Monday, October 7, 2013

బతకమ్మ కథ


దేవీ నవరాత్రులు మొదలు అయ్యే ముందు వచ్చే అమావాస్య రోజున బతకమ్మను పెడుతారు.బతకమ్మ అంటే అమ్మవారి రూపం.రకరకాల పువ్వులు ఒకదానిమీద ఒకటిగా పేర్చి ఎంత ఎత్తు చేయగలుగుతే అంత ఎత్తున పేరుస్తారు.పైన ఓ తమలపాకు లో పసుపు తో గౌరమ్మను చేసి పెడతారు. సాయంకాలం ఇంటి ముందు కాని , ఏదైనా దేవాలయము ముందు కాని , శుభ్రంగా వూడ్చి, కళాపి చల్లి, ముగ్గులేసి ఆడవాళ్ళు  అందరూ తమ తమ బతకమ్మలను తెచ్చి అక్కడ వుంచి చుట్టూ తిరుగుతూ రకరకాల పాటలు పాడుతూ, కోలాటాలాడుతూ పూజిస్తారు.పూజ అయ్యాక నైవేద్యం పెట్టి , నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు. ఈ విధముగా తొమ్మిది రోజులు ఆడుతారు.రోజుకొక రకం నివేదన చేస్తారు.తొమ్మిదోరోజు వడిబియ్యం తో సాగనపుతారు.ఇది దసరా ముందు రోజు , అంటే నవమి రోజు అవుతుంది. కొంతమంది, మనము ఆడపిల్ల ను పండుగకని పుట్టింటికి తెస్తాము కదా , పండుగ  ముందు సాగనపటమేమిటని , తొమ్మిది రోజులలో వక రోజు ఆడకుండా వుంచి, పండుగ మరునాడు సాగనంపుతారు.

ఇది తెలంగాణప్రాంతము లో చాలా శ్రద్ధగా , ఉత్సాహం గా చేసే పూజ.దీనికి ఒక కథ వుంది.

"అనగనగా  ఒకాయన వుంటారు..ఆయనకు ఏడుగురు కొడుకులు , వక కూతురు.అందరికీ పెళ్ళిళ్ళు చేసి, బాధ్యతలన్నీ తీరాయికదా అని, ఆయన భార్య తో  తీర్ధయాత్రలకు వెళుతారు.అప్పుడే దసరా పండుగ వస్తుంది.మరి ఆడపిల్లను పుట్టింటి కి తేవాలికదా! అందుకని అన్నలు చెల్లెలిని తీసుకొస్తారు.చెల్లెలు బతకమ్మ లాడుదామనుకుంటుంది. కాని, పట్టుచీర, కాళ్ళకు కడియాలు లేవు.ఎలా మరి?అందుకని పెద్దవదినను అడుగుతుంది కాని ఆమె నాకూ కావాలి ఇవ్వను అంటుంది. అలా ఆరుగురు వదినలూ ఇవ్వమంటారు.ఏడో వదిన దగ్గరకు వెళ్ళేసరికి ఆవిడ స్నానం చేస్తూ వుంటుంది." శీలకు పట్టుచీర, గూట్లో కడియం వున్నాయి ,తీసుకుపో . కాని చీరకు కొర్రు పట్టినా, కడియం నొక్కుకుపోయినా , నీ రక్తం నా నుదుటను పెట్టుకుంటాను." అంటుంది. చెల్లెలు ఓ క్షణం ఆలోచిస్తుంది. ఆ ఏమవుతుందిలే జాగ్రత్తగా తెచ్చిస్తే సరి అనుకొని తీసుకొని, చీర కట్టుకొని,కాలికి కడియం పెట్టుకొని వెళుతుంది.

ఉత్సాహంగా,జోరుగా బతకమ్మ ఆడేస్తుంది.ఆ ఉషారులో పాపం చీరకు కొర్రు పడుతుంది,కడియం నొక్కుకుపోతుంది.ఏమిచేయాలో తోచదు.చడీ చప్పుడు చేయకుండా , నిశబ్ధంగా అవి తీసుకుపోయి ఎక్కడి నుంచి తెచ్చిందో అక్కడ పెట్టేస్తుంది.ఐనా వదినకు తెలీకుండా వుంటుందేమిటి? తెలుసుకుంటుంది. అంతే భర్త వచ్చే సమయానికి తలకు బట్ట కట్టుకొని పడుకుంటుంది.ఎందుకలా పడుకున్నావు ఏమైంది అని అడిగిన భర్తకు, నాకు చాలా తల నొప్పిగా వుంది, నీ చెల్లెలి ని చంపి ఆ రక్తం తో నా నుదుట బొట్టుపెట్టుకుంటేనే తగ్గుతుంది అంటుంది.అతను కొద్దిసేపు బయటకు వెళ్ళి , ఓ గిన్నె లో రక్తం తెచ్చి ఇస్తాడు. ఆమె సంతోషంగా ఆ రక్తం తో బొట్టుపెట్టుకొని నీళ్ళ కోసం బావి దగ్గరకు వెళుతుంది.

బావి దగ్గర వున్న ఆడవాళ్ళందరూ "మనమందరమూ కుంకుమ బొట్టు పెట్టుకుంటే , ఇదేమిటీ కలవారి కోడలు గద్ద రక్తం పెట్టుకొచ్చిందీ"అని పకపకా నవ్వుతారు.అంతే కోడలి కి కోపం వచ్చి, చరచరా ఇంటి కి వచ్చి,తలకు బట్ట కట్టుకొని పడుకుంటుంది.భర్త ఈసారి కాకి రక్తం తెచ్చి ఇస్తాడు.అది తెలీక ఆవిడ ఆ బొట్టు పెట్టుకొని వెళుతుంది.మళ్ళీ అందరూ"ఈ సారి కాకి రక్తం పెట్టుకొని వచ్చింది " అని నవ్వుతారు.అంతే కోడలికి బోలెడు కోపం వచ్చేస్తుంది. వళ్ళు మండిపోతుంది.ఈ సారి నీ చెల్లి రక్తం తెస్తే కాని వీల్లేదని భర్తకు గట్టిగా చెప్పేస్తుంది.

పాపం అతను ఇంకేమి చేయగలడు. ముద్దుల భార్య కదా కోరిక తీర్చాలి కదా!అందుకని ఈ సారి చెల్లిని ప్రేమగా పిలిచి , నిన్ను బావ దగ్గర దింపివస్తాను పదా అని తీసుకెళుతాడు.పాపం, అన్నయ్య మోసం, వదిన కుట్ర తెలీని ఆపిల్ల అతనితో బయిలుదేరుతుంది. దారి మధ్యలో ఓ చెట్టుకింద ఆపి"అలిసిపోయాము కదా కాసేపు పడుకో "అని చెల్లిని వళ్ళో పడుకోబెట్టుకొని తల వత్తుతాడు. ఆమె నిద్రపోగానే చంపేసి , కాస్త రక్తం తీసుకొని ఇంటికి తిరిగి వెళుతాడు.ఈ సారి వదిన ఆ రక్తం బొట్టు పెట్టుకొని బావి దగ్గరకు వెళ్ళగానే అక్కడవున్న వారంతా "ఈ సారి కలవారి కోడలు మనిషి రక్తం పెట్టుకొని వచ్చిందే"అని పకపకా నవ్వుతారు.అప్పుడు వదిన తృప్తి పడుతుంది.

అమ్మానాన్నా తీర్ధయాత్రల నుంచి తిరిగి వస్తుంటారు.తమ వూరి దగ్గరకు రాగానే ఓ చక్కటి పూల తోట కనిపిస్తుంది.అరే ఇదేదో కొత్తగా వచ్చినట్లుందే మనము వెళ్ళేటప్పుడు లేదు , కాసేపు ఇక్కడ సేద తీరుదాము అనుకుంటారు.అక్కడే వున్న బావిలో నుంచి నీళ్ళు తోడుదామనుకొని తండ్రి చేద అందులో వేయబోతాడు. వెంటనే
"అంటకు అంటకు ఓ నాన్నా,
అంటితే నీ చేయి కందేనూ,
దోషకారి వదిన చేయబట్టి,
పాపకారి అన్న వచ్చి పడబొడిచి బోయినాడు."
అని వినిపిస్తుంది.వెంటనే నాన్న చేదవదిలేస్తాడు. అమ్మ చేద వేయబోతుంది. అప్పుడూ అలాగే వినిపిస్తుంది. ఇదేమిటి ఇలా అంటోంది. పైగా మన అమ్మాయి గొంతులా వుంది అని అమ్మానాన్నా కలవరపడిపోతారు.కొడుకులను రమ్మని కబురు పెడుతారు. వాళ్ళూ ఎవరు చేద వేయబోయినా అలానే వినిపిస్తుంది.చివరి అన్న వేయబోతే,

"అంటకు అంటకు ఓ అన్నా,
దోషకారి వదిన చేయబట్టి,
పాపకారి అన్నవు నీవొచ్చి పడబొడిచి బోయినావు"అంటుంది.

వదిన చేద వేయబోతే ,
"అంటకు అంటకు ఓ వదినా,
దోషకారి వదినవు నీవు చేయబట్టి,
పాపకారి అన్న వచ్చి పడబొడిచి బోయినాడు."అంటుంది.

దాని తో అందరికీ జరిగినది తెలిసిపోతుంది.ఇంతలో ఆ అమ్మాయి భర్త ఏమైంది, ఏడాదైనా భార్య రాలేదు అని చూసేందుకు వస్తాడు. అతనూ ఈ తోటను చూసి లోపలికి వస్తాడు.అక్కడ , అత్తమామలను, బావమరుదులను చూసి ఆశ్చర్యపోతాడు. జరిగింది తెలుసుకుంటాడు. భార్య మీద ప్రేమతో చాలా సేపు ధుఖించి, తనూ ఆ బావిలోపడి చనిపోదామనుకుంటాడు. ఇంతలో అశిరీరవాణి , "ఓయీ నీ భార్య క్రితం జన్మలో బతకమ్మ పూర్తిగా తొమ్మిదిరోజులు ఆడకుండా మధ్యలో వదిలేసింది. అందువలన ఈవిధముగా జరిగింది. నువ్వు శ్రద్ధగా చుటుపక్కల అమ్మాయిలతో బతకమ్మ ఆడించు. నీ భార్య మాములు రూపం పొందుతుంది". అని చెపుతుంది. అంత , చుట్టుపక్కల అమ్మాయిలందరినీ ప్రోగుచేసి, ఆ తోటలోని పూవులతోనే బతుకమ్మను పేరించి , తొమ్మిది రోజులూ ఆడిస్తాడు. తొమ్మిదోరోజు పూర్తికాగానే , ఆ తోట, బావి మాయమై అతని భార్య గా మారిపోతుంది.అందరూ సంతోషిస్తారు.చివరి అన్న, వదిన వారిని క్షమార్పణ కోరుతారు."

బతకమ్మ ఆడటం పూర్తికాగానే అందరూ చుట్టూ కూర్చొని ఈ కథ చెప్పుకొని , హారతి ఇచ్చి, నైవేధ్యం పెడతారు. కథా అక్షింతలు తలపై వేసుకుంటారు.ఆ తరువాత నీళ్ళలో నిమజ్జనం చేస్తారు.

ఇది ఇంతకు ముందు చెప్పిన "బతకమ్మ" విశేషాలు.

పైన వున్నది మా ఇంటి బుజ్జి బతకమ్మ :)

6 comments:

Padmarpita said...

హమ్మయ్య....మీ నుండి హాయినిచ్చే "బతుకమ్మ కధ" విని మీ బుజ్జి బతుకమ్మను చూసి మొక్కానుగా...ఇంక బొజ్జుంటాను :-)

శశి కళ said...

chala bagundhi kadha

కిరణ్ కుమార్ కే said...

బతుకమ్మ కత చెప్పినందుకు మీకు నా ధన్యవాదాలు.

Manavu said...

మీరు చెప్పిన కద బతుకమ్మ అట రావడానికి కారణమైన మూల కధ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే కదలో చెల్లెలు బతుకమ్మ ఆట ఆడటానికి వెళ్ళడానికే వదినను చీర గట్రా అడిగిందని కదా! అలాగే ఆకాశవాణి చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయి పూర్వ జన్మలో తొమ్మిది రోజులు ఆట ఆడలేదని శాపం. కాబట్టి ఈ కద ప్రకారం అప్పటికే బతకమ్మ ఆట ఉందని అర్దం. మరి అసలు బతుకమ్మ ఆట ఎలా మొదలయిందో చెప్పగలిగితే సంతోషిస్తాం. తెలంగాణా ఆడబిడ్డలకు ఎంతో ప్రీతి పాత్రమైన బతుకమ్మ పుట్టుపూర్వొత్తరాలు తెలుసుకోవాలని కోరిక.

మీరు చెప్పిన జానపద కద కూడ బాగుంది. పెళ్ళాల మాట విని తోబుట్టువులను అయినవారిని నిర్లక్ష్య పరచే అన్న దమ్ముల కు కోంచం బుద్ది వచ్చేటట్లు సందేశాన్ని ఇచ్చే విదంగా కదను మలిస్తే ఇంకా బాగుండేది.

మాలా కుమార్ said...

పద్మార్పిత గారు,

&శశికళ గారు,

&గ్రీన్ స్టార్ గారు

థాంక్ యు.

మాలా కుమార్ said...

నరసిమ్హ రావు గారు,
అసలు బతుకమ్మ ఎలా మొదలైందో నాకు తెలీదండి. ఈ కథ నేను మలిచింది కాదండి. మా అత్తగారు చెప్పేవారు.బతుకమ్మ ఆడటం మా అత్తవారింటనే వుంది.నా పెళ్ళి తరువాతనే నేను ఆడటం మొదలు పెట్టింది,అదీను మా అత్తగారి ఆద్వర్యం లో .నేనూ ఆవిడను అడిగాను. ఆవిడకూ ఇంతే తెలుసుట.ఆవిడ చెప్పిన పద్దతే నేను ఫాలో అవుతున్నాను :)
మీ వాఖ్యకు థాంక్స్ అండి.