Tuesday, February 4, 2014

"ధీర" స్వప్న మాసపత్రిక లో నా కథ







ఈ నెల స్వప్న మాసపత్రిక లో నా కథ "ధీర" పబ్లిష్ అయ్యింది. చదివి మీ అభిప్రాయాలు చెపుతారు కదూ :)



ధీర/                                               
ఇంకా ధీరజ్ కాల్ రాలేదే అనుకుంటూ గడియారం చూసింది రాధ. 10 ఐంది . ఎమిటా అనుకుంటుండగానే సెల్ రింగైంది . ధీరజే .
"హాయ్ మాం ".
"హాయ్ బేటా . నీ కాల్ కోసమే ఎదురుచూస్తున్నాను ."
"సారీ  మాం , మెస్ లో డిన్నరైనాక అందరం ఏవో కబుర్లేసుకుంటూ కూర్చున్నాము అందుకే ఆలశ్యమైంది ."
"సరేలే ఏమిటీ రోజు విశేషాలు ?"
"అంతా రొటీన్ అంటాననుకున్నావా ? హే కాదు . గుడ్ న్యూస్ . ఏమిటో చెప్పుకో చూద్దాం ."
"నీకు పోస్టింగ్ వచ్చిందా ?"
"అరే ఎలా తెలుసుకున్నావు ?"
"అంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుందిరా ?నువ్వు ఎప్పుడెప్పుడు టెరరిస్ట్ జోన్ నుంచి బయటకు వస్తావా అని వేయి కళ్ళ తో ఎదురు చూస్తున్నాను . చాలా మంచి వార్త చెప్పావు . ఎక్కడికైంది ?"
"డెల్లీ కి . వారం లో అక్కడి కి వెళుతాను."
"ఓసారి ఇటొచ్చి వెళ్ళకూడదూ . నిన్ను చూడక రెండేళ్ళవుతోంది. నిన్ను చూడాలని అనిపిస్తోందిరా."
"అలాగే. వీలుచూసుకొని వస్తాను . ఇహ వుండనా డ్యూటీ కి టైం అవుతోంది .గుడ్ బై.'
"అదేమిట్రా గుడ్ బై అంటావు? గుండె దడదడ లాడిపోతోంది."
"అబ్బ ఏమిటమ్మా వాకే సారీ గుడ్ నైట్."
"గుడ్ నైట్." అమ్మయ్య అక్కడి నుంచి బయట పడుతున్నాడు . వారం ఐతే వాడు రాకపోయినా నేను వెళ్ళి చూడవచ్చు అనుకుంటూ లైట్ ఆర్పింది .
కళ్ళు మూసుకుంటే నిద్ర రావటం లేదు .తొందరలోనే కొడుకును చూడబోతున్నానంటే మనసంతా వుద్వేగంగా వుంది. చిన్ని కన్న అక్కడ ఏమి ఇబ్బంది పడుతున్నాడో ఏమో. ఏదీ బయటకు చెప్పడు అంతా గోపీ పోలికే. రూపం లో స్వభావం లో అంతా తండ్రే.అనుకుంటూవుంటే గోపీని మొదటిసారి చూసింది గుర్తొచ్చింది .
రోజు పెళ్ళివారు చూడటాని కి వస్తున్నారు తొందరగా రమ్మని చెప్పాడు తాతయ్య. వారం క్రితం పెద్దవాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు . వాళ్ళకు నచ్చిందిట . వచ్చేవారం మా అబ్బాయి సెలవు మీద వస్తున్నాడు వచ్చాక వస్తాము అని చెప్పారట. అప్పుడే పెళ్ళేంటి తాతయ్యా పరీక్షలైపోనీ అంటే ఎంతమ్మా మూడునెలలే కదా చదువు . పెళ్ళైనా పూర్తి చేయచ్చులే అన్నాడు . మంచి సంబంధం అట. తొందరగా సైకిల్ తొక్కుతోంది.ఇంతలో ఎదురుగా వస్తున్న కూరల ముసలమ్మని , వెనక నుంచి వస్తున్న సైకిల్ అబ్బాయి గుద్దాడు . ఆమె మీద పడపోతుంటే సైకిల్ పక్కకు తిప్పింది . పడబోతున్న సైకిల్ ను రెండు చేతులు వచ్చి గట్టిగా పట్టుకొని ఆపాయి. తన చేతుల మీద పడ్డ చేతులు ఎవరివా అని తలెత్తి చూసి ,అక్కడ కనిపించిన అతని కి థాంక్స్ అండి అని చెప్పి , సైకిల్ స్టాండ్ వేసి , కిందపడ్డ ముసలమ్మను లేపింది . ఆమె బుట్టలో నుంచి కింద పడ్డ కూరలను ఏరి బుట్టలో వేస్తూ ఏమైనా దెబ్బ తగిలిందా అవ్వా అని అడిగింది .
"దొంగసచ్చినోడు కళ్ళు కనపడటంలే "అని తిట్టుకుంటూ చిన్నగా లేచింది అవ్వ. లోపల అక్కడి కి శిరీష , సుమిత్ర వచ్చేసారు ఏమైందే అంటూ .
" పోకిరీవెధవే , నా మీదకు అవ్వను పడేసాడు . సమయాని కి ఆయన పట్టుకోబట్టి కాని , లేకపోతే కాలో చేయో విరిగేది."
"వాడి ని పట్టుకొని నాలుగు పీకుదామంటే వినవు . భయపడతావు."
"అబ్బ వదిలేయవే శిరీ రోడ్ మీద గోలెందు పద."అంది రాధ  జడవెనకకు వేసి, సైకిల్ తీసింది .
క్రీం కలర్ కు ఎర్ర అంచువున్న లంగా , క్రీం కలర్ జాకెట్ , ఎర్ర వోణీ , రెండు పొడగాటి జడల తో , చామనచాయ ఐనా అందంగా వుంది అనుకుంటూ మైమరచి ఆమేనే చూస్తున్న అతను జడవచ్చి కొట్టుకోగానే వులిక్కిపడ్డాడు . అదేమీ గమనించని రాధ ముందుకు వెళ్ళిపోయింది. "నిన్ను రక్షించాడనా జడ తో కొట్టావు . ఎలా చూస్తున్నాడో చూడు అతను."నవ్వుతూ అంది సుమిత్ర."అవునా"అంటూ వెనక్కి తిరిగింది .స్కూటర్ పట్టుకొని  అతను ఇటే చూస్తుండటం తో "బాబోయ్ . స్కూటర్ మీద వచ్చి అరుస్తాడేమో . పదండే" అని భయం గా స్నేహితులను తొందర పెట్టింది .    
"పెళ్ళివాళ్ళు వచ్చారు .జాగ్రత్తగా కూర్చో భయమేమిలేదు . పెళ్ళి కొడుకు ఆర్మీలో కాప్టెన్ . చెప్పాను కదూ,"అంది అమ్మ వైదేహి. చెప్పావు అన్నట్లు తల వూపుతూ తడబడే అడుగుల తో హాల్ లోకి నడిచింది రాధ.మొదటిసారి కట్టిన చీర పాదాలకు అడ్డం పడుతోంది.ఇంకో పక్క భయం. ఎలాగో చిన్నగా వచ్చి కూర్చుంది ."ఇతని పేరు గోపాల్." అని రాధకు , "మా మనవరాలు రాధ. బి మూడో సంవత్సరం చదువుతోంది."అని అతనికి పరిచయం చేసారు తాతయ్య. తలెత్తి చూసిన రాధ కు నవ్వుతూ తననే చూస్తున్న , బజార్ లో సైకిల్ పట్టుకున్న అబ్బాయి కనిపించాడు . అంతే గొంతు తడారిపోయింది . భయం తో తల వంచి చేతి వేళ్ళను చూసుకోసాగింది . వాళ్ళేమి అడిగారో , తనేమి చెప్పిందో ఎలాగో పూర్తిచేసుకొని వచ్చి రూం లో పడింది .మిలిట్రీ పెళ్ళికొడుకని అమ్మ , నాన్న , తాతయ్య సంతోష పదుతున్నారు.బామ్మే గొణుగుతోంది . ఏమైతే ఏమి పెళ్ళి కుదరదు అనుకుంది .
రాధ అంచనాలను తల్ల కిందులు చేస్తూ అబ్బాయికి అమ్మాయి నచ్చింది అని కబురు వచ్చింది.బామ్మ మిలిట్రీ అబ్బాయని గొణుగుతుంటే అందరూ నచ్చ చెప్పారు."గుండె మీద జడతో కొట్టి పడేసావే "అని శిరి , సుమి ఆటపట్టించారు.ముళ్ళపూడివారి 'రాధాగోపాళం'గుర్తొచ్చారు రాధ కు .
స్నేహితుల వేళాకోళాల తో , సరదాల తో, బంధువుల ఆశీర్వాదాలతో పెళ్ళి కన్నులపండుగ గా జరిగింది.నును సిగ్గులతో అత్తవారింట అడుగుపెట్టింది రాధ.పది రోజులు గోపాల్ ప్రేమతో, అత్తవారి ఆప్యాయాలతో పది నిమిషాలలా గడిచిపోయాయి.సెలవలు పూర్తి కావటం తో ,నీ పరీక్షలయ్యాక వచ్చి తీసుకెళుతానని వెళ్ళిపోయాడు గోపాల్ .
అదేమిటో పెళ్ళి కి ముందు పరీక్షలు కాకుండా పెళ్ళేమిటి అని గుణిసిన రాధ గోపాల్ తలుపులలో ఎప్పుడెప్పుడు పరీక్షలైపోతాయా అని ఎదురుచూసింది.ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది . రాధ పరీక్షలైపోగానే వచ్చాడు గోపాల్. రెండు నెలలు సెలవలు గడిపి రాధను తీసుకొని కలకత్తా బయిలుదేరాడు.  
అమ్మనూ, నాన్ననూ , తాతయ్యను , బామ్మను వదిలి వెళ్ళాలంటే చాలా బెంగగా అనిపించింది . బామ్మ కైతే కళ్ళ నీళ్ళు ఆగటం లేదు . పిచ్చి తల్లి అంత దూరం లో ఎలా వుంటుందో ఏమో .  అని వకటే కలవర పడిపోతోంది . బామ్మను చూస్తుంటే రాధకూ ఏడుపు ముంచుకొస్తోంది . జీవితాని కీ , ఆర్మీ జీవితాని కీ చాలా తేడా వుంటుంది అన్నాడు గోపాల్ . ఎలాగో ఏమో అని దిగులు పడిపోతోంది . ఇంకో వైపు గోపాల్ వున్నాడు కదా అని ధైర్యం . అందరూ స్టేషన్ చేరుకున్నారు . రైల్ లో ఎక్కే ముందు అప్రయత్నంగా అత్తగారి కి మామగారి కీ దండం పెట్టింది . గోపాల్ కూడా రాధ తో పాటు పెట్టాడు. మీ అమ్మానాన్నగారు , బామ్మా తాతగారి కీ పెట్టండి అన్నారు మామగారు .ఇద్దరు వాళ్ళకూ దణ్డం పెట్టారు . రైలు కూతేసింది. అందరికీ చేతులూపి రైలెక్కారు .మూడు రోజులు ప్రయాణించి కలకత్తా చేరారు.
స్టేషన్ లో రైల్ ఆగగానే ఇద్దరు జవానులు పరిగెత్తుకుంటూ వచ్చారు . స్టిఫ్ గా నిలబడి గోపాల్ కు సెల్యూట్ చేసి సామానులన్నీ దింపారు . జోంగా లో ఎక్కించారు. వాళ్ళ తో గల గలా హిందీలో మాట్లాడుతున్నాడు . హడావిడి అంతా కళ్ళు విప్పార్చుకొని చూస్తూవుంది రాధ. జోంగా ఇంటి ముందు ఆగింది . "ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు . వాళ్ళు రెండు నెలలు సెలవ మీద వెళ్ళారు. మనకు క్వాటర్ దొరికేవరకూ ఇక్కడే వుంటున్నాము .భయపడకు వాళ్ళు వచ్చేలోపల మనకు క్వాటర్ దొరుకుతుందిలే."అని నవ్వాడు .ఇల్లంతా తెరిచే వుంది . పడక గదులు కూడా తీసే వున్నాయి. ఇలా తెరిచి వుంచి వెళ్ళారు అంటే మనమేమి వాళ్ళ వస్తువులు పాడుచేస్తామా ?పోగొడుతామా ? అని , మన క్వాటర్ లోకి వెళ్ళేవరకు మనసామానులేమీ తీయనవసరం లేదులే అన్నాడు . 
స్నానం అది అయ్యేసరి కి పక్కింటి మేజర్ జగనాథం వాళ్ళు పూరీలు ఆలూ కూర పంపారు.మూడురోజుల ప్రయాణం . ఇంటి నుంచి తెచ్చుకున్న పూరీలు కొబ్బరి పచ్చడి , పులిహోర మొదటి రోజే ఐపోయాయి .మిగతా రెండు రోజులు రైల్ లో దొరికేవి తినలేక పోయింది . పండ్ల తో గడిపేసింది.పూరీలు కూర చూడగానే ప్రాణం లేచి వచ్చింది . ఆవురావురు మంటూ తినేసింది.వాళ్ళే మధ్యాహ్నం భోజనానికి పిలిచారు . తమిళియన్ బ్రాహ్మిన్ లు .ఇంకేం సాంబారుతో హాయిగా తినేసింది . మిసెస్. జానకీ జగనాథం చాలా ఆప్యాయంగా మాట్లాడింది.

రాత్రి కొత్తపెళ్ళి కూతురు రాధకు స్వాగత పార్టీని స్విమింగ్ ఫూల్ పక్కన ఏర్పాటు చేసారు .చక్కగా లైట్ల తో ప్రాంగణం అంతా అలంకరించారు . మ్యూజిక్ బాండ్ వాళ్ళు మంఛి పాటలను వాయిస్తున్నారు . వెళ్ళే ముందే గోపాల్ చెప్పాడు , ఎవరైనా వచ్చి డాన్స్ కు పిలిస్తే సున్నితంగా సారీ అని చెప్పు . అంతేగాని భయపడిపోకు అని . డాన్స్ ఏమిటా అనుకుంది .తీరా చూస్తే డాన్సింగ్ ఫ్లోర్ మీద ఆడ మగ జంటలుగా డాన్స్ చేస్తున్నారు .మగవాళ్ళ అందరి చేతుల్లో గ్లాసులున్నాయి . కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చాడు గోపాల్ . నాకు వద్దు తాగను అంది . తాగక పోయినా అలా పట్టుకొని కూర్చో అని చెప్పి వెళ్ళాడు . ఎవరెవరో వచ్చి మాట్లాడిస్తున్నారు . వాళ్ళు మిసెస్. గోపాల్ అంటూవుంటే గమత్తుగా అనిపిస్తోంది .అందరినీ గమనిస్తూ , మాట్లాడించినవారి కి చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది . ఆడవాళ్ళంతా బాగా మేకప్ చేసుకున్నారు .రకరకాలా హేర్ స్టైల్స్ వేసారు . జరీ కుట్టిన షిఫాన్ చీరలు కట్టారు. తనొక్కతే మేకప్ లేకుండా , పట్టు చీర తో , జడ తో వుంది . బాబోయ్ ఇలా పెదాలకు బుగ్గలకు రంగులుపూసుకుంటే తాతయ్య చంపేస్తాడు అనుకుంది . పార్టీ పూర్తైయ్యేసరికి రాత్రి రెండైంది . హమ్మయ్య అనుకుంది .
అది మొదలు రోజులు వేగం గా గడిచిపోసాగాయి. రోజు లేడీస్ మీటింగ్ అని పిలిచారు. మెస్ లో అందరు ఆఫీసర్ల భార్యలు వచ్చారు . అంతా రాధను అభిమానంగా పరిచయం చేసుకున్నారు . ఇదంతా నీ జుట్టే అని రాధ జడను చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడా అంతా ఫుల్ మేకప్ లో వున్నారు .నెలకోసారి ఇలా కలుసుకుంటారట . ఆటలు ఆడారు .పాటలు పాడారు . భోజనాలు చేసారు సరదాగా గడిచిపోయింది. కమాండెంట్ కపూర్ భార్య , మిసెస్.నీనా కపూర్ ప్రతి నెలా రమ్మని రాధను ఆహ్వానించింది . ఇలాగే నెల కోసారి , జవాన్ల, జేసివో భార్యల తో కూడా కలుస్తారట . అది వెల్ఫేర్ సెంటర్ మీటింగ్ అంటారట . అక్కడ వాళ్ళ తో టేబుల్ క్లాత్ లు , నాప్కిన్స్, చీరలు వగైరా వాటి మీద ఎంబ్రాయిడరీ చేయిస్తారట. స్వెటర్లు అల్లిస్తారట . అవన్నీ దీపావళి రోజు దివాలీ మేలా అని పెట్టి అమ్ముతారట.అప్పుడు వచ్చిన డబ్బులను కుట్లు , అల్లిక లు చేసిన వారి కి కొంత , వెల్ఫేర్ సెంటర్ ఖర్చుల కు కొంతా ఇచ్చి , మిగిలింది జవాన్స్ వెల్ఫేర్ ఫండ్ కు ఇస్తారట.బాగానే వుందే అనుకుంది .అప్పుడప్పుడు జవాన్ల ఇండ్లకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారట .షోగ్గా తయారవటము , పార్టీలు ఎంజాయ్మెంటే కాకుండా ఇలా కూడా చేస్తారన్నమాట అనుకుంది . తనూ అందులో చేరింది .ఏం. లో చేరింది .రోజూ కాలేజ్ కు వెళ్ళటం , ఇంట్లో వంట , సాయంకాలం పార్టీలు , లేడీస్ మీటింగులు , వెల్ఫేర్ సెంటర్ మీటింగ్స్ చాలా తొందరగా రోజులు దొర్లిపోతున్నాయి .
టు బెడ్ రూం ఫ్లాట్ ఎలాట్ చేసారు .ఇది నా సొంతం . దీనికి తను మహరాణి అనుకుంటే గర్వంగా వుంది .ఓరోజు మా ఫ్రెండ్ ఖన్నా భార్యను తీసుకొస్తున్నాడు . వాళ్ళకు ఇల్లు ఎలాట్ అయ్యేవరకూ మనతో వుంటారు అన్నాడు గోపాల్. అవునా వాళ్ళు ఎలాంటి వాళ్ళో , ఎన్ని రోజులుంటారో అని కొంచం భయపడ్డది . అనుకున్న రోజు కాప్టెన్ ఖన్నా , మిసెస్.పరిమళ ఖన్నా వచ్చారు . వాళ్ళకూ మధ్యే పెళ్ళైందిట. మిసెస్.ఖన్నా అంటుంటే అలా పిలవకు పరీ అని పిలు అంది . తను ఏర్ హోస్టెస్ గా పని చేసిందిట. పెళైందని వదిలేసిందిట. రాధీ నువ్వు లైట్ మేకప్ చేసుకుంటే బాగుంటావు . నీ జుట్టు ఎంతబాగుందో దాన్ని కాస్త బాక్ కోంబింగ్ చేసి స్టైల్ చేస్తే ముద్దుగా వుంటుంది తెలుసా . పార్టీలకు చీర ఇలా బిగుతా కట్టుకుంటే బాగుంటుంది అంటూ రక రకాల స్టైల్స్ నేర్పించింది .లైట్ గా మేకప్ వేసుకొని , బిగుతుగా చీర కట్టుకున్న రాధను చూసి గోపి సంతోషపడిపోయాడు .కొంచమైనా మారాలి తప్పదు అనుకుంది రాధ . పరి దగ్గర కొత్త కొత్త వంటలు నేర్చుకుంది . వాళ్ళు వున్న రెండు నెలలు సరదాగా గడిచిపోయాయి .
పరీ కి పాపాయి పుట్టింది .అంత బుజ్జి పాపను వూయలలో చూస్తుంటే చాలా ముద్దుగా అనిపించింది . ఏంటీ అంతగా చూస్తున్నావు . నీకూ ఇంకో మూడు నెలల్లో వస్తుందిగా అంది పరి.తెల్లగా , బొద్దుగా ముద్దుగా వుంది . పాపాయిని నాకిచ్చేయ్ పరీ అని రాధ నోటిలోనుంచి పూర్తి రాకుండానే అమ్మో నేనివ్వను అని గబుక్కున ఎత్తుకున్నాడు ఖన్నా . జాగ్రత్తా అంటూ కొద్దిగా పైకి లేచింది పరి . వాళ్ళను  చూసి ముసి ముసి గా నవ్వుకున్నారు రాధా గోపాల్ .
మద్యాహ్నం భోజనం అయ్యాక యూనీఫాం ను మార్చని గొపీ ని చూస్తూ బట్టలు మార్చరా అడిగింది .ఏదో ఆలోచనలో వున్నట్లుగా వుండిపోయాడు గోపి . కొద్ది సేపు తరువాత "రాధీ కల్నల్ అర్జున్ తమ్ముడు ఆనంద్ నీకు తోడొస్తాడు . రోజు రాత్రి హైదరాబాద్ వెళ్ళు" అన్నాడు.
"ఎందుకని ? ఇక్కడ మిలిట్రీ ఆసుపత్రి లో వసతులు బాగుంటాయి , ఇక్కడే డెలివరీ కి వుండమన్నారు కదా . వచ్చేవారం అమ్మా , బామ్మా వస్తున్నరు కదా ?"
మాట్ల్లడలేనట్లు రాధ తలను దగ్గరకు తీసుకున్నాడు . గొంతులో ఏదో వుండ చుట్టుకున్న భావన ."రాధీ మేమంతా బార్డర్ కు వెళుతున్నాము."
"దేనికి ?"
"పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి ."
"ఎప్పుడు వస్తారు?"
"తెలీదు. అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను ."అంటూ రాధ మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని ధీర్ఘంగా చూసాడు .
"రాధీ , పాప పుట్టినా , బాబు పుట్టినా నీలాగ పిరికి వాళ్ళను చేయకు . ధైర్యవంతులుగా చేయి. నీ నవ్వుతున్న మొహమే నాకు ఎప్పటి కీ గుర్తుండాలి."
"అయ్యో అదేమిటండీ అలా మాట్లాడుతున్నారు ."
"ఏమి లేదులే." అని తమాయించుకున్నాడు .
ఇంతలో జోంగా వచ్చింది . బయటకు వచ్చారు . అందరూ ఇళ్ళల్లో నుంచి బయటకు వచ్చి వున్నారు. కాంప్ బయట చాలా వెహికిల్స్ ఒకదాని వెనుక వకటి ఆగివున్నాయి. అందరూ చూస్తుండగానే కాన్వాయ్ వెళ్ళిపోయింది. కాన్వాయ్ లోని చివరి వెహికిల్ కనుమరుగయ్యేవరకూ చూసారు .మిసెస్.నీనా కపూర్ ఇంకొందరు ఏడుస్తున్న జవాన్ల భార్యలను ఓదారుస్తున్నారు . అప్పటి వరకూ నిశ్శబ్ధంగా వున్న కొత్తపెళ్ళికూతురు ఆర్తీ చటర్జీ పెద్దపెట్టున ఏడవసాగింది . రాధకు అర్ధం కాలేదు .పక్కనున్న మిసెస్.గుప్తా ను అడిగింది ఏమిటని .
"అయ్యో బార్డర్ కు వెళ్ళటమంటే నీకు తెలీదా ?వీళ్ళంతా యుద్దానికి వెళ్ళారు ."
"నాకు గోపీ చెప్పలేదే."
"అలా చెప్పరు . మనమే అర్ధం చేసుకోవాలి . వీళ్ళల్లో ఎంత మంది తిరిగి వస్తారో” అంటుండగానే గొంతు పట్టుకు పోయింది మిసెస్.గుప్తాకు.
ఇంట్లోకి వచ్చిన రాధ కు ఏమీ తోచలేదు . ఓసారి మాటల్లో గోపి " ఎప్పుడూ పార్టీలూ , సరదాలే కాదు , డిఫెన్స్ లో వుంటే యుద్దాలూ ఎదుర్కోవాలి."అన్నది గుర్తొచ్చింది. అంతకు వారం క్రితమే పరి పాపాయి ని తీసుకొని పుట్టింటికి వెళ్ళింది.కాంప్ లో అందరూ ఆడవాళ్ళే మిగిలారు. కాపలాకి కొంత మంది జవాన్లు వున్నారు . మద్యాహ్నం ఎలా గడిపిందో తెలీదు. సాయంకాలం అన్నీ సద్దుకొని ఆనంద్ వెంట హైద్రాబాద్ బయలు దేరింది.
టి.వి లో, పేపర్లలో ఎక్కడ చూసినా యుద్దం వార్తలే.గుండె చిక్క బట్టుకొని వింటోంది రాధ. రోజు వంట్లో కాస్త నలతగా అనిపిస్తోంది రాధకు . ఆసుపత్రికి తీసుకెళుదామా అనుకుంటున్నారు. బామ్మ రాధ పక్కన కూర్చొని నడుము రాస్తోంది. ఇంతలో "టెలిగ్రాం" అని వినిపించింది . రాధ వక్క ఉదుటున లేచి టెలిగ్రాం అందుకుంది. వణికే చేతుల తో "మీ భర్తగారు కాప్టెన్.గోపాల్ మరణించారని తెలుపటానికి విచారిస్తున్నాము."అని చదివి నో అని పడిపోయింది రాధ.అందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు. రాధ చేతిలోని టెలిగ్రాం చదివి నిశ్చేస్టులయ్యారు . నో నో ఇది అబద్ధం అంటూ ఏడుస్తున్న రాధ ను పట్టలేకపోయారు.

హడావిడి లోనే రాధకు డెలివరీ ఐంది . బాబు పుట్టాడు. వాడి ని చూసి అందరూ ఏడుపే. కాని రాధ కు మాత్రం నిర్లిప్తత ఏర్పడింది.ఎలాంటి ఏడుపులేకుండా వుంది . కొడుకు పుట్టాడని సంతోషం కాని , భర్త మరణించాడని ధు:ఖం కాని ఏవీ రానంతగా మనసు మొద్దుబారిపోయింది .బాధ కరగటం లేదు . ఎవరెవరో వస్తున్నారు . స్వాంత వచనాలు చెపుతున్నారు.ఏవీ తలకెక్కటం లేదు. కొడుకు ను వళ్ళో పెట్టుకొని అలా శూన్యం లోకి చూస్తూ వుంటుంది."ఇలా ఐతే ఎలా అమ్మా ? బాబును ను చూసుకోవటానికైనా ధైర్యం తెచ్చుకోతల్లీ."అంది వైదేహి.
"అవును బాబైనా పాపైనా నీలాగ పిరికిగా పెంచొద్దు అన్నాడు గోపి."అనుకొని కొడుకును చూసుకుంది.
ఇప్పటికే తన మూలంగా పెద్దవాళ్ళు బాధ పడుతున్నారు . ఇంకా వాళ్ళను బాధ పెట్టకూడదు అనుకొంది.
ఏం. పూర్తిచేసి కాలేజీ లో లెక్చరర్ గా చేరింది. కొడుకు ధీరజ్ ను మంచి స్కూల్ లో చేర్చింది.వాడికి యూనీఫాం లో వున్న డాడీ ఫొటో చూస్తే గొప్ప ఆరాధన.అది వాడు వాడి ఫ్రెండ్స్ కు గొప్పగా చూపించుకుంటూ వుంటాడు .
ఇంటర్ పరీక్షలయ్యాక రోజు, వక ఉత్తరం తీసుకొని , అమ్మ దగ్గరకు వచ్చాడు .
"అమ్మా నీకొక సంగతి చెపుతాను .ప్లీజ్ కోపం తెచ్చుకోవద్దు ."
"కోపమెందుకు కన్నా చెప్పు ."
"నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో చేరుదామని యు.పి.యస్. పరీక్షలు వ్రాసాను. పాస్ అయ్యాను . ఇంటర్వ్యూ కు రమ్మని లెటర్ వచ్చింది."
ఏమనాలో తోచలేదు రాధకు .
"ప్లీజ్ మాం . నాకూ డాడీలా ఆర్మీ ఆఫీసర్ కావాలని వుంది ."
చెమర్స్తున్న కళ్ళను తుడుచుకొని ,"నీ ఇష్టం కన్నా"అంది .
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యాడు . పూనాలో యన్.డి.యే లో చేరాడు. పూర్తైన రోజు యూనీఫాం వేసుకొని తల్లి ముందు స్టిఫ్ గా నిలబడి "గుడ్ మార్నింగ్ మాం" అని సెల్యూట్ చేస్తే , కలకత్తా వెళ్ళిన మొదటి రోజు, గోపీ యూనిఫాం వేసుకొని వచ్చి తన ముందు నిలబడి"గుడ్ మార్నింగ్ మేడం "అన్నది గుర్తొచ్చి , గుండెలో బాధ సుళ్ళు తిరిగింది . ధీరూ తలను రెండు చేతులతో దగ్గరకి తీసుకొని నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది. 
రెండేళ్ళుగా కాశ్మీర్ దగ్గర టెరరిస్ట్ జోన్ లో పని చేస్తున్నాడు .టెన్యూర్ ఐపోయింది .ఇంక వారంలో మారుతాడు .

సికింద్రాబాద్ పని మీద వచ్చినప్పుడు ఖన్నా వచ్చి కలిసిపోతూవుంటాడు. పరి పిల్ల చదువుకోసమని డిల్లీ లో వుండిపోయింది . కోర్ డే ఫంక్షన్ ఐనప్పుడల్లా ఆహ్వానం పంపుతారు.గోపీ తో సరదాగా పాల్గొనాల్సిన ఫంక్షన్ కు వార్ విడో గా వెళ్ళటం ఇష్టం లేక వాళ్ళు ఎంత పిలిచినా వెళ్ళదు. ఓసారి ఖన్నా వచ్చినప్పుడే వార్ మెమోరియల్ చూద్దువుగాని రా అని బలవంతాన తీసుకెళ్ళాడు . వార్ మెమోరియల్ ను తడుముతుంటే గోపీని ముట్టుకున్నట్లుగా అనిపించి ధు:ఖం ఆపుకోలేక దాని దగ్గర కూలబడిపోయింది. రోజే అనుకుంది ఇంక ఎప్పుడూ ఇటువైపు రాకూడదని.

తాతయ్యా , బామ్మా పెద్దవాళైపోయారు .అమ్మా నాన్నా కూడా చాతకాకుండానే వున్నారు. అందరకీ తన గురించే దిగులు.
సుధీర్గమైన 23 సంవత్సరాల జ్ఞాపకాలతో రాత్రి గడిచిపోయింది .తెలవారుతున్నట్లుగా పక్షుల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి .
ఇంట్లో అందరూ లేస్తున్న అలికిడి వినిపిస్తోంది.లేచి కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ కలపాలని వంటింట్లోకి వెళ్ళింది. అందరి కీ దీపు పోస్టింగ్ గురించి చెప్పింది .
"పోనీలేమ్మా , ఇప్పటికైనా నీ మనసు కుదట పడుతుంది “ అన్నారు.
రోజు వెళ్ళి అత్తయ్యగారినీ మామయ్యగారినీ కూడ చూసిరావాలి .దశరధుడి లాగా నలుగురు కొడుకులు అని ఎవరైనా అంటే పొంగిపోయేవారు మామయ్యగారు. అందులో వక కొడుకు ను పోగొట్టుకున్నారు . వాళ్ళకీ ధీరు అంటే ప్రాణం . మనవడు వస్తున్నాడన్న శుభవార్త చెప్పాలి.సంతోషపడతారు అనుకుంది.
 కాఫీ గ్లాస్ తీసుకొని బయట  చెట్ల లోకి నడిచింది .