Monday, December 17, 2018

అమ్మే కావాలి


కొన్ని సార్లు కొన్ని కథలు చదువుతుంటే చాలా విసుగ్గా ఉంటుంది. ఏదో సమస్యల మీద రాయాలని మొదలు పెడతారు.అవి కూడా ఏదో ఒక సామాజిక వర్గానికే సమస్యలు ఉన్నట్లు, మిగితా వారంతా ఆనందంగా జీవిస్తూ, వాళ్ళని నానా హింసలపాలు చేస్తున్నట్లుగా ఉంటాయి.పొనీ మధ్య తరగతి వాళ్ళకు సమస్యలు లేవా అవి రాయవచ్చు కదా అనుకుంటే ఒకప్పుడేమో అత్తాకోడళ్ళ పొట్లాటలు, వదినా ఆడపడుచుల విరోధాలూ (ఇప్పటికీ టివీ లల్లో అవే ప్రసిధ్ది అనుకోండి) మొగుళ్ళ పెత్తనాలు పెళ్ళాల కన్నీటిగాధలు ఉండేవి.అవి తగ్గి ఈ మధ్య కాలం లో పిల్లలు అమెరికా వెళ్ళిపోయి తల్లితండ్రులను నిర్లక్షం చేయటం, ఆ తల్లితండ్రులు భోరున ఏడుస్తూ చావలేక బతుకును ఈడ్చటం కొత్త ట్రెండ్ అన్నమాట. పోనీ ఏవో హాస్య కథలు అని పేరు పెట్టి రాస్తున్నారు చదివి కాసేపు నవ్వుకుందాము అనుకుంటే నవ్వు పెదాలను ఎంత పీకినా రావటం లేదు.కొన్నేమో మహా ఘంభీరమైన కథలు.అన్ని కథలూ అలా ఉన్నాయని అనటం లేదు కాదు కాని ఎక్కువగా ఉంటున్నాయి. యద్దనపూడిలా ఆహ్లాదకరమైన కథలూ, పొత్తూరి లా కడుపుబ్బ నవ్వించే కథలూ ఎల్లవేళలా రావాలని కోరుకోను కాని మాదిరెడ్డి సులోచనలా  సమస్యలు అని కాకుండా సున్నితంగా సమస్యలను చర్చించే కుటుంబకథలను నాలాంటి సామాన్య పాఠకురాలు కోరుకుంటే తప్పేమీ కాదు అనుకుంటాను.ఆ కోరిక తీర్చేందుకే అప్పుడప్పుడు ఇలాంటి పుస్తకాలు దొరుకుతుంటాయి.అలా నా చేతికి వచ్చింది, జి.యస్.లక్ష్మిగారు రాసిన "అమ్మే కావాలి".
అమ్మ మనసు ను అవిష్కరించిన అమ్మే కావాలి, అమ్మ కథల సమాహారం లో మొత్థం పదమూడు కథలు ఉన్నాయి. ఒకసారి చదవటం మొదలు పెట్టాక ఒకదాని తరువాత ఒకటిగా మొత్థం కథలు చదవటం పూర్తయ్యే వరకు పుస్తకాన్ని వదలలేదు. ఒక కథ బాగుంది ఒకటి బాగాలేదు అని లేదు ప్రతి కథలోను అమ్మ కనిపించింది.
 "ప్రేమా పిచ్చి ఒకటే" కథ చదువుతుంటే "భద్రకాళి" సినిమా గుర్తొచ్చింది.అందులో నాయిక జయప్రద భర్తను పసిపిల్లవాడిలా చూసుకుంటుంది.ఆమెకు ప్రసవం లో పిచ్చి ఎక్కుతుంది.తల్లి ప్రొధ్బలం తో ఆమె కు విడాకులిచ్చి ఇంకో పెళ్ళి చేసుకుంటాడు భర్త.కొన్ని సంవత్సరాల తరువాత జయప్రద కు పిచ్చి తగ్గి జరిగింది తెలుసుకొని, ఒకవేళ నా భర్త కే ఇలా జరుగుతే నేను ఆయనకు విడాకులిచ్చేదాని నా అని తల్లిని అడుగుతుంది.ఆ సినిమా నా మనసులో అట్లా నిలిచిపోయింది.ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడల్లా బాధగా ఉంటుంది.ఆ సినిమా చూసిన సంవత్సరానికేమో అనుకుంటా నాకు మా అమ్మాయి పుట్టింది.డెలివరీ ముందు నుంచి నాకూ అట్లా జరుగుతందేమో అని ఎంత భయపడిపోయానో! అసలు అప్పుడు ఎందుకు అట్లా పిచ్చి ఎక్కుతుంది అని తెగ ఆలోచించేదానిని.ఈ కథ చదువుతుంటే అదంతా గుర్తొచ్చింది.ఇందులో నాయిక (అనొచ్చా?) వినీత కు డెలివరీ లో ఇలాగే పిచ్చి ఎక్కుతుంది. తల్లీతండ్రి వినీత ను డాక్టర్ కు చూపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటారు.ముందు పిచ్చి కోడలును ఇంటికి తీసుకొచ్చేందుకు అత్తగారు ఒప్పుకోకపోయినా కొడుకు ,భర్త నచ్చచెప్పటం తో ఒప్పుకుంటుంది. ఆ జబ్బును "పోస్ట్ పార్టం డిసార్టర్" అంటారని ,కుటుంబసబ్యుల సహకారం తనకు ఉండాలని డాక్టర్ చెపుతాడు.అది చదవగానే అప్పటి ఆ డైరెక్టర్ కు ఈ సంగతి తెలీదేమో అట్లా ముగింపు ఇచ్చాడు. ఇప్పుడు లక్ష్మిగారు ఇలా చక్కటి ముగింపు నిచ్చారు అనుకున్నాను.
ఇలా ప్రతి కథా సున్నితంగా ఉనంది.దేనికదే ప్రత్యేకం గా ఉంది.చాలా చిన్న చిన్న సమస్యల గురించి నిజమే కదా మనమెప్పుడూ ఇలా అనుకోలేదే అనుకునేట్లుగా మలిచారు.చదవగానే మంచి ఫీలింగ్ కలిగింది. చివరగా "ఎప్పుడొస్తున్నావమ్మా ?" కవిత చదవగానే అమ్మ గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.అమ్మలందరూ తమను తాము ఈ కథలల్లో చూసుకుంటారేమో!
ఈ పుస్తకము నిన్ననే మొదలైన పుస్తక ప్రదర్శన లో నవోదయ బుక్ షాప్ నంబర్ 232 నుంచి 238 లో దొరుకుతుంది.ధర ఎక్కువేమీ కాదు 100 రూపాయలే.కొని నేను చెప్పని మిగితా 12 కథలను కూడా చదివండి.

Saturday, March 31, 2018

అవాల్మికి కదంబమాల ఆవిష్కరణ








అవాల్మికి కదంబమాల  ఆవిష్కరణ
మా అమ్మ మాడపాటి సీతాదేవి సేకరించిన కొన్ని రామాయణ ఘట్టాలను , “అవాల్మికి కదంబమాల” పేరు తో అచ్చంగా తెలుగులో ప్రచురుణ అయ్యింది .అది ఈ బుక్ గా చేసి శ్రీరామ నవమి  రోజున అమ్మ తో ఆవిష్కరించాము .
ఈ పుస్తకము కవర్ పేజీ మా చెల్లెలు జయ వేసింది. రామునీతో పాటు సీతాదేవి అడవికి వెళ్ళేటప్పుడు నార చీరలు ధరిస్తుందిట.అప్పుడు దశరధుడు వనవాసం చేసేది రాముడు కాబట్టి రాముడు నారవస్త్రాలు ధరించాలి కాని నాకోడలు ధరించనవసరం లేదు.రాణీ లాగా పట్టు వస్త్రాలనే ధరించాలి అన్నాడట.ఇది వాల్మీకి నే ఒక శ్లోకం లో రాశాడు.వనవాసం అంతా సీతాదేవి నగలు, పట్టుచీరలు కట్టుకునే ఉంది కాని నారచీరలు కట్టుకోలేదు. అని అమ్మ చెప్పింది. అమ్మ వర్ణించిన ప్రకారం జయ వేసింది .

चीराण्यसास्या जनकस्य कन्या |
नेयम् प्रतिज्ञा मम दत्तपूर्वा |
यथासुखम् गच्छतु राजपुत्री |
वनम् सम्ग्रा सह सर्वर्त्नैः || २-३८-६
1. tasyaam = that Seetha; naatha vatyaam = though protected by her husband; vasaanaayaam = is wearing; chiiram = bark of trees; anaathavat = like a helpless woman; sarvaH = all; janaH = the people; prachukrosha = loudly cried out; iti = thus; dhik = "Fie; tvaam = upon you; dasharatham = dasaratha!"
On seeing Seetha wearing bark of trees like a helpless woman, eventhough protected by her husband all the people there loudly cried out: "Fie upon you, Dasaratha!"

"పవిత్ర గౌతమీ తీరాన


భద్రగిరి మీద నెలగొనియున్న

శ్రీ సీతారాముల పాదపద్మములకు

పూజా సుమంగా భక్తి తో సమర్పితం"



అని , అంకితం ఇచ్చిన రాముని ఫొటో అమ్మ నిత్యం కొలిచే రామయ్యది .

ఈ బుక్ ఇక్కడ చూడవచ్చు .

https://telugu.pratilipi.com/story/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%82-8DOUwWOppDoE

Wednesday, January 31, 2018

సమ్మక్క-సారలమ్మ





















మాకు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మా ఎల్లమ్మ ప్రతి సంవత్సరం  సమ్మక్క ప్రసాదం బంగారం ( బెల్లం) తెచ్చి ఇస్తోంది.దానితో , నా చిన్నప్పటి విషయం గుర్తొచ్చింది :) నా చిన్నప్పుడు ఒక్ గూడెం లో ఉన్నట్లుగా గుర్తు.అక్కడ వెదురు గుడిశెలో ఉండేవాళ్ళం.అమ్మ బయట నులక మంచం మీద కూర్చొని ఉంటే, కింద ఒక లంబాడీ ఆమె కూర్చొని అద్దాలు కుడుతూ ఉండేది.అప్పుడు నాకు అన్నీ అద్దాల లంగాలు జాకిట్లు,గౌన్లు ఉండేవి.సాయంకాలం నాన్నగారు రాగానే ఎవరో ఒకళ్ళు జొన్న రొట్టెలు , ఎర్రటి పచ్చడి తెచ్చి, దొర తింటడు పెట్టమ్మా అని ఇచ్చేవాళ్ళు. గూడెం అంతా నేను తిరుగుతూ ఆడుకుంటూ ఉండేదానిని.ఇది నాకు ఈ మధ్య అప్పుడప్పుడు గుర్తొస్తూవుంటే అమ్మను అడిగాను.అవును అప్పుడు ములుగు దగ్గర దుంపలగూడెం లో ఉండేవాళ్ళం.అక్కడి గిరిజనులకు ఇళ్ళు కట్టించటం అది మీ నాన్నగారు చేసేవారు అన్నది.నిన్న మా వాళ్ళందరు మేడారం జాతరకు వెళుతుంటే అమ్మా నేనూ ఆ విషయాలు గుర్తు తెచ్చుకున్నాము.ఈ జాతరకు నాన్నగారు కూడా వెళ్ళేవారట.అమ్మ మమ్మలిని కూడా తీసుకుపొమ్మంటే అక్కడ అడవి జంతువులు, పాములు ఉంటాయి , మేము వస్తుంటేనే మా జీపు కు అడ్డంగా పులి వచ్చింది అని తీసుకుపోలేదుట.మనకే ప్రమాదం కాని ఆయనకు కాదా ఏమొ మరి అంది!మణి తో అమ్మ అప్పుడు మా సారు తీసుకుపోలేదు ఇప్పుడు నువ్వు తీసుకుపోతావా అంటే అక్కడ మీరేమి ఉండగలరమ్మా అని నవ్వి వెళ్ళిపోయింది.
అప్పట్లో అక్కడ అంతా దట్టంగా అడవి ఉండేదిట.నాన్నగారు సర్వే కి వెళ్ళి సాయంకాలానికి వచ్చేసేవారుట.జాతర అయ్యాక మళ్ళీ ఆ అడవిలోకి ఎవరూ వెళ్ళేవారు కాదని మా డ్రైవర్ చెప్పాడు.ఇప్పుడు గుడి లాగా కట్టించారు .అందరూ వస్తూ పోతున్నారు.మేము పోయిన నెల వెళ్ళినప్పుడు జాతర దగ్గరకొస్తుండటము తో రోడ్ లు బాగుచేయటము, కరెంట్ పనులు మొదలైనవి జరుగుతున్నాయి.కొద్ది దూరం వెళ్ళగానే రోడ్ మీదుగా వాగు కనిపించింది.అప్పుడప్పుడు వాగులు ఇలా పొంగుతూ ఉంటాయని వెనకకు తీసుకెళ్ళి , పక్క రోడ్ మీదుగా తిప్పి తీసుకెళ్ళాడు. అలా అడవి మధ్య నుంచి వెళ్ళటం కూడా ఒక మంచి అనుభూతి :) కొంచం అడవి మధ్యలోకి వెళుదామని ఉత్సాహ పడ్డాను కాని, చీకటి పడుతోందని మా ఫ్రెండ్ రాజేశ్వరి, మా డ్రైవర్ మహేష్ ఒప్పుకోలేదు .
మొత్తం వెదురుతో కట్టిన గుడి అది. మాములు  గుడికి భిన్నం గా వుంది.అది గుడి అనరట.గద్దె అంటారట. గుడి మొదట్లోనే బంగారం తూచే తరాజు ఉంది. గుడి ముందు అడవి పూలతో కట్టిన దండలు, బెల్లము అమ్మవారలకు సమర్పించేందుకు అమ్ముతున్నారు.విశాలమైన ప్రాంగణం లో ఆ గద్దెలు ఉన్నాయి. అక్కడ అప్పుడు చరిత్ర చెప్పేందుకు ఎవరు లేరు. ఒక పూజారిణి మాత్రం ఉంది. ఆమెకు ఏమీ తెలీదుట.పూజారయ్య ఊళ్ళోకి పోయాడు అంది. అక్కడ మాకు తోచినట్లుగా పూజ చేసుకొని వచ్చాము.అసలు అమ్మవారు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ నుంచి ఈ గద్దె మీద కు తీసుకొస్తారు? అని అడుగుతే ఆమెకాని మహేష్ కాని చెప్పలేకపోయారు!
మా మహేష్ పెళ్ళి అక్కడే అయ్యిందని ఆ స్థలం చూపించాడు.లోపలికి వ్వెళ్ళేటప్పుడు జాతకం చెపుతానన్న కోయ దొరను తప్పించుకొని వెళ్ళాము కాని,తిరిగి వచ్చేటప్పుడు తప్పించుకోలేకపోయాము.పైగా రాజేశ్వరి ఇంట్రెస్ట్ చూపించింది.తను చెప్పించుకొని వచ్చి మీరూ చెప్పించుకోండి సరదాగా అంది.సరే నని కూర్చున్నాను.ముందుగానే నీ యింట ఇప్పటి వరకు పుంజు మాట నడిచింది.ఇక ముందు పెట్ట మాట పుంజు వింటుంది అనగానే అది ఎప్పుడు ఏ జన్మలో జరగాలి అని పక్కున నవ్వాను.అతను చాలా సీరియస్ గా చూసి మీ నాయన చాలా ధర్మాత్ముడు.ఇక్కడ కోయల కోసం చాలా సేవ చేసాడు అన్నాడు.నేను నివ్వెర పోయాను!ఆ తరువాత మా నాన్నగారి గురించే ఎక్కువగా చెప్పాడు!
సమ్మక్క సారలమ్మల గురించి వివిధ కథలు ప్రచారం లో ఉన్నాయి.అందులో ఎక్కువగా వినిపించేది కాకతీయులు వారి రాజ్యం మీద దండెత్తుతే విరోచితముగా పోరాడారు అని.రుద్రమదేవి కన్న ముందే ఆ యువతులు యుద్దం లో పాల్గొన్నారని అంటారు.కొంత మంది వీరిద్దరు అక్కాచెళ్ళెళ్ళు అంటారు కొంతమంది తల్లీ కూతుళ్ళు అంటారు.సమ్మక్క కొడుకే జంపన్న అని, వీరోచితముగా పొరాడి చనిపోయాడని, అతని రక్తం తో ఏర్పడిందే జంపన్నవాగు అని అంటారు.ఆ వాగు లో నీళ్ళు ఎప్పుడూ ఎర్రగా ఉంటాయిట.అది చాలా పవిత్రమైన వాగు అని నమ్మకం.అందులో స్నానం చేసి అమ్మవార్లను దర్శించుకుంటారు.ఎవరి కొరకైతే మొక్కుకుంటారో ఆ మనిషి అంత బరువు గల బంగారం( బెల్లం) తూచి అమ్మవారికి సమర్పించుకుంటారు.
తరువాత తెలుగు మహాసభలల్లో తెలంగాణా వారి స్టాల్ లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిధ్యాలయం వారు ప్రచురించిన, సమ్మక్క-సారలమ్మ జాతర పుస్తకం కొని చదివాను.అందులో చాలా వివరం గా ఇచ్చారు.