Wednesday, December 27, 2017

నా చిన్నారి సాహితి నవవసంతాలు పూర్తిచేసుకుంది :)





రాధామాధావాల పావడాను  కట్టి
జాజిపూలను జడలో తురిమి
గులాబీల అందాన్ని పొదుపుకొని
పారిజాతాల పరిమళాన్ని అద్దుకొని
ముద్దమందారాన్ని ముద్దుగా అరచేత ఉంచుకొని
మంచు బిందువులో తడిసిన నందివర్ధనం లా
ఓ వెన్నెల కిరణంలా, ఓ పిల్ల తెమ్మెరలా

నా చిన్ని ప్రపంచంలోకి వచ్చి, నాలోని ఊహలకు రూపాన్ని ఇస్తూ , నన్ను తొమ్మిది సంవత్సరాలుగా సాహితీవనంలో విహరింపజేస్తున్న నా చిన్నారి "సాహితి" కి జన్మదిన శుభాకాంక్షలు.

Saturday, December 23, 2017

కొత్త కాపురం లో సునామీ సృష్ఠించబోయిన "జీవన తరంగాలు "





లక్ష్మీవసంత గారు , పద్మాదాశరధిగారు యద్దనపూడి సులోచనారాణి గారి నవల "జీవనతరంగాలు " మీద సమీక్ష రాసారనీ, అది తనకు చాలా నచ్చిందనీ, ఆ సమీక్ష ఇస్తూ రాసిన పోస్ట్ నాలోని కొన్ని జీవంతరంగాలు నవల కు సంబంధించిన జ్ఞాపకాలను తట్టిలేపింది.
అవి మా పెళ్ళైన తొలిరోజులు. ముందుగా పటియాలా వెళ్ళి, అక్కడ ఒక నెల మాత్రమే ఉండి , పూనా మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజ్ లో మా ఏమండీ కి కోర్స్ రావటం వల్ల, ఒక పెద్ద నల్ల పెట్టెలో వంట సామునులు, ఒక నల్ల పెట్టెలో ఏమండీ యూనిఫాం లు షూస్ , కిట్స్ , ఒక సూట్కేస్ లో ఆయన బట్టలు, ఒక సూట్కేస్ లో నా బట్టలు తో  పూనా వెళ్ళి కొత్తకాపురం మొదలు పెట్టాము.ఆయనకు పూనాలో వకటిన్నర సంవత్సరము, సికింద్రాబాద్ లో ఒకటిన్నర సంవత్సరము ట్రైనింగ్ అన్నమాట. పూనా వెళ్ళగానే ఆయన యంసియం లో చేరటమే కాకుండా నన్ను వాడియాకాలేజ్ లో బియే మొదటి సంవత్సరం లో చేర్చారు. ఇద్దరమూ పొద్దున్నే ఏడుగంటలకే ఇల్లు వదిలేవాళ్ళము.పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే కూర, పప్పు కూడా వండేసుకొని , అన్నం మాత్రం వచ్చాక వండేదానిని.ఏమండీగారి ప్రిన్సిపుల్స్ వల్ల అమ్మ దగ్గర నుంచి కాని , అత్తగారి దగ్గర నుంచి కాని ఏమీ సామానులు  తెచ్చుకోలేదు.హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు భాటియా షాప్ లో అత్యవసరమైన గిన్నెలు మాత్రము కొనుకొచ్చుకున్నాము.ఒక్కో నెల ఒక్కోటి కొందామని ఏమండీ ప్లాన్ అన్నమాట. అప్పుడప్పుడే గాస్ స్టవ్ లు వస్తున్న కొత్త రోజులు .కొంచం కాస్ట్లీ కదా అందుకని ఇంకో నెలకు అని పోస్ట్పోన్ అవుతోందన్నమాట.కిరోసిన్ స్టవ్ మీదే వంట . అన్నట్లు అప్పుడు మా పెళ్ళిలో మా ఏమండీ ఫ్రెండ్ కాప్టెన్ నగేష్ ప్రెషర్ కుక్కర్ బహుమతిగా ఇచ్చినా అందులో ఎట్లా వండాలో తెలీక చాలా ఏళ్ళు వండలేదు :)  ఇదీ నేపధ్యం :)
ఒక రోజు కాలేజ్ నుంచి వచ్చేసేటప్పుడు మా ఫ్రెండ్ నందిని ఎందుకో రైల్వే స్టేషన్ కి వెళుదాము రమ్మంది.సరే నని తనతో పాటు వెళ్ళాను.అక్కడ బుక్ స్టాల్ లో ఆంధ్రజ్యోతి వారపత్రిక కనిపించింది. అప్పటి వరకు చందమామ,బాల మిత్ర, టాంసాయర్, బారిష్టర్ పార్వతీశం లాంటి బాల సాహిత్యం చదివానే కాని పెద్దవాళ్ళ పుస్తకాలు చదవలేదు.అమ్మ ప్రభ తెప్పించేది చదువుదామని ఉన్న అమ్మ కోపం చేస్తుందని చదివేదానిని కాను.ఇక్కడ అమ్మలేదుగా కోపం చేసేందుకు ఐనా పెళ్ళైంది, కొంచం పెద్దదానయ్యాను కదా అని ధైర్యం చేసి కొనేసాను. ఇంటికి వెళ్ళాక,అన్నం వండి ఏమండీకి పెట్టి మధ్యాహ్నం క్లాస్ లకు పంపించేసి,పుస్తకం  తెరవగానే "జీవనతరంగాలు"సీరియల్ కనిపించింది.అప్పటికే అది మొదలై కొన్ని వారాలైంది.ఐనా జరిగిన కథ చదివి , సీరియల్ చదివాను.సీరియల్ తగ నచ్చేసింది. కాని ఒక్క పేజీ నే ఉంది.రెండోపేజ్ లో సగం ఇచ్చి, మిగితా సగం లో అడ్వటైజ్మెంట్ ఇచ్చాడు.ఎంత నిరాశగా అనిపించిందో!ఇక అప్పటి నుంచి ప్రతివారం (ఏ వారం వచ్చేదో గుర్తులేదు మరి ) దానికోసం ఎదురు చూడటం , బస్ లో నుంచి కిరికీ బుక్ షాప్ లో కనిపించగానే బస్ దిగేసి , పత్రిక కొనుక్కోని ఇంకో బస్ ఎక్కి వెళ్ళటం అలవాటయ్యింది. పత్రిక రాగానే కొనకపోతే మరునాడు దొరికేది కాదు. ఒక సారికిరికీ లో అప్పుడే ఐపోయాయి అన్నా డు.మరి మరునాడుస్టేషన్ లో కూడా దొరకకపోతే ప్రాణం నెక్స్ట్ వీక్ దాకా ఆగదుకదా అందుకని మళ్ళీ స్టేషన్ దాకా వెళ్ళి బుక్ కొనుక్కొని ఇంటి కి వచ్చేసరికి ఏమండీ అటూఇటూ అచార్లూ పచ్చార్లూ చేస్తున్నారు. మరి అన్నం తిని మళ్ళీ క్లాస్ కు వెళ్ళాలికదా! ఎందు కంత లేట్ అయ్యింది అన్నారు.చిన్నగా నసుగుతూ, భయపడుతూ చెప్పాను.అప్పుడేమీ అనలేదు.అన్నం గబగబా వండేసాను. తిని వెళ్ళిపోయారు.అలా రెండు సార్లు జరిగింది.ఇక మూడోసారి కోపం ఆపుకోలేక నా చేతిలోని పత్రిక లాక్కొని , కిటికీ లొనుంచి బయటకు విసిరేసారు :( అప్పటికి ధుమధుమాలాడుతూ వెళ్ళిపోయినా, నా ఏడుపు ముఖం చూసి జాలేసిందేమో, సాయంకాలమే వెళ్ళి గాస్ స్టవ్ కొనుకొచ్చారు :) ( అహా మొహం ఎంత వెలిగిపోతోందోకదా!) ఇంకెప్పుడూ ఇంత ఆలశ్యంగా రాకు అని వార్నింగ్ కూడా ఇచ్చారనుకోండి. ఇక అప్పటి నుంచి ఆహా నా జీవన తరంగమా అనుకుంటూ  కాలేజ్ లో చివరి క్లాస్ ఎగొట్టి , స్టేషన్ కే డైరెక్ట గా వెళ్ళి పత్రిక తెచ్చుకునేదానిని.
సంవత్సరమన్నర తరువాత సికింద్రాబాద్ వచ్చాము.స్టూడెంట్ ఆఫీసర్, పైగా సింకిద్రాబాద్ పెద్ద స్టేషన్ కాబట్టి ,చాలా మంది ఆఫీసర్ లు ఇంటికోసం వేటింగ్ లో ఉండేవారు.కాకపోతే మారేడ్పల్లిలో  ప్రైవేట్ ఇల్లు అద్దెకు తీసుకొని ఉండేవారు.అప్పటికే నేను ప్రెగ్నెంట్ ని. ఎనిమిదో నెల.అందుకని మేము విడిగా వెళ్ళ కుండా హైద్రాబాద్ లో మా అత్తగారింట్లోనే వున్నాము.ఏమండీనే పొద్దున్నే ఐదుగంటలకు సికింద్రాబాద్ వెళ్ళి, పి.టి, క్లాస్ లు, మధ్యాహ్నం గేం క్లాస్ లు, తరువాత కంబైండ్ స్టడీస్ అన్నీ ముగించుకొని రాత్రి పదింటికి వచ్చేవారు.ఒక్కోసారి ఎక్జాంస్ ఉంటే మెస్ లోనే ఉండిపోయేవారు. ఇక ఇంట్లో ఏమో తరంగాల కోసం కోసం నా మది తల్లడిల్లిపోతుండేది :) నేను బయటకు వెళ్ళేదానిని కాదు మరి ఓపలేనిదానిని కదా! ఏమండీ కంటికే కనిపించరు.మామగారిని పత్రిక కొని తేమని అడగలేనుగా :( అంతే అప్పుడప్పుడు తరంగం లా గుర్తుతెచ్చుకోవటే కాని మరిచిపోయేందుకు ప్రయత్నం చేసాను :( 
అలా అలా కాలం వెళ్ళబుచ్చుతూ ఉండగా మా అమ్మాయి డిసెంబర్ లో పుట్టింది.అప్పట్లో తెలంగాణా ఎజిటేషన్ మూలంగా కాలేజీలు బంద్ అయ్యి, జూన్లో మొదలు కావలసిన కొత్త సెషన్స్ జనవరిలో మొదలయ్యాయి.ఒక ఎకడమిక్ ఇయర్ వేస్ట్ అయ్యిందన్నమాట. నాకేమో కలిసి వచ్చింది.ఫిబ్రవరీ లో ఇంటిపక్కనే ఉన్న రెడ్డీ వుమెన్స్ కాలేజ్ లో బియే సెకండ్ ఇయర్ లో చేరాను. ఒక రోజు మా ఫ్రెండ్ స్వర్ణ హడావిడిగా వెళుతుంటే ఎక్కడికి అని అడిగాను.ఆర్కే లైబ్రరీ కి. ఇప్పుడే వెళ్ళక పోతే ఆంధ్రజ్యోతి దొరకదు.అంది.ఆంధ్రజ్యోతి పేరు వినగానే టక్కున తలెత్తి ఎక్కడా ఆ లైబ్రరీ అన్నాను.ఇక్కడే నువ్వు పుస్తకాలు చదవవా ? అంది .ఎందుకు చదవను నాకూ ఆంధ్రజ్యోతి కావాలి అని తన వెంట వెళ్ళాను.తను రెంట్కు తీసుకుంది.నేను కొనుకున్నాను.గబగబా పేజ్ తిప్పి చూసాను.జీవనతరంగాలు సీరియల్ ఉంది. ఐపోలేదు.ప్రాణం లేచి వచ్చింది.అప్పుడే స్వర్ణ ఈ రచయిత్రిదే సెక్రెట్రీ అని నవల ఉంది.చాలా బాగుంది చదువు అని రెంట్ కు ఇప్పించింది.అలా ఆలైబ్రెరి లో చేరిపోయాను.పత్రిక రెంట్ పది పైసలు రోజుకు.నవల పావలా. జీవన తరంగాలు చాలా నిరాశపరిచేది.ఒక్కటిన్నర పేజ్ మాత్రమే ఇచ్చేవాడు.ఒక్క నిమిషం లో చదవటం ఐపోయేది.ఉక్రోషం, కోపం, ఏడుపు వచ్చేవి :) అలా చాలా ఏళ్ళు వచ్చినట్లుంది ఆ సీరియల్.
ఆ విధము గా జీవనతరంగాలు మా కొత్తకాపురం లో సునామీలా వచ్చి చిన్నపాటి తుఫానుగా మారింది.నన్ను యద్దనపూడి అభిమానిగా చేసింది. లైబ్రరీ కి అంకితం చేసి పుస్తకాల పిచ్చి తగిలించింది :)  ఓ విధంగా రచయిత్రిని అయ్యేందుకు దారి వేసింది :) అన్నట్లు మా ఇంట్లో గాస్ పొయ్యి కూడా వెలిగించింది :)


Sunday, December 17, 2017

ప్రపంచ తెలుగు మహా సభలో నేను మా ఏమండి :)














ప్రపంచ తెలుగు మహా సభలో నేను మా ఏమండి :)
"ఎప్పుడెళుతున్నావు సభలకు ?" అని అడిగారు ఏమండి.
"హుం నేనేమి వెళుతాను ? ఓ నాలుగు రోజులాగి వెళ్ళవచ్చుగా పి.యస్.యం గారు.ఉమ్హు సరిగ్గా సభల ముందే యు.యస్ వెళ్ళారు. జి.యస్.లక్ష్మిగారు బిజీట.మీరు రానన్నారు.కనీసం రిజిస్టర్ చేయించుకోమన్నా చేయించుకోలేదు.నేనొక్క దాన్ని ఏ వెళుతాను?" నిట్టుర్చాను.
కాసేపు ఇద్దరమూ పేపర్ చూడటం లో మునిగిపోయాము.సడన్ గా "నేను ఈ నాలుగు సెలెక్ట్  చేసాను ."అన్నారు ఏమండి.
"ఏమిటి?ఎందుకు?"
"నువ్వు తెగ ఫీలైపోతున్నావుగా అందుకు సభలకు వెళుదామని ఈ ప్రోగ్రాంలు సెలెక్ట్ చేసాను.పద వెళుదాము ."
"అబ్బా కవి సమ్మేళనాలా ? హాస్యావధానానికి వెళుదాము.ఐనా మీకోసం ఫాం తీసుకొని, ఆధార్ కార్డ్, ఫొటో తీసుకొని వచ్చినా రిజిస్టర్ చేయించుకోలేదు.మరి మిమ్మలిని రానిస్తారో లేదో"నా సందేహం.
"పరవాలేదు లే నా ఐడి కార్డ్ తెస్తాను.రానీయకపోతే తిరిగి వచ్చేద్దాం"భరోసా.
అంతే చెంగున లేచి అలమారా తీసి ఏమి చీర కట్టుకోనబ్బా అనుకుంటూ ఇక్కత్ సారీ కట్టుకుందాము తెలంగాణా అభిమానం ఇలా చాటుకుందాం డన్ :)
హాస్యావధానం చూద్దామనుకుంటూ రవీంధ్రభారతి చేరాము.కార్ బయటనే ఆపేసారు. లోపల జనం హడావిడిగా తిరుగుతున్నారు. ఒక చోట క్యూ కనిపించింది.మరి ఏమండీగారి కి రిజిస్ట్రేషన్ చేయించాలి కదా అని అక్కడికి వెళ్ళి ఈ క్యూ ఎందుకు అని అడిగాను.ఇది ఎంప్ల్యాస్ క్యూ అని సమాధానం వచ్చింది.మరి రిజిస్ట్రేషన్ ఎక్కడ అంటే రిజిస్ట్రేషన్ లు ఐపోయాయి.అన్నారు.ఇంకో కౌంటర్ దగ్గర అడుగుతే రిజిస్ట్రేషన్ లేకపోయినా వెళ్ళవచ్చు అన్నారు.మరి ఎక్కడా హాస్యావధానం అని వెతుకుతుంటే
"మీరు మాలాకుమార్ గారు కదూ" అని వినిపించింది.ఈ మహాసభలల్లో నన్ను గుర్తుపట్టి పలకరించేవారెవరు చెప్మా అని తెగ హాశ్చర్యపోతూ వెనక్కి తిరిగాను. ఓ అబ్బాయి చక్కగా చిరునవ్వులు నవ్వుతూ కనిపించాడు.ఎవరో గుర్తుపట్టలేకపోయాను.జానీ భాషా నమ్మా అన్నాడు.హోరినీ నువ్వా ?ఫొటోలల్లో గడ్డంతో గంభీరంగా ఉంటావు ఇంత చిన్న అబ్బాయివా అని ఇంకా బోలెడు హాశ్చర్యబోయాను!మా ఏమండీ కి పరిచయం చేసాను.ఈ అబ్బాయిని ఇంతకు ముందు చూసావా అని అడిగారు.జాని లేదండి ఫొటో చూసాను కదా అందుకే గుర్తుపట్టాను అని చెప్పి నవ్వి తన పుస్తకాలు ఇచ్చాడు.ఇంతలో ఇంకో ఆవిడ వచ్చి జానీ ని పలకరించారు.ఆవిడ ఇందిర అని ఒక రచయిత్రి అని పరిచయం చేసాడు జానీ. కుంచె అని ఇంకో కార్టూనిస్ట్ ను అతను మా ఫొటో తీసాక పరిచయం చేసారు.మీ కార్టూస్ చూస్తానండి అన్నాను కుంచె తో. అనుకోకుండా వీళ్ళను కలవటము ఆనందం అనిపించింది.
ఆ తరువాత మేము ప్రోగ్రాం చూద్దామని వెళుతుంటే మెట్ల దగ్గర అంతా హడావిడిగా ఉంది.విడియోలు, ఇంటర్వ్యూ లు ఎవరెవరో ఎవరెవరినో తీసుకుంటున్నారు.ఆ హడావిడి చూస్తూ లోపలికి వెళ్ళాము.అత్తలూరివిజయలక్ష్మి గారు హాస్యవధానానికి వెళుతున్నాను ఎవరైనా వస్తే రండి అని చెప్పింది గుర్తొచ్చి ఆవిడకు ఫోన్ చేసాను.హాస్యావధానం దగ్గర చాలా రష్ ఉందండి లోపలికి వెళ్ళలేకపోయాను మేన్ హాల్ లో ఉన్నాను ,మీరు ఇటొచ్చేయండి సీట్లు ఉన్నాయి మీకు పెడుతాను అన్నారు.నేనూ మా ఏమండీ వచ్చాము అన్నాను,మీకూ మీ ఏమండీకి కూడా సీట్లు పెడుతాను రండి అన్నారు.సరే అని, ఐనా ఆశ కొద్దీ హాస్యావధానం వైపు వెళ్ళాము.అస్సలు లోపలికి వెళ్ళే సందేలేదు.కిక్కిరిసిపోయి ఉన్నారు.వేడి గాలులు బయటకు వస్తున్నాయి. నాకు గాభరావేసి మెట్ల దగ్గరే నుంచుండిపోయాను.ఏమండీ మాత్రం తలుపు దగ్గర నిలబడి కాసేపు విని నవ్వుకుంటూ వచ్చారు. బాగుంది మనం ఇంకొంచం ముందు వస్తే లోపలికి వెళ్ళేవాళ్ళం అన్నారు. ఒకవేళ ముందుగా వచ్చి లోపలికి వెళ్ళినా ఆ రష్ కు బయటకు రాలేక లోపల ఉండలేక ఉక్కిరిబిక్కిరి ఐపోయేదానిని అమ్మో అనుకుంటూ ఎందుకూ నవ్వుతున్నారు ఏమిటీ జోక్ అన్నాను.
"ఒకావిడ పాయసం చేస్తూ వాళ్ళాయనను కిస్ మిస్ లు తెమ్మన్నదిట.ఆయన రోడ్ మీద ఒక మిస్ ను చూసి బస్ మిస్సయ్యాడుట." దాని మీద నడుస్తొంది అన్నారు :)
మేన్ హాల్ కు వెళుదామని వెళుతే ఎంత ప్రయత్నించినా లోపలికి వెళ్ళలేకపోయాము అంత రష్.విజయలక్ష్మిగారికి ఫోన్ చేసి సారీ అండి లోపలికి రాలేకపోతున్నాము , మేము వెళుతున్నాము అని చెప్పి బయటకు వచ్చి ఊపిరిపీల్చుకున్నాము. బయట మెట్ల మీద ఓ అబ్బాయిని అడిగి ఫొటోలు తీయించుకొని లంచ్ కౌంటర్ వైపు వెళ్ళాము.అక్కడ మెళ్ళో రిజిస్ట్రేషన్ కార్డ్ ఉన్నవళ్ళనే రానిస్తున్నారు.మరి ఏమండీకి బిళ్ళ లేదుగా అందుకని దగ్గరలో ఉన్న పురానాధిల్లీ కి వెళ్ళి భోజనం చేసాము.
మిగితా వేదికలు కూడా అలాలా తిరిగొద్దాము అనుకొని ముందుగా యల్.బి స్టేడియం కు వెళ్ళాము.అక్కడ ఒక పోలీసు మా ఏమండీ కి బిళ్ళ లేదని ఆపేసాడు.ఆయన ఐ.డి కార్డ్ బయటకు తీయబోయారు ఇంతలో ఇంకో పోలీస్ వెళ్ళండి సార్ అన్నాడు.వాళ్ళు భార్యాభర్తల్లా ఉనారు ఆవిడనొక్కదాన్నే పంపటం ఎందుకని ఇద్దరినీ వెళ్ళమన్నాను అతను మొదటి పోలీస్ తో చెప్పటం వినిపించి ఔరా ముక్కూమొహం తెలీని వాళ్ళు కూడా నా బిక్క మొహం చూసి, నేను ఒక్కదాన్ని వెళ్ళలేనని కనుక్కుంటున్నారే! అనుకోవటం తప్ప నేనేమి చేయ్గలను!
గేట్ పక్కనే ఉన్న మ్యూజియం చూసుకొని వేదిక దగ్గరకు వెళ్ళాము.ఏమి ప్రోగ్రాంలు లేవు కదా ఎందుకు అన్నారు.ఐనా చూద్దాం అని తీసుకెళ్ళాను.సీటింగ్ అరేంజ్మెంట్ వేదిక అన్నీ చూసాను.అక్కడక్కడా కొంత మంది ఉన్నారు.వాళ్ళు ఏవో పనులు చేసుకుంటున్నారు.అక్కడే ఉన్న ఇద్దరబ్బాయిలను చూసి మాకు ఫొటో తీస్తారా అని అడిగాను.ఒకతను వచ్చి మమ్మలిని అటూ ఇటూ నిలబెట్టి ఫొటోలు తీసాడు.ప్రొఫెషన్ల్ లా తీసావు అని ఏమండీ జోక్ చేస్తే నవ్వుతూ నా సెల్ ఇచ్చాడు.అప్పుడు అతని బాడ్జ్ చూస్తే పోలీస్ అని ఉంది.నాలుక్కరుచుకొని హోరినీ పోలీస్ నే ఫొటో తీయమని అడిగానా అని సారీ అన్నాను.పరవాలేదు మేడం అన్నాడు అతను.మీరు యూనీఫాం లో లేరు సెక్యూరిటీ నా ? అంటూ ఏమండీ వాళ్ళతో కాసేపు ముచ్చట్లేసుకున్నారు.స్వజాతి అభిమానం :)
అక్కడి నుంచి స్టేడియం అంతా చుట్టేస్తూ వెనకవైపుకు వెళ్ళాము.అక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి.చాలావరకు మూసి ఉన్నాయి.కొన్ని స్వగృహ స్టాల్స్ అని తెరిచిఉంచారు.అక్కడ అన్నీ తెలంగాణా పలగారాలు (స్నాక్స్) అమ్ముతున్నారు .ఇంకొంచం లోపలికి వెళితే మన  కనిపించాయి. అన్నీ కిటకిటలాడిపోతున్నాయి.ఒక్కొక్కళ్ళు మోయలేనన్ని పుస్తకాలు కొని తీసుకెళుతున్నారు.చివరగా ఉన్న ఒక స్టాల్ లో ఒక పెద్దాయన ఒక్కరే ఉన్నారు.ఆయనతో ఏమండీ కాసేపు కబుర్లేసుకున్నారు.ఆయన విష్ణుసహస్రనామం పుస్తకం బొమ్మలతో , అర్ధం తో వేయించారు.అవి బయట ఎక్కడా చూడలేదు అని నేను అంటే ఆయన పుస్తకం అమ్ముకోవటంలోని ఇబ్బందులు, పబిషర్స్ డబ్బులు సరిగ్గా ఇవ్వకపోవటం చెప్పుకున్నారు.ఏమండీ అంతా ఓపికగా విని  500 లకు కొనుకున్నారు. ఆయన నన్ను మీరు పుస్తకాలేమీ వేయించలేదామ్మా అని అడిగారు.ఇదో మీరు చెపుతున్న సాధకబాధకాలు పడలేకే ప్రింట్ చేయించకుండా ఈ బుక్స్ తో సరిపెట్టుకున్నానండి అన్నాను నవ్వుతూ.నేనేమో సాఫ్ట్వేర్ అబ్బాయిలు కృష్ణచైతన్యవారి పుస్తకాలు  అమ్ముతుంటే పునర్జన్మం గురించిన పుస్తకం కొనుకున్నాను.
చిన్నగా బయటకు వచ్చేసరికి ఇద్దరికీ ఓపిక ఐపోయి ఇంక వేరే ఏ వేదికల దగ్గరకూ వెళ్ళ కుండా ఇంటికి వచ్చేసాము.అదీ సంగతి :)

ప్రపంచమహాసభల ఏర్పాట్లు అన్నీ చాలా ఘనంగా చేసారు.ప్రతినిధులుగా రిజిస్టర్ చేయించుకున్నవారికి ,బయటవారికి వసతి , రవాణా, భోజన ఏర్పాట్లు , వేదికల వద్ద సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేసారు.రిజిస్టర్ చేయించుకోని వారికి ప్రవేశము వుంది కాని , భోజనము , సిట్టింగ్ అరేంజ్మెంట్స్ లేవు.దూరంగా గాలరీలో కూర్చోవాలి.బాంబే నుంచి వచ్చిన మా ఫ్రెండ్ రమేష్ గారు మంచి హోటల్ లో ఇచ్చారండి.హోటల్ లోనే బస్ కూడా ఉంచారు వేదికల దగ్గరకు తీసుకెళ్ళేందుకు అన్నారు. పోలీస్ వారు కూడా చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు.మరి విమర్శలు వస్తున్నాయి అంటే, మన ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకుంటేనే పొరపాట్లు జరుగుతాయి మరి ఇంత పెద్ద ఫంక్షన్ లో జరగకుండా ఎలా ఉంటాయి.పొరపాట్లూ సహజమే!విమర్శలూ సహజమే! అవన్నీ పట్టించుకోకుండా మన ఊళ్ళో జరుగుతున్న ఇంత పెద్ద సాహితీ సదస్సును చూసి ఆనందిద్దాము అనుకుని వెళ్ళి వచ్చాము.