్రెండ్స్ , వాళ్ళ వ్యాపకాలు ఆ తరువాత వుద్యోగామూ బాధ్యతలూ అంటూ అమ్మ కొడుకు కాస్తా అమ్మ కు తన చిన్ననాటి మధురస్మృతులూ ,వెనకెనకే తిరిగే బుడతడు ఎంత ఎదిగిపోయాదు అనే ఆశ్చర్యమే మిగులుస్తాడు :) అమ్మతో మాట్లాడేందుకు సమయమూ దొరకదూ :) పాపం వాళ్ళైనా ఏమి చేస్తారు ఈ కాలం వుద్యోగాలే అలా వున్నాయి వేళాపాళా లేకుండా .వాళ్ళ తిండి వాళ్ళు తినేందుకే సమయం దొరకదు . ఇహ పక్కకేమి చూస్తారు :)

Tuesday, May 29, 2012

చావు తప్పితే చాలు

"47 సంవత్సరాల క్రిందట విడుదలైన ఈ నవల ఆ రోజులలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు .1962 నుంచి 1976 వరకు మూడు సార్లు పునర్ముద్రించబడినది .దాదాపు 15000 కాపీల వరకు అమ్ముడుబోయినాయి ఆ రోజులలోనే . ఈ నవల పుస్తకము వెనుకనున్న క్రింది వాక్యాలు నవల పట్ల ఉత్కంఠతని రెట్టింపు చేసాయి ."

చాలా సీరియస్ గా చదువుతున్నాను . ఇంతలో ఠప్ మని కరెంట్ పోయింది ."చావు తప్పితే చాలు " నవల లింక్ ను కార్తీక్ మూడు రోజుల కిందటే ఇచ్చాడు . అప్పటి నుంచి చదువుదామంటే తీరిక దొరకలేదు .తీరిక దొరికి తీయగానే ఇదీ సంగతి ! అంతటా గాఢాంధకారం . లాప్ టాప్ వెలుతురు తప్ప ఇంకేమీ లేదు . స్ట్రీట్ లైట్స్ కూడా పోయినట్లున్నాయి !చదవనా వద్దా అని కొంచం సేపు ఆలోచించి , చీకట్లో చేసే పనిమటుకు ఏముందిలే అనుకొని మళ్ళీ లాప్ టాప్ లో కి కళ్ళు తిప్పాను .
"భారతి భుజాల మీద ఏదో చేతులు వేసింది .మొహాని కి ఏదో రాసుకుంది ? ఏమిటది ?
మెట్ల మీద ప్రసాద్ చూసిన ఆకారం ఏమిటి ?మనిషి కాదని నిశ్చయం గా ఎందుకన్నాడు ?
వైకుంఠరావు చనిపోయి రెండు రోజులైంది .అతని శవం మేడ మీద కుర్చీలో ఎట్లా వుంది ? ఇంట్లో ఎట్లా తిరుగుతోంది ?
"దూరంగా పొండి, తలుపు దగ్గరికి వెళ్ళకండి " అని అరుస్తూ భారతి , ప్రసాద్ ని , శేఖర్ నీ ఎందుకు వెనక్కి లాగింది ?
ఈ పుస్తకం రాత్రిళ్ళు ముట్టుకోవద్దు .వంటరి గా వున్నప్పుడు చదవద్దు . భయం వేసినప్పుడు అప్పటి కి చదవటం ఆపి కొంత సేపటి తరువాత మళ్ళీ మొదలు పెట్టండి..!"

అక్కడి దాకా చదివాక గుండె టక్ టక్ మని కొట్టుకోసాగింది . ముందుకు చదవనా వద్దా అన్న మీమాంసలో పడ్డాను . ఇంతలో చిన్నగా ఏదో వెలుతురు కనిపించింది . . . . .

ఆ తరువాత . . . ఏదో నీడ లాప్ టాప్ మీద కు వచ్చింది . . . . .

ఆ పైన నా భుజానికి ఏదో మెత్తగా తగిలింది . . . . .

అంతే ఒక్క వుదుటున లేచి కళ్ళు మూసుకొని కెవ్ . . . కెవ్ . . . మని అరిచాను * * * * *
చీకట్లో భయపడతావని ఎమర్జెన్సీ లైట్ తీసుకొని వస్తే ఏమిటా అరుపులు అని మావారు , లాప్ టాప్ కిందపడకుండా పట్టుకుంటూ అన్నారు .

మెల్ల గా వీపు మీద కొట్టు కుంటూ " ఉష్ . . . మీరా " అన్నాను .

" మరెవరనుకున్నావు ? కిందికి వస్తావా ఇక్కడే కూర్చుంటావా ?"

"దయ్యమనుకున్నాను " ( స్వగతం ) " వస్తాను చీకట్లో ఇక్కడేమి చేస్తాను ? " ( పైకి ) అని లాప్ టాప్ క్లోజ్ చేసి కింది కెళ్ళిపోయాను .

నిన్న పగలు ఇహ ఆ నవల చదవకుండా వూరుకోలేక మళ్ళీ ఓపెన్ చేసాను .

చాలా టెన్షన్ గా ప్రాణాలు బిగబట్టుకొని చదువుతున్నాను . . .

" ఎక్కడో కరకరమని చప్పుడైనట్లు అనిపించి మగత నిద్ర లోంచి మేల్కొంది , కిటికీ రెక్కలు తెరిచి వున్నాయి.బయట బాగా చీకటి గా వుండటం వల్ల ఏమీ కనిపించటం లేదు .కళ్ళు మూసుకొని దుప్పటి మెడవరకూ కప్పుకుంది .. . . . . . . .
తను కదిలినా ఏ కొంచం శబ్ధం చేసినా ఆ చప్పుడు ఆగిపోతొంది .భారతి అడుగులో అడుగువేసుకుంటూ శబ్ధం వస్తున్నవైపు వెళ్ళింది . పెద్ద బీరువాలో నుంచి వస్తున్నాయి చప్పుళ్ళు.భారతి జాగ్రత్త గా విని తనలో తను నవ్వుకుంది .ఎలుకలైవుంటాయి .బీరువా లో చేరి గొడవ చేస్తున్నాయి .బీరువా తలుపుకు వున్న పిడి పట్టుకొని లాగింది .తలుపు తెరుచుకోలేదు . మళ్ళీ లాగింది .

పూర్తిగా చీకటిగా లేదు , కాని స్పష్టంగా కనిపించే వెలుగు లేదు గదిలో .బీరువా తలుపు తెరుచుకుంది .బీరువాలోంచి ఏదో వచ్చి మీద పడ్డది - చిన్నది కాదు - ఎలుక కాదు - పిల్లి కాదు .తన కన్న పొడుగ్గా వుంది . భారతి గుండె ఆగి పోయినంత పనైంది .నోట మాట రాలేదు .అరవటానికి వీల్లే కుండా గొంతు పూడుక పోయింది . . . "

"మాలా. . . "

"అబ్బ ఎందుకంత గావుకేక పెట్టారు . దడుచుకున్నాను . ఊహ్ . . . "

" గావుకేక ఎక్కడ పెట్టాను ? చిన్నగానే పిలిచానుకదా !"

" ఇంతకీ ఎందుకు పిలిచారు ?"

" జగన్ ను జైల్ కు తీసుకెళుతున్నారు . చూస్తావని పిలిచాను ."

మరి జగన్ నూ చూడాలి . భారతి గతేమయ్యిందో చదవాలి ! లాప్ టాప్ తో డ్రాయింగ్ రూం లో సెటిలై , ఓ కంట జగన్ నూ , ఓ కంట భారతినీ చూస్తున్నాను :)

"పద్మ నిద్ర లోనుంచి చటుక్కున లేచి , కళ్ళు పెద్దవి చేసి చీకట్లోకి తీక్షణం గా చూసింది . ఏమీ కనిపించలేదు .తలుపు పక్కన దీపం స్విచ్ వుంది . స్విచ్ నొక్క గానే క్లిక్ మన్న శబ్ధం వినిపించిందిగాని దీపం వెలుగ లేదు .పద్మ కి భయం వేసింది దీపం ఎందుకు వెలగ లేదు !"

* * * * * * * * * * * * * * * * * * * * *

"టార్చ్ వెలుగులో అతనికి కనిపించిన ఆకారం భయంకరం గా వుంది . ఆ టార్చ్ వెలుగు తప్ప ఇంకే వెలుగూ లేదు .అక్కడ వలయాకారం లో టార్చ్ వెలుగు అతని మీద పడుతోంది .దాదాపు ఏడడుగుల పొడుగు , రెండు చేతులూ పేకెత్తి పెట్టాడు . చేతులకు వేళ్ళు లేవు . మొండి చేతులు .తల వుంది కాని మొహం లేదు .మెడ వరకు నల్లని గుబురు జుట్టు .ఆ జుట్టు లోనుంచి రెండు కళ్ళు . వాటి చుట్టూ వలయాకారం లో మెరుస్తున్న గీతలను బట్టి అవి కళ్ళని తెలుస్తోంది . పెద్ద కడుపు .వెలుగు కాళ్ళ వరకూ పడటం లేనందువలన కాళ్ళు నేల మీద ఆని వున్నదీ లేనిదీ తెలీటం లేదు ."

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

"కెవ్వు మని కేక పెట్టింది భారతి .నల్లగా గడ్డ కట్టిన రక్తం .కళ్ళు కనిపించటం లేదు . ముఖరేకలు కనిపించటం లేదు . ఊపిరి పీల్చటం లేదు . చలనం లేదు .కళ్ళు తెరుచుకొని వున్నాయి కాని వాటిల్లో చూపులేదు . అది శవం . శవం కొయ్యబారిపోయింది . కొయ్యబారిన శవం ఆలింగనం లో తను ఇరుక్కుంది . ఆ శవం ఎవరిది ? . . . . .

* * * * * * * * * * * * * ** * * * * * * * * * * * * * * * * *

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

టి.వి లో టెన్ష పెరిగి పోతోంది .ఇక్కడ నవలలో అంతకన్నా భయంకరం గా టెన్షన్ పెరుగుతోంది . ఎక్కడ గుండె ఆగిపోతుందో అన్నంత టెన్షన్ . . .

ఇంత సస్పెన్స్ లో , ఇంత టెన్షన్ క్రియేట్ చేస్తూ వ్రాయటం ఒక్క కొమ్మూరి సాంబశివరావు కే చెల్లిందేమో ! నేను చదివిన మూడు నవలలూ ఒక దానిని మించి ఒకటి వున్నాయి . . .

మొత్తానికి జగన్ జైల్ దగ్గరకు వచ్చేసాడు .. . కార్ లో నుంచి దిగాడు . . . చిన్న గేట్ లో నుంచి లోపలి కి వెళ్ళాడు . . . గేట్ మూసుకుంది . . . . .

అమ్మ విజయమ్మ , కూతురు , కోడలు ను తీసుకొని దీక్ష మొదలు పెట్టింది . . . తరువాత ఏమి జరిగింది ????? టి. వి చూడుడు . . . .

నవల చదవటం మూ ఐపోయింది . ఈ ముక్కలు ముక్కల కథేమిటి ? అసలు కథేమిటి ? తెలుసుకోవాలని ఆసక్తి వున్నవారు ఇక్కడ చదువుడు .

Tuesday, May 22, 2012

డిటెక్టివ్ యుంగంధర్ అమ్మో మహా ఆక్టివ్



కికికి అని స్కూల్ కొచ్చినప్పటి నుంచి తెగ నవ్వేస్తోంది మా ఫ్రెండ్ స్వప్న . లీజర్ దొరికి నప్పుడు " ఎందుకబ్బా అంత నవ్వుతున్నావు ?" అని అడిగా .
" అది కాదబ్బా , ఈ రోజు మా చిన్నాన్నని మా తాత చెవి పట్టుకున్నాడు . మా నాన్నగారేమో , చదువూ సంద్యా లేకుండా ఆ పిచ్చి పుస్తకాలు చదువుతావురా అని తిట్టారు . "

" ఎందుకబ్బా ? ఏమిటా పిచ్చి పుస్తకాలు ?"

" అవేనే , కాలకూట పాన్ షాప్ లో కట్టి వుంటయ్ చూడు . అవి డిటెక్టివ్ పుస్తకాలంట . చదవకూడదట . మా చిన్నాన్న క్లాస్ పుస్తకం లో పెట్టుకొని చదువుతున్నాడు . మా నాన్నగారు చూసారు . "

ఓహో రోజూ ఇంటికి వెళ్ళేటప్పుడు హనమకొండ చౌరస్తాలో కాలకూట పాన్ షాప్ దగ్గర ఆ పుస్తకాలు తాడు కు కట్టి వుంటాయి చిన్న చిన్న పుస్తకాలు అవి చూస్తునే వుంటాను . అవి ఏమిటో అనుకున్నాను "డిటెక్టివ్ " పుస్తకాలన్నమాట . అవి చదవ కూడదన్నమాట . అవి చదువుతే పెద్దవాళ్ళు కొడతారన్నమాట . ఈ సత్యాలన్నీ మాకు నైంత్ క్లాస్ లో మా ఫ్రెండ్ చిన్నాన్న దెబ్బలు తినటం వల్ల తెలిసాయి . అప్పటి నుంచి కాలకూట పాన్ షాప్ (' కాలకూట 'ఏమిటా ? ఆ పాన్ షాప్ వాడు కలకత్తా పాన్ షాప్ కు 'కే ఏ' దగ్గర 'కే యూ అని రాసుకున్నాడు . వాడీ కీ ఇంగ్లీష్ అంతంత మాత్రమే వచ్చో ఏమో :)) ముందు నుంచి వెళుతున్నప్పుడల్లా ఆ పుస్తకాలను ఆసక్తిగా గమనించే వాళ్ళము .

ఆర్కే లైబ్రరీ లో చేరినప్పుడు ఓ పక్కగా డిటెక్టివ్ బుక్స్ అన్నీ పెట్టి వుండేవి . వాటిని దొంగ చూపులు చూసేదానిని కాని తీసుకొని చదివే ధైర్యం ఎప్పుడూ చేయలేదు , ఎందుకంటే అవి చదువుతే పెద్దవాళ్ళు కొడతారని మనసులో భయం వల్ల . కాని అప్పటికి నేనూ పెద్దదానినే అన్న సంగతి గుర్తులేదు :) ఆ మద్య కౌముది లో నంబర్ 888 కొమ్మూరి సాంబశివరావు నవల సీరియల్ గా రావటం చూసి, చదవాలనిపించి ఎందుకైనా మంచిదని మావారి తో , ఏమండీ నేను డిటెక్టివ్ నవల చదువుదామనుకుంటున్నాను చదవనా అని అడిగాను . ఆయన నా వైపు విచిత్రం గా చూసి చదువూ నన్నెందుకడుగుతున్నావు ? నీ ఇష్టం ఏమైనా చదువు అన్నారు :) అంతే ఆ సీరియలైపోయేదాకా మహా ఇంటెరెస్టింగా చదివాను . అంతే ' డిటెక్టివ్ యుగంధర్ ' కు ఫానయ్యాను . వెంటనే ఆర్కే లైబ్రరీ కి వెళ్ళి కొమ్మూరి సాంబశివ రావు డిటెక్టివ్స్ కావాలి అని అడుగుతే రషీద్ ' అయ్యో సారీ మేడం ఈ మద్యనే ఎవరూ చదవటం లేదని అన్నీ తీసేసాను " అని చావు కబురు చల్లాగా చెప్పాడు . ఎవరెవరికిచ్చాడో కూడా గుర్తులేదట . హూం . . . ఆ తరువాత ఎంత వెతికానో ! కోటీ వెళ్ళి సెకండ్ హాండ్ బుక్ షాప్స్ లలో కూడా వెతికాను .ఎవరి దగ్గర పుస్తకాలు వుంటాయని అనుమానం వుందో వారందరినీ అడిగాను . మా జయ ఎక్కువగా బుక్స్ షాప్స్ కు వెళుతూ వుంటుందని తననీ ఆ పని మీదే పెట్టాను . ఇప్పుడు నాకూ ఆ బుక్స్ చదవాలని పిచ్చి ఎక్కించావు . ఎక్కడా అవి దొరకటం లేదు అని అంటూవుంటుంది . చివరకు ఇదో మల్లాది వెంకట కృష్ణమూర్తి , కొమ్మురి సాంబశివరావు నవల " ప్రాక్టికల్ జోకర్ " ఆధారం గా రాసిన నవల కొని తెచ్చింది . జనవరి లో కౌముది లో కొమ్మూరి సాంబశివరావు నవల "చీకటి కి వేయి కళ్ళు " మొదలైంది . ఇది చదువుతున్నాను కాని ఎంతైనా ఆ పసుపు రంగు కాగితాలు , రంగు రంగుల అట్టలు వున్న చిన్ని చిన్ని పుస్తకాలు చదవాలి అన్న కోరిక మాత్రం తీరే దారి కనిపించటం లేదు . ఇట్స్ టూ లేట్ :(

కొమ్మూరి శైలి ఎంతో సరళం గా సులభం గా వుటుంది . పుస్తకం చదవటం మొదలు పెడితే మధ్యలో ఆపటం కష్టం .ముందు ఏమి జరుగు తుందా అనే ఉత్కంట తో సాగుతుంది . అసలు యుగంధర్ హంతకుడి ని పట్టుకునే దాకా చిత్ర , విచిత్ర మైనా మలుపులతోఎ సాగిపోతుంది . ఇక సీరియల్ గా వస్తుంటే చెప్పేదేముంది , నెక్స్ట్ మంత్ ఎప్పుడొస్తుందా , కౌముది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆరాటమే . తరువాతది చదివే దాకా టెన్షనే :)

కొమ్మూరి సృష్టించిన 'యుగంధర్ ' పాత్ర చాలా విశిష్టమైంది.ఆరడుగుల మూడంగుళాల పొడుగు , బలిష్టమైన శరీరం , విశాలమైన నుదురు ,కోలగా వున్న మొహం ,కండలు తిరిగిన చేతులు ,తీక్షణం గా వున్న కళ్ళు , నల్లని దట్టమైన కనుబొమలతో క్లైంట్స్ కు ధైర్యం కలిగించేలా , శత్రువులకు గుండెలదిరేలా , శత్రువులకు సిమ్హ స్వప్నం లా వుంటాడు యుగంధర్ . ఆయన అసిస్టెంట్ రాజు కూడా ఆయన తెలివితేటలకు ఏమీ తీసిపోడు .దేశం కు శత్రు గూఢాచారు లతో ఏదైనా ఆపద వాటిల్లుతుంది అనుకుంటే ప్రైం మినిస్టర్ , హోం మినిష్టర్ లు ప్రత్యేక అధికారాల తో ఆయనకే కేసును అప్పగిస్తారు .ఏదైనా కేసు చేపడితే తన ధైర్యం తో , తెలివితేటలతో దానిని చేదించి కాని వూరుకోడు యుగంధర్ . అంతటి ప్రతిభాశాలి .

భాస్కరరావు కుటుంబ సభ్యుల మీద రకరకాల ప్రాక్టికల్ జోక్స్ వేసి ఎవరో బాధ పెడుతున్నారు . ఆ బాధలు భరించలేక అతడిని పట్టుకోమని డిటెక్టివ్ యుగంధర్ ను కోరాడు భాస్కరరావు . అతని ని ఎలా పట్టుకుంటారు అన్నదే " ప్రాక్టికల్ జోకర్ " నవల . ఆ ప్రాక్టికల్ జోక్స్ ఏమిటి , యుగంధర్ ఆ ప్రాక్టికల్ జోకర్ ను ఎలా పట్టు కున్నాడు అన్నది ఆ నవల . ఆ కథ నేను చెబితే సస్పెన్స్ ఏముంటుంది ? చదివి తెలుసుకోవలసిందే :)

Thursday, May 10, 2012

బుజ్జిగాడు పాస్ అయ్యాడా :)))))



నిన్న వీడి ని " నా ప్రపంచం " లో చూసి నప్పటి నుంచి వాడి కి బేద్ద ఫాన్ ను ఫాన్ కాదు . . . కాదు . . . ఏ.సి ని అయ్యాను . యస్ జే గారు ఈ బుజ్జిగాడి మీద ప్రేమ తో మాటి మాటి కీ మీ ఇంట్లోకి తొంగిచూస్తూ వుంటే బాగోదనుకొని , వాడిని మా ఇంటి కి తెచ్చేసు కున్నాను .మిమ్మలిని అడగలేదని ఏమనుకోకండి ప్లీజ్ :)

వాడిని మా ఇంటికే కాదు , మా ప్రమదావనం కు కూడా తీసుకెళ్ళాను . ఫేస్ బుక్ లో కూడా పెట్టాను :) అందరూ వాడిని చూసి తెగ ముచ్చటపడిపోతున్నారు .

ఇంకా ఈ బుజ్జిగాడు ఎక్కడైనా వున్నాడా అని గూగులమ్మని అడిగితే ఇదో ఇక్కడ కూడా వున్నాడు అంటూ ఈ చోటు చూపించింది .

నిద్ర లో , మెలుకువలో నన్ను తెగ వేటాడేస్తున్నాడు . ఎప్పుడూ వాడిని చూడటమే :)అసలు ఆ బుడుగ్గాడి కళ్ళల్లో టెన్షన్ చూడండి . నోట్లో వేళ్ళేసుకొని , ఆ వేళ్ళను ను అదిమి పెట్టి కళ్ళు పెద్దవిగా చేసి ఎంత ముద్దుగా పేపర్ లోకి చూస్తున్నాడో . ఆ ముక్కెంత ఉబ్బించాడో పిడుగ్గాడు:) అలా చూస్తూ వుంటే అమాంతం ఎత్తుకొని , ఆబూరె బుగ్గల మీదా , కళ్ళ మీదా , ముక్కు మీదా ముద్దుల వర్షం కురిపించేయాలనిపిస్తోంది నాకైతే :) చిన్ని వెధవ ఎంత ముద్దొచ్చేస్తున్నాడో !

వేలడంత లేడు పొట్టెగాడు , రిజల్ట్ అంటే మరీ అంత టెన్షనా :) ఐనా ఆటెన్షన్ ఎందుకంటారు ? వాడు పాసైనాడా లేదా అనా ? లేక వాడి గర్ల్ ఫ్రెండ్ పాసైందా లేదా అనా ? ఇంతకీ ఈ మురిపాల బుడుగ్గాడు పాసయ్యాడా :)

Tuesday, April 24, 2012

బ్లాగ్ తారలే దిగి వచ్చిన వేళ - బహుమతులే తెచ్చిన వేళ

నిన్నటి నుంచీ జ్యోతి గారు , జ్ఞానప్రసూన గారు ,శ్రీలలిత గారు , ప్లసులలో జ్యోతి గారు, వరూధిని గారు , రమణి గారు మా గెట్ టుగేదర్ గురించి చెప్పిన విశేషాలు వింటున్నారు కదా , ప్లీజ్ ప్లీజ్ నా ముచ్చట్లు కూడా కాస్త విందురూ ! అవును మరి నాకు బోలెడు బహుమతులు వచ్చాయి . అవి చూపించవద్దూ :) అవి చూపించే ముందు మా గెట్ టుగేదర్ గురించి శ్రీలలిత గారు రాసిన కవిత చదవండి . ఆ తరువాత తీరిగ్గ నాకొచ్చిన బహుమతులు చూద్దురుగాని . ముందే చెపుతున్నాను అవి చూసి ఎవరూ కుళ్ళుకోవద్దు :)


మహిళలందరు కలిసి ముదమార జతకూడి
మాటల మూటలు కట్టగ మాల ఇల్లు చేరేరట...
సంతోషం, సంరంభం, సల్లాపాల వెల్లువలై
వేసవిలో వానపాటలు వరదల్లే పొంగేనట...

ఒకరి వంట ఒకరు మెచ్చ
ఒకరి మాట ఒకరు చెప్ప
నీది బాగంటే నీదిబాగంటూ
ఒకరినొకరు మెచ్చుకొనగ
ఎదుటివారిలోని మంచి
ఎదుటివారి గొప్పతనం
ఒకరికొకరు గుర్తించి
ఒకరినొకరు పలుకరించి

జ్యోతి మనకు గురువంట
ప్రసూనయే స్ఫూర్తి యంటూ
స్వాతి, సుజన లనే మామ్మలకు
మరల మరల గుర్తు చేస్తూ..
(ఇక్కడో పిట్ట కథ..సుజ్జి మాలాకి ఫోన్ చేసి "అక్కడందరూ పెద్దవాళ్ళుంటారు..నేనొస్తే బాగుంటుందా?"
అన్నట్టందిట. "ఫరవాలేదు, బాగుంటుంది ర" మ్మని సుజ్జికి చెప్పి, మాలా ఆ విషయం మాతో చెప్పి, సుజ్జిని రమ్మని చెప్పిన ఆవిడ విశాలహృదయాన్ని చూపించుకున్నారు.
కాని మేము మాలా కి అంత పేరు వచ్చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా..అబ్బే..
నేనూ, పి.ఎస్.ఎమ్.లక్ష్మిగారు కలిసి సుజ్జి అన్న ఆమాట పట్టుకుని,
ఒక్కదాన్నీ ఏడి్పిస్తే ఏమైనా అనుకుంటుందని, సుజ్జికి తోడు స్వాతిని కూడా కలిపేసి, అక్కడున్నంతసేపూ వాళ్ళిద్దరినీ మామ్మలని చేసేసి, అలాగే పిలిచేసి, నేనూ లక్ష్మిగారు పేద్ద యూత్ లా ఫీల్ అయిపోయాం.. ఇక్కడ "మామ్మ" అన్నమాట వెనకాల అంత కథ వుందన్నమాట. )

ఆటలలో ముందుంటూ
పాటలతో "సై" అంటూ
ఒకరినొకరు చేయి పట్టి
మున్ముందుకు నడిపిస్తూ

సుజాత కూతురు సంకీర్తన
పెట్టిన పోటీలో ఓడి
సన్న మొగ్గ కళ్ళలోని
సంతోషం గమనించి..

నడుంకట్టి మన మాలే
వేడి వేడి పూరీలు
అప్పటికప్పుడు చేయించి
అందంగా అమరిస్తే

వెనక వెళ్ళి వేలు పెట్టి
అత్తగారి పోజ్ కొట్టి
ఫొటో కావాలన్న స్వాతి , సుజ్జి ల
చిలిపితనం చిరునవ్వులు తెప్పిస్తే...

పూర్ణం బూరెలు నిండుగ తెచ్చిన
అపర అన్నపూర్ణ..
స్వీట్ లివిగో తినమంటూ
ఉమాదేవి, సుజాతలు..

చిప్స్ నమిలి, కోక్ పుచ్చుకోమని
యాత్రాలక్ష్మి హడావిడి..
కేరట్ తురుముతొ మెరుస్తున్నవెన్నలాంటి ఆవడలు
చెప్పకనే చెప్పెనులే వరూధిని గొప్పలు

ఘుమఘుమ లాడిపోతున్న పుదీనా చట్నీ,
కమ్మనైన బజ్జీల ఎంచక్కటి మజ్జిగపులుసు
అందరికీ తెలిసినదే అది షడ్రుచుల ప్రతిభేనని
కావాలా వేరేగా దానికొక ప్రతిభ తెలిపే పట్టీ

నా పులిహోరకు న్యాయం చెయ్యమంటూ
రమణి పెట్టిన గట్టి హుకుం
కొత్తావఘాటెక్కించే స్వాతి ఆవకాయ ,
వేడి పూరీలకు జత కలిసే
శ్రీలలిత చోలే

ఇంకా ఇంకా చాలాచాలా
తిని పెట్టి, తాగి పెట్టి (సోడా కలుపుకోకుండా)
ఆటలాడి అలసిపోయి
పాట పాడి సొక్కి పోయి

వేడి వేడి తేనీటితో
అలసటంత తీర్చుకుని
ఇంటిముఖం పట్టామందరం
తప్పదు కదా ఇంక అంటూ....

అసలు మా ఇంట్లో గెట్ టుగేదర్ కు పిలుపుల కార్యక్రమం లో వరూధిని గారు సాయపడ్డారు . పాపం ఆ విషయంలో ఆవిడే ఎక్కువ కష్టపడ్డారు . ఇహ వచ్చిన వాళ్ళతో పేర్లు చెప్పించే , పరిచయాలేమో లక్ష్మి గారు చేసారు . మరి నేనేమి చేసానంటారో ఇదో ఇవన్నీ అందుకుంటూ బిజీగా వున్నానన్నమాట :)

క్లుప్తంగా ఇవీ మా గెట్ టుగేదర్ విషయాలు .

ఇహ పోతే అందరికనా ముందుగా వచ్చిన జ్ఞానప్రసూనగారు నాకో చక్కటి రామాయణం పుస్తకం బహుమతిగా ఇచ్చారు .అలా వూరికే ఇచ్చేసారనుకుంటున్నారా ? కాదు ఎంచక్క నన్ను ఎలా పొగిడుతూ ఇచ్చారో చూడండి :)

పరిమళము , తెల్లదనము
చల్లదనమూ , కోమలత్వమూ
కలగలిసిన మల్లెపూలవంటి
మాలాగారికి చిక్కని స్నేహముతో
జ్ఞానప్రసూన
అని వ్రాసి మరీ ఇచ్చారు .

అది అలాంటి ఇలాంటి ది కాదు .యస్. ఆర్ . కొల్లూరి గారు , కంప్యూటర్ గ్రాఫిక్ పైంటింగ్స్ వేసి రచించిన అపురూపమైన పేంటింగ్స్ తో వున్నది . దానికి ఇంకో విశేషము కూడా వున్నది . అదేమిటంటే ఈ పుస్తకము అమ్మగా వచ్చిన డబ్బులను బ్లైండ్ స్కూల్ వారికి డొనేషన్ గా ఇస్తారట .

ఇదిగో ఇదే ఆ పుస్తకం ;



జ్ఞానప్రసునగారితోపాటు వచ్చిన శ్రీలలిత గారు గేంస్ అరేంజ్మెంట్ చూసారు . అంటే గిఫ్ట్స్ కొనుకొచ్చారు , తంబోలా సెట్ తెచ్చారన్నమాట .ఇంకా జై శ్రీరాం , జై శ్రీ క్రిష్ణ ఆడించారన్నమాట . అలాగే ఇదిగో , ఇది వారి నాన్నగారు వ్రాసిన పుస్తకం " పిడపర్తి వారు , కథలూ - గాధలు " ని బహుమతిగా ఇచ్చారు .




మండే వేడి , ఫాన్ గాలీ వేడిని ఆపదు . ఏ.సీ ఆపదు . వుడికి వుడికి పోతూ , ఉష్ బుష్ అనుకుంటూ చిరాకు పడే బదులు చక్కని పాటలు వింటూ వుంటే వేడీ గీడీ అన్నీ ఎగిరిపోతాయి . కదా ! అందుకే జ్యోతి గారు చల్ల చల్లగా కూల్ కూల్ గా ఆ పాత మధురాలను డి. వి. డి లో వెయ్యి తెలుగు పాటలు , వెయ్యి హిందీ పాటలు ఓపికగా అప్లోడ్ చేసి ఇచ్చారు .ఎంత గొప్ప ఐవిడియానో కదా !




ఓపక్క చక్కని పాటలూ , ఇంకోపక్క ఓ చక్కటి నవల చదువుతూ వుంటే హబ్బ . . . స్వర్గం ఎంత దూరంలోనో లేదు . మనమే స్వర్గం లో వున్నట్లు అనిపించదూ . ఆ అనుభూతిని పొది ఆనందించమనే సుజాత గారు చూడండి ఎన్ని పుస్తకాలిచ్చారో ! గదిలోనే ఎందుకు చల్లని సాయంకాలం హాయి హాయిగా తోటలో కూర్చోండీ అంటూ , బ్రహ్మకమలం , మల్లె మొక్కలు కూడా ఇచ్చారు తెలుసా !!!!!






సుప్రసిద్ద రచయిత్రి మంథా భానుమతిగారు , ఆవిడ స్వహస్తాలతో ఆటోగ్రాఫ్ చేసి , ఆవిడ నవల ఒకటి , కథలసంపుటి ఒకటి ఇచ్చారు . ఎంత హాపీసో :) మంథా బానుమతి గారు నాకు పాత స్నేహితులే . దాదాపు 20 ఏళ్ళ తరువాత కలుసుకున్నాము . చాలా సంతోషం కలిగింది . సమయం వున్నంతలోనే పాత సంగతులు గుర్తు తెచ్చుకున్నాము .



హేమిటీ ఏదో ఏ మూలనుంచో ఇన్ని పుస్తకాలా అని గొణుగుడు వినిపిస్తోంది . ముందే చెప్పానా కుళ్ళవద్దు అని :) అన్నీ తీరికగా చదివి పరిచయం చేస్తానులెండి .

Thursday, April 5, 2012

ప్రజ్ఞాధురీణ ప్రసూన



ఉరకలు వేసే ఉత్సాహానికి వయసు అడ్డు వస్తుందా ? అంటే రాదనే చెపుతున్నారు "సురుచి " బ్లాగర్ 'జ్ఞానప్రసూన ' గారు . ఆవిడ కు ఖాళీ సమయము ,సమయాన్ని వేస్ట్ చేయటము , తోచక పోవటము అంటే తెలియదు . టీచర్ గా ఉద్యోగ బాధ్యల నుంచి విరమించుకున్న తరువాత , రచనలు చేయటము , వివిధ విషయాల పైన రేడియో లో ప్రసంగించటము , కుట్ట్లు , బొమ్మల తయారీ , అబ్బో ఆవిడ చేయని పని లేదేమో !వారిని "సాయి కల్పం" అనే అసోషియేషన్ వారు ' విశిష్ఠ వ్యాకుల ' పురస్కారం తో సత్కరించారు .

ఇలా ప్రసూన గారి గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు . అందుకే ఈనాడు ' వసుంధర ' లో ప్రసూన గారి గురించిన వ్యాసం వచ్చింది .

ప్రస్తుతము ప్రసూన గారు "సిరి " లో పేంటింగ్ ( చిత్రకళ ) ను నేర్చుకుంటున్నారు . ఇప్పటి వరకు 30 క్లాసులకు అటెండ్ అయ్యారట. . పెన్సిల్ స్కెచ్ లు ఎంత బ్రహ్మాండం గా వేసారో చూడండి . మొన్న మార్చ్ 31 నుంచి నుంచి నిన్న 3 వ తారీకు వరకు , సిరి వారు ,' హోటల్ మార్రిట్ట్ ' లో నిర్వహించిన పేంటింగ్ ఎక్షిబిషన్ లో జ్ఞానప్రసూన గారివి రెండు పేంటింగ్స్ ప్రదర్షించారు .

ఆ పేంటింగ్స్ ఇవే ;






నిన్న నేనూ , పి. యస్ .యం . లక్ష్మిగారు , శ్రీలలిత గారు ప్రసూనగారి పేంటింగ్స్ చూసి వచ్చాము . ఇంటి కి రండమ్మా ఇంకా చాలా వున్నాయి చూపిస్తాను అన్నారు . మేము వీలుచూసుకొని ఒక రోజు వారి ఇంటి కి వెళ్ళి మిగితా పేంటింగ్స్ కూడా చూసి రావాలనే అనుకుంటున్నాము . ప్రసూన గారు పెట్టిన బిస్కెట్స్ తిని , వారిని అభినందించి వచ్చాము .


జ్ఞానప్రసునగారి నుంచి నేర్చుకోవలసిన వి ఎన్నో వున్నాయి . జ్ఞానప్రసూన కాదు ప్రజ్ఞా ప్రసూన గారు. ఆవిడ ఉత్సాహం చూస్తునే మనమూ వున్నం ఎందుకు అనుకున్నాం మేము ముగ్గురం :)

జ్ఞాప్రసూన గారు మీరు చిరకాలం ఇలాగే ఉత్సాహం గా ఉండి మాలాంటి వారందరికీ మార్గదర్శం కావాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను . మరో సారి మీకు హృదయపూర్వక అభినందనలండి .

Saturday, March 31, 2012

సీతారాములు మా ఇంటికి వచ్చిన శుభవేళ



మా కాలనీ లో ఈ రొజే సీతారామ కళ్యాణం చేసుకున్నాము . ఉదయం 10 .30 కు మా సీతారాములు , లక్ష్మణ , ఆంజనేయ సమేతంగా మా కాలనీ లో ఊరేగింపు గా బయలు దేరారు . మా ఇంటికి ఎప్పుడు వస్తారా అని , పాదప్రక్షాళణ కోసం నీరు , సుందరమైన మా సీతారాములకు ధృష్ఠి తీసేందుకు కొబ్బరికాయ , పూజించేందుకు పసుపు , కుంకుమ పూలు తీసుకొని ఎదురుచూస్తూ నిలబడ్డాను .






ఎదురు చూస్తుండగా సీతారామ ,లక్ష్మణ ఆంజనేయులను మా వారు తీసుకొని రానే వచ్చారు .



నేను సీతారామ,లక్ష్మణ , ఆంజనేయుల పాదాలను కడిగి , కొబ్బరికాయ తోదృష్ఠి తీసి ఇవ్వగా , మావారు కొబ్బరికాయను కొట్టారు . ఆ తరువాత నేను , మా వదినగారు హారతి ఇచ్చాము .









మా కాలనీ అంతా ఊరేగించిన తరువాత , మా పార్క్ లో వేసిన వేదిక మీద సీతారామలక్ష్మణ ఆంజనేయులను స్థాపించాము .



ఆ పైన కన్నుల పండుగ గా సీతారాముల కళ్యాణం జరిపించాము . మావదినగారు , అన్నయ్యగారు కన్యాదాతలుగా ,గొట్టిముక్కల నరసిమ్హారావుగారు వారి పత్ని వరుని తల్లి తండ్రులుగా వ్యవహరించారు . కళ్యాణము లోని కొన్ని ముఖ్యఘట్టాలు .

కన్యాదానం ;



మంగళసూత్రం ;



మాంగల్యధారణ ;



ముత్యాల తలంబ్రాలు ;



పెళ్ళికావలసిన అమ్మాయిలు కొంగుబట్టి తలంబ్రాలు పట్టుకున్నారు .ముత్తైదువులకు పసుపు కుంకుమ తాంబూలములిచ్చారు .

రంగ రంగ వైభోగం గా కళ్యాణం జరిగాకా , పానకం వడపప్పు , లడ్డూ ప్రాసదం తీసుకొన్నాము .

సీతా కళ్యాణ వైభోగమే , రామా కళ్యాణ వైభోగమే .

శ్రీరామనవమి శుభాకాంక్షలు .