Saturday, March 31, 2012

సీతారాములు మా ఇంటికి వచ్చిన శుభవేళ



మా కాలనీ లో ఈ రొజే సీతారామ కళ్యాణం చేసుకున్నాము . ఉదయం 10 .30 కు మా సీతారాములు , లక్ష్మణ , ఆంజనేయ సమేతంగా మా కాలనీ లో ఊరేగింపు గా బయలు దేరారు . మా ఇంటికి ఎప్పుడు వస్తారా అని , పాదప్రక్షాళణ కోసం నీరు , సుందరమైన మా సీతారాములకు ధృష్ఠి తీసేందుకు కొబ్బరికాయ , పూజించేందుకు పసుపు , కుంకుమ పూలు తీసుకొని ఎదురుచూస్తూ నిలబడ్డాను .






ఎదురు చూస్తుండగా సీతారామ ,లక్ష్మణ ఆంజనేయులను మా వారు తీసుకొని రానే వచ్చారు .



నేను సీతారామ,లక్ష్మణ , ఆంజనేయుల పాదాలను కడిగి , కొబ్బరికాయ తోదృష్ఠి తీసి ఇవ్వగా , మావారు కొబ్బరికాయను కొట్టారు . ఆ తరువాత నేను , మా వదినగారు హారతి ఇచ్చాము .









మా కాలనీ అంతా ఊరేగించిన తరువాత , మా పార్క్ లో వేసిన వేదిక మీద సీతారామలక్ష్మణ ఆంజనేయులను స్థాపించాము .



ఆ పైన కన్నుల పండుగ గా సీతారాముల కళ్యాణం జరిపించాము . మావదినగారు , అన్నయ్యగారు కన్యాదాతలుగా ,గొట్టిముక్కల నరసిమ్హారావుగారు వారి పత్ని వరుని తల్లి తండ్రులుగా వ్యవహరించారు . కళ్యాణము లోని కొన్ని ముఖ్యఘట్టాలు .

కన్యాదానం ;



మంగళసూత్రం ;



మాంగల్యధారణ ;



ముత్యాల తలంబ్రాలు ;



పెళ్ళికావలసిన అమ్మాయిలు కొంగుబట్టి తలంబ్రాలు పట్టుకున్నారు .ముత్తైదువులకు పసుపు కుంకుమ తాంబూలములిచ్చారు .

రంగ రంగ వైభోగం గా కళ్యాణం జరిగాకా , పానకం వడపప్పు , లడ్డూ ప్రాసదం తీసుకొన్నాము .

సీతా కళ్యాణ వైభోగమే , రామా కళ్యాణ వైభోగమే .

శ్రీరామనవమి శుభాకాంక్షలు .

Wednesday, March 28, 2012

శ్రీలలితగారికి అభినందనలు




'శ్రీలలిత' బ్లాగర్ శ్రీలలిత గా పరిచయమైన జి. యస్. లక్ష్మి గారు మంచి రచయిత్రి , కవియిత్రి . ఆవిడ కథలు , నవలలు అడపాదడపా వివిధ పత్రికల లో కనిపిస్తూనే వుంటాయి.ఈ మద్యే విడుదలైన నెట్ మాగజీన్ మాలిక లో జి. యస్ లక్ష్మి గారి కథ "అమ్మగారి కీ దండం పెట్టు" ప్రచురించారు . ఏ టాపిక్ ఇచ్చినా కొద్దిసేపట్లోనే చక్కని కవిత అల్లగలరు .ఆవిడ రచయిత్రే కాదు , బాగా ఎంబ్రాయిడరీ చేస్తారు . మంచి మంచి గ్రీటింగ్ కార్డ్స్ చేస్తారు .చక్కగా మట్లాడుతారు .అసలు కోపమన్నదే తెలియదు . ప్రతి విషయాన్ని పాజిటివ్ కోణం లోనే చూస్తారు . ఇన్ని రోజుల నుండి ఆవిడతో స్నేహితమున్నా ఈ మంచి గుణాలను నేను మటుకు నేర్చుకోలేదు .కాకపోతే ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు , ఇదే శ్రీలలితగారైతే ఏమి చేస్తారు అనుకొని కొంచం కంట్రోల్ మటుకు చేసుకుంటున్నాను :)

ముపై సంవత్సరాల క్రితం అప్ప్డప్పుడే ఆడపిల్లలు చదువుకొని , వుద్యోగాలలో ప్రవేశిస్తూ , సొంత వ్యక్తిత్వం ను పెంచుకునే ప్రయత్నం చేసే రోజులు . కాకపోతే వొకరకంగా అటు వ్యక్తిత్వను కాపాడుకోవటానికి , లొంగిపోవటానికి మద్యలో వుండే సంధికాలం అది అనుకోవచ్చు .అదో ఆ కాలం లోనే అతనికి ఆమె కు వివాహమైంది .తనను భద్రం గా చూసుకుంటాడనే నమ్మకం తో అతని చిటికిన వేలు పట్టుకొని అతని జీవితంలోకి వచ్చింది ఆమె . అతను భద్రం గానే చూసుకున్నాడు కాని ఆమె తన మాటవిన్నప్పుడే ! ఆమె అభిప్రాయలకు , ఆశలకు విలువ ఇవ్వలేదు . చివరకు కూతురి కి నామకరణం కూడా అతని ఇష్టప్రకారమే జరిగింది . అప్పుడే ఆమె మనసు చితికిపోయింది . నిర్లిప్తంగా వుండటం అలవాటు చేసుకుంది .వారిద్దరూ ఇలా ప్రతికూల భావనలతో వుండగానే తల్లీ తండ్రి చనిపోయారు . అక్కలు వాళ్ళ వాళ్ళ కుటుంబాల తో బిజీ ఐపోయారు . తమ పిల్లలిద్దరూ పెద్ద చదువులకొచ్చారు . వాటితో తమ తమ ఇష్టాలన్నీ అడుగున పడిపోయాయి .ఈ గడిచిన కాలం లో పిల్లల దృష్ఠి లో తండ్రి దుర్మార్గుడిగా తల్లి పట్ల సానుభూతి ఏర్పడ్డాయి.కొడుకు గోపాలం ఉద్యోగం లో చేరి అమ్మకు కల్పతరువైనాడు .అమ్మ కోరికలన్నీ తీర్చసాగాడు . ఆమెకు కొడుకే సర్వస్వం అయ్యాడు .ఇప్పుడు భార్య ను ఎంత మంచి చేసుకుందా మనుకున్నా , ఆమెను ఎంతబాగా చూసుకున్నా ఆమె లో ఉదాసీనత చోటుచేసుకుంది . ఆ పరిస్తితులలో ఆమెకు స్ట్రోక్ వచ్చింది .తనను అపురూపంగా చూసుకుంటూ సేవలు చేసిన భర్త గురించి ఆమెలో ఆలోచన మొదలైంది . తను భర్తను చేసిన నిర్లక్యం గుర్తుకు వచ్చి పశ్చాతాపం కలిగింది . పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు
పిల్లలు వారి వారి కుటుంబాలు వారికి వుంటాయి . కడదాకా వుండేది తామిద్దరేకదా ! మళ్ళీ ఒక్కసారి ఈ జీవితం వెనకకి వెడితే ఎంత బాగుండును . అలా జరిగితే ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయను కదా అని భాధ పడుతుంది ఆమె. చివరకు ఇద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకుంటారు .
ఈ కథ ఈ రోజు వచ్చిన "నవ్య" వార పత్రిక లో జి.యస్. లక్ష్మి గారు వ్రాసిన "అతను...ఆమె...కాలం" అనే కథ నవ్య వీక్లీ ఉగాది కథల పోటీలో విశేష బహుమతి పొందిన కథ గా ప్రచురితమైంది .
భార్యా భర్తలన్నాకా పొరపొచ్చాలు రాకుండా వుండవు . ఎన్నో అభిప్రాయ బేధాలుంటాయి . అంత మాత్రాన పది మందిలో ఒకరి నొకరు అవమానపరుచుకోకూడదు. ఇరువురి మద్య అవగాహన వుండాలి అని చక్కగా చెప్పారు రచయిత్రి . వీరిద్దరి మద్య వున్న అభిప్రాయ బేధాలు , సంఘర్షణ , చివరికి పశ్చతాపం బాగా వివరించారు .కథ మొత్తం ఇద్దరి స్వగతం లోనే సాగుతుంది . వారి వారి భావాలు , అందుకు గల కారణాలు చదువుతుంటే నిజమే కదా ఈ పరిస్తితులలో ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తారు అన్నంత సహజం గా రాసారు రచయిత్రి . ఇదులో నాకు చాలా నచ్చింది . ఆమెకు ఆమె పెళ్ళిలో అమ్మమ్మ చెప్పిన ;

"పిల్లా...చూడు...ఇప్పుడుమీరిద్దరూ అంటుగట్టిన మొక్కల్లా ఒకటయ్యేరు . రేపొద్దున తల్లి చెట్టు నుంచి ఈ అంటుని వేరు చేసి పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు . మీ చెట్టు మూడు పువ్వులూ ఆరు కాయలవుతుంది . మీ చెట్టు కొమ్మే ఇంకో చెట్టుకు అంటవుతుంది . వాళ్ళ వేళ్ళు కత్తిరించుకొని వాళ్ళూ విడిగా పెరుగుతారు .

పైతరం వెళ్ళిపోయినా , తరువాతి తరం విడిపోయినా మీ బంధం మాత్రం మీ జీవిత కాలం వుంటుంది . మీరిద్దరూ ఒకరికొకరు . అంతే. మంచైనా , చెడైనా , కష్టమైనా సుఖమైనా మీరిద్దరూ కలిసి అనుభవించాలి . అదే కాపురమంటే ."

ఈ మాటలు అక్షరాల సత్యం . దంపతులు ఎవరైనా తెలుసుకోవలసినవి .
ఈ కథ వెనుక కథ కూడా ఆసక్తికరం గా వుంది . ఓసారి లక్ష్మిగారు ఎవరింటికో ఫంక్షన్ కు వెళ్ళారట . అక్కడ భార్యాభర్తలకి బట్టలు పెట్టాలి అంటే ఇద్దరూ చెరోచోట వున్నారట. ఆయనను పిలవమంటే ఆయనరాడు అని ఆవిడ పెడసరం గా అన్నదిట.ఎందుకు ఆవిడ అలా మాట్లాడింది అనుకొని లక్ష్మిగారు చాలా అలోచించారుట. అప్పుడు ఇలా ఐవుండవచ్చు అన్న ఐడియా వచ్చి వెంటనే ఈ కథ రాసేసారుట . ఎంతైనా చేయితిరిగిన రచయిత్రికదా!అందుకే పెద్దలన్నారు " రవి కాంచని చోటు కవి కాంచును " అని .

శ్రీలలితగారూ ( జి.యస్ . లక్ష్మిగారూ ) మీరిలాగే చాలా గమనించి , మాకు మంచి మంచి కథలు అందివ్వాలని , ఇంకా ఇంకా బహుమతులు అందుకొని మాకు పార్టీలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నానండి . అన్నట్లు లక్ష్మి గారికి ఓసారి ఓ 100 గజాల ప్లాటూ , ఇంకోసారి ఓ బంగారం గొలుసూ బహుమతులుగా వచ్చాయండోయ్ !