Friday, January 18, 2019

పాడమని నన్నడగతగునా! (ఏడిపించటానికి కాకపోతే)


పాడమని నన్నడగతగునా! (ఏడిపించటానికి కాకపోతే)
జ్ఞాపకాలు-6
అవి మేము ములుగులో ఉన్న రోజులు.ముందే చెప్పినట్లు ములుగు ఊరే ఐనా కాంప్ చుట్టూ పెద్ద పెద్ద చెట్లు.ఓ అడవిలాగానే ఉండేది.మా ఇంటి ముందే నాన్నగారి ఆఫీస్ ఉండేది.అక్కడ పెద్ద పెద్ద పున్నాగపూల చెట్లుండేవి.పొద్దున్నే తెల్లటి పూలు నేలంతా పరుచుకునేవి.ఆ పూలను ఏరుకొని , జడలల్లుతూ,రేకులతో, కాడలతో బూరెలు చేసి ఊదుకుంటూ తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం నేనూ నా స్నేహితులు.అది బోర్ కొట్టినప్పుడు , ఊరి బయట అంటే ఎంతో దూరం కాదు, ఇంటికి కూతవేటు దూరం లోనే ఉన్న చింతచెట్ల కింద ఆడుకుంటూ ఉండేవాళ్ళం.అక్కడి దగ్గరలోనే ఓ బడ్డీకొట్టు ఉండేది.అది అప్పట్లో బస్ స్టాప్ అన్నమాట.ఊరి వాళ్ళెవరైనా అక్కడ బస్ దిగినప్పుడు , మిట్టమధ్యహ్నం చింత చెట్టు కింద ఆటలేమిటి దయ్యాలు పడతాయి ఇంటికెళ్ళండి అని భయపెట్టేవారు.అబ్బే అవేమీ చెవికి ఎక్కేవి కావు. ఆవిధంగా హాపీగా ఆడుకుంటున్న ఒకానొక రోజు, భద్రావతి అత్తయ్య బస్ దిగి వస్తూ నన్ను చూసి , "బేబీ ఇంత ఎండలో ఆటలేమిటే? ఇంటికి పద" అంది.భద్రావతి అత్తయ్యకి పొడవాటి రెండు పెద్ద పెద్ద జడలుండేవి.నేను ఆ జడలు పట్టుకొని కాసేపు వేళ్ళాడి , తిరిగి ఆటలో పడిపోయాను.ఇక నేను వచ్చేట్టుగా లేనని వెళ్ళిపోయింది.భద్రావతి అత్తయ్య ములుగు గ్రామసేవిక సత్యవతి అత్తయ్య చెల్లెలు.వెళ్ళినట్లే వెళ్ళి వెంటనే తిరిగి వచ్చి,"బేబీ రావే, నిన్ను మీ అమ్మ పిలుస్తోంది." అంది.అమ్మ పిలుస్తే తప్పదు అనుకుంటూ వెళ్ళాను.అమ్మా, సత్యవతి అత్తయ్య వరండాలో కూర్చొని ఉన్నారు.నన్ను చూడగానే అమ్మ,"అత్తయ్యావాళ్ళ ఆఫీస్ లో పాట పాడాలట."అని నానెత్తిన ఓ బరువు పెట్టింది. మా అమ్మ కు పాటలంటే చాలా ఇష్టం.అందులో భానుమతి, యం.యస్ .సుబ్బలక్ష్మి పాటలంటే చెవి కోసుకుంటుందిట. (అమ్మ ఆ మాట అన్నప్పుడల్లా ఎక్కడ చెవి కోసేసుకుంటుందో అని నేను భయంభయంగా చూసేదానిని)అందుకని నన్ను ఓపెద్ద గాయనిగా చేయాలని ఎంతగానో ప్రయత్నం చేసేది.సత్యవతత్తయ్య ఆఫీస్ లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు నాతో పాటపాడించేది. ఇక తప్పేదేముంది? శుభ్రంగా వంటిన ఉన్న మట్టిపోయేట్టుగా స్నానం చేయించి, తెల్లటి ఫ్రాక్ , బూట్లు, పాకెట్ జడతో తయారు చేసి అత్తయ్య తో పంపింది.అక్కడ "భలే తాత బాపూజీ " పాటపాడాను.ఎండాకాలం రాగానే అమ్మ తెల్లని గ్లాస్కో బట్టతో అరడజను గౌన్లు కుట్టించేది.పైగా వాటిని టినోఫాల్ తో సొంతంగా ఉతికేది..దానితో అవి తెల్లగా టినోఫాల్ అడ్వర్టైజ్మెంట్ లో లా తళతళా, మిలమిలా మెరిసిపోతుండేవి. ఆ విధం గా అప్పుడప్పుడు నా గాన కచేరి జరుగుతూ ఉండేదన్నమాట.
అకడి తో ఐపోలేదు.నాన్నగారికి అడవుల్లొకే ట్రాన్స్ఫర్ లు అవుతున్నాయని, నేను చదువుసంధ్య లేకుండా తిరుగుతున్నానని కుట్రతో అమ్మ వరంగల్ కు మకాం మార్చింది.అప్పుడు చదువే కాకుండా , నేను యం.యస్.సుబ్బలక్ష్మి అంత గాయనిని కావాలని,సంగీతం టీచర్ ను కూడా పెట్టింది.పొద్దున రేడియోలో వచ్చే ఈ నెల పాట ముందు కూర్చోబెట్టి లలితగీతాలు నేర్పించేది. అప్పుడే నారాయణరెడ్డి గారి "ఈ నల్లని రాళ్ళల్లో ఏ కన్నులు దాగెనో "పాట నేర్చుకున్నాను.ఆ తరువాత ఆ పాట 'అమరశిల్పి జక్కన్న ' సినిమాలో చూసినప్పుడు, లలిత గీతం సినిమాలో ఎట్లా పెట్టారు అని ఎంత కన్ ఫ్యూజ్ అయ్యానో! కీర్తనలు,జయదేవుని అష్టపదులదాకా నేర్చుకున్నా పాటలు వినేదానినే కాని పాడుదానిని కాని అర్ధం అయ్యింది.పాపం అమ్మ.కాకపోతే నాకూ హాయిగా పాడుకోవాలని ఉంటుంది.ముఖ్యంగా , పద్మారావు నగర్ లో అమ్మవారి గుడిలో రాహుకాల పూజకు వెళ్ళినప్పుడు, అక్కడ తమిళ ముత్తైదువులు పాడుతుంటే ఎంతో బాగుండేది.గళమెత్తి అంత హాయిగా పాడుకోవటానికి కూడా అదృష్టం ఉండాలి.ఎట్లాగూ పాడలేను కనీసం వినైనా సంతోషపడదామని రోజంతా పాటలు పెట్టుకుంటాను.అప్పట్లో పొద్దున వివిధభారతి లో శ్రోతలు కోరిన పాటల తో మొదలవుతే, రాత్రి బినాకా గీత్ మాల దాకా రేడియో పాడుతూనే ఉండేది.ఇరానీ హోటల్ కి వచ్చినట్టుంది  అని ఏమండీగారు గొణుక్కుంటూ ఉంటే ఏమండీ ఉన్న కాసేపు నా రేడియో మూగబోయేది.ఇప్పుడు పాపం ఏమండీ నే అలవాటు పడిపోయారు :)


No comments: