Wednesday, April 29, 2020

ఎంతెంతదూరం. . .


ఎంతెంత దూరం
సుధీర్, ఉష కొత్త కార్ కొనుక్కున్నామని చూపించేందుకు మా ఇంటికి వచ్చారు. నల్లరంగు కొత్త అంబాసిడర్  మెరిసిపోతోంది.కాసేపు అందరమూ దాని చుట్టూ తిరిగి చూసి,ఆహా ,ఓహో అనేసుకొని లొపలికి వచ్చాము.సుధీర్ మా ఏమండీ కి టెన్నిస్ క్లబ్ ఫ్రెండ్.ఆ క్లబ్ ఫ్రెండ్షిప్ ఫామిలీ ఫ్రెండ్ షిప్ గా మారింది. సుధీర్ ఓ ప్రైవేట్ కంపెనిలో డైరెక్టర్ గా చేస్తున్నాడు.ఈ మధ్యనే బరోడా నుంచి పోర్ బందర్ కు ట్రాన్స్ఫర్ ఐయి వెళ్ళాడు.నెలకో రెండు సార్లు బరోడా వచ్చి వెళుతుంటాడు.ఉషా మటుకు , పిల్లల్లిద్దరి చదువు కోసమనీ,అత్తమామలు పెద్దవాళ్ళనీ బరోడాలోనే ఉండిపోయింది. ఎప్పుడు వాళ్ళు మా ఇంటికి వచ్చినా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినా భోజనం చేయటం అలవాటు.అలాగే భోజనాలయ్యాక కాసేపు కూర్చొని,"ఇక వెళుతాము. నేను రేపు వెళ్ళాలి." అని లేచారు.వాళ్ళతో పాటు మేము కూడా బయటకు వచ్చాము.సడన్ గా సుధీర్ " రేపు మీరూ నాతో రావచ్చుగా ఎలాగూ నేనొక్కడినే వెళుతున్నాను.పిల్లలకూ సెలవలే కదా "అన్నాడు.
ఈ మధ్యనే నేను ఓ కాన్వెంట్ స్కూల్ లో టీచర్ గా చేరాను.మొదటి నెల జీతం వచ్చింది .ఆ ఉషారులో,వెంటనే నేను "నాకూ సెలవలే.వెళ్దామండీ."అన్నాను.పిల్లలూ "వెళ్దాం డాడీ"అన్నారు.
మా హడావిడి చూసి పాపం ఏమనలేక " సరే వస్తాము కాని తిరిగి వచ్చేటప్పుడు ఎట్లా?"అన్నారు.
"నువ్వు కార్ తీసేసుకో, మా ఆఫీస్ వాళ్ళెవరైనా ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు తెచ్చిస్తారులే.నో ప్రాబ్లం.మీరు హాయిగా అక్కడంతా కార్ లో తిరిగేయండి."అన్నాడు.
అంతే చలో సౌరాష్ట్రా!
మరునాడు  బ్రేక్ ఫాస్ట్ ముగించుకొని బయలు దేరాము.ముందుగా అహ్మదాబాద్ పోదాము, అక్కడ నాకు కొంచం పని ఉంది.” అన్నాడు సుధీర్.సుధీర్ ఆఫీస్ పనయ్యాక, "ఇక్కడ టెక్స్టైల్ మిల్ల్స్ ఎక్కువ కదా , మిల్లుల వాళ్ళు కట్ పీస్ లని బండిల్స్ లల్లో మిగిలిన బట్ట ముక్కలను, కిలోల లెక్కన అమ్ముతారు.ముక్కలన్న మాటే కాని పెద్దగా డ్రెస్ లు కుట్టించుకునేట్లుగా ఉంటాయి.ఉషా ఎప్పుడూ ఇక్కడే తీసుకుంటుంది.నువ్వు కూడా తీసుకుంటావా?"అని నన్ను అడిగాడు.నేను జవాబు చెప్పే లోపలే, ఏమండీ "చూద్దాం పద"అన్నారు.
మంచి మంచి ప్రింట్లతో,చక్కని లేతరంగులలో ఆ కట్ పీస్ లన్ని బాగున్నాయి.కొన్ని ఏరి పక్కనున్న తరాజు లో వేసాను.ఇంకా తీసుకో, నీకు,సంజు కూ ఇద్దరికీ డ్రెస్ లు కుట్టుకుందువుగాని అని దగ్గర దగ్గర ఐదు కిలోల పైనే తీసుకున్నారు.ఆ పక్కనే కాటన్ ఫుల్ వాయిల్ చీరలు కూడా భలేగా ఉన్నాయి.నాకిష్టమైన వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో,తెల్లని చీర మీద అక్కడక్కడా నల్లని చిన్నచిన్న పూలతో ముద్దుగా ఉన్న చీర చాలా నచ్చింది.కాని అప్పటికే చాలా తీసుకున్నాము,ఇంకా ప్రయాణం మొదట్లోనే ఉన్నాము, డబ్బులన్నీ ఇప్పుడే ఖర్చు చేస్తే ఎట్లా అని నేను అనుకుంటూ ఉండగానే ఏమండీ నా చూపులను కనిబెట్టి కొనేసారు.వద్దు వద్దు అంటూనే కొంచం ఇష్టం తో కొంచం అయిష్ఠం తో తీసేసుకున్నాను.
హోటల్ రూం లో కాసేపు రెస్ట్ తీసుకొని, చాయ్ తాగి డ్రైవ్ ఇన్ మువీ కి  వెళ్ళాము.షమ్మీకపూర్,సైరాభానుల సినిమా "జంగ్లీ"వేస్తున్నారట ఆ రోజు.మేము ప్లేస్ చూసుకొని సెటిలైయ్యేసరికి సినిమా మొదలైంది.పెద్ద గ్రౌండ్ లో పెద్ద స్క్రీన్ మీద వేస్తున్నారు.కొందరు కార్లల్లోనే కూర్చొని చూస్తున్నారు.కొంత మంది కార్ పక్కన ఫోల్డింగ్ చేర్స్ వేసుకొని, కింద దుప్పటి పరుచుకొని కూర్చొని , హాయిగా ఇంట్లో కూర్చొని చూస్తున్నట్టు చూస్తున్నారు.ఓపెన్ ఏర్ థియేటర్ లో సినిమా చూసాము.కాని ఇలా కార్ లో కూర్చొని చూడటం గమ్మత్తుగా ఉంది.సినిమాలో సైరాభాను చాలా సున్నితంగా అందంగా ఉంది.సుధీర్,ఏమండీ షమ్మీకపూర్  డాన్స్  లు  ఎంజాయ్ చేస్తుంటే, నేను మాత్రము చాహే కోయి ముఝే జంగ్లీ కహే అని పాడేసుకుంటూ, పిల్లలతో కలిసి రకరకాల చాట్ లు అబ్బో ఎన్ని రకాలొ  తింటూ ఎంజాయ్ చేస్తూ ,మధ్య మధ్య కాసిని వాళ్ళిద్దరికీ ఇస్తూ ,సినిమా ఏమో కానీ డ్రైవ్ ఇన్ మువీ ,చాట్ లూ బహూ మజా ఆవీ :)
మరునాడు పోర్ బందర్ చేరాము.మాకు చౌపాటీ (గెస్ట్ హౌస్) లో రూం ఇప్పించి, తన అసిస్టెంట్ ఒక అబ్బాయిని మాకు గైడ్ గా ఏర్పాటు చేసి,మీకు పోర్ బందర్,సోం నాథ్, ద్వారకా అన్నీ ఇతను చూపిస్తాడు ,నేను మళ్ళీ  మీరు వెళ్ళేటప్పుడు కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు.మహాత్మాగాంధీజీ పెరిగిన ఊరు అని తలుచుకుంటుంటేనే చెప్పలేని భావమేదో వచ్చేసింది.ఎంతో ఆనందంగా ఊహించుకుటూ ఉంటే ఆ  గుంతల రోడ్డులు, ఇరుకు సందులు ఇబ్బంది పెట్టాయి."ఇదిగో ఇదే గాంధీజీ ఇల్లు " అని సుదీర్ అసిస్టెంట్ అరవింద్ లోపలికి తీసుకెళ్ళాడు.ఎంత అబ్బురంగా చూసామో.మేడ మీదికి తీసుకెళ్ళి, పక్కనున్న ఇల్లు చూపిస్తూ "అదే కస్తూరిబా ఇల్లు.ఈ పక్కన కనిపిస్తోందే అది కస్తూరిబా గది.ఇదో ఈ కిటికీ లోనుంచే కస్తూరిబా గాంధీజీ ని చూస్తూవుండేది ఎప్పుడూ" అని ఓ ప్రేమ కథ వినిపించేసాడు. అబ్బో గాంధీజీ ,కస్తూరీబా కు కూడా ఓ ప్రేమకథ ఉందే అని ఆశ్చర్యపోయాము.
తిరిగి తిరిగి చౌపాటీకి వచ్చాము.డిన్నర్ చేసి పిల్లలు అలిసిపోయి పడుకున్నారు.నేను బాల్కనీ లోకి వచ్చాను.ఎదురుగా సముద్రుడు ఎగిసిపడుతున్నాడు.కార్తీక చంద్రుడు నన్ను చూడు,నా అందం చూడు అని మెరిసిపోతూ చుక్కలకందకుండా ఏడిపిస్తున్నాడు.అబ్బ ఎంత మనోహరంగా ఉంది.వాలు కుర్చీ జరుపుకొని కూర్చొని పరవశించిపోతున్నాను.ఏమండీవచ్చి "పడుకోకుండా ఏమి చేస్తున్నావు.పడుకో ."అన్నారు.
"అశ్వద్దామ కోసం చూస్తున్నాను."అన్నాను అప్రయత్నంగా.
"ఎవడాడు?"అడిగారు.
"అయ్యో తప్పు అలా అనకూడదు చెంపలేసుకొండి.ద్రోణాచార్యుడి కొడుకు."అన్నాను.
నేనెక్కడ ఆయన చెంపలేస్తానో అని కాస్త దూరం జరిగి"ఎవరు"అని మళ్ళీ అడిగాడు.
"అబ్బా అన్నీ చెప్పాలి.భారతం లో పాండవుల గురువు ద్రోణాచార్యులున్నారా ?ఆయన కొడుకు అశ్వద్దామ."అన్నాను.
"ఏడిచినట్టుంది.ఇన్ని యుగాల తరువాత నీకు కనిపిస్తానని చెప్పాడా?"
"నాకేమీ చెప్పలేదు,మీరేమీ నన్ను వెక్కిరించనక్కరలేదు.అశ్వద్దామ చిరంజీవి.ఆయనకు మరణం లేదు.ఈ సముద్రం వడ్డునే తిరుగుతూ ఉంటాడట.ముఖ్యంగా పౌర్ణమి రోజులల్లో తప్పక వస్తాడట.దాదాపు ఇరవై అడుగులపైన ఉంటాడట. చాలా గంభీరంగా ఉంటాడట.మన పనిమనిషి తులసీబెన్ చెప్పింది."అన్నాను చాలా ఉద్వేగంగా.
"ఎంతుంటాడటా, నీ కూతురి ఆకాశమంత సిస్టర్ లా ఉంటాడటనా ? ఏదీ మన ఇంటి వెనుక పౌర్ణమి రోజు ఓ నల్లనాగు ఓ మణి ని నెత్తిన పెట్టుకొని డాన్స్ చేస్తుందని ,తులసీబెన్ చెప్పిందనేగా ప్రతి పౌర్ణమికీ కిటికీ పక్కన కూర్చొని ఎదురుచూస్తూ ఉంటావు అలాగ ఇక్కడ అశ్వద్దామ వస్తాడని ఈ రాత్రంతా ఎదురు చూస్తావా ? సరే సరే కానీ చూసి తరించు."అని  " అశ్వద్దామా హతః కుంజరః" అంటూ, నవ్వుకుంటూ లోపలికి వెళ్ళారు.
పెద్ద అశ్వధామ ఎవరో తెలీనట్లు చేసారు.,హుం ఎప్పుడూ నన్ను వెక్కిరించటమే .
బోట్ సముద్రపు అలల మీద చిన్నగా తేలిపోతోంది..సూర్య కిరణాలు నీటి మీద పడి తళతళా మెరిసిపోతున్నాయి.రాత్రి చాలా సేపు బైట కూర్చొని ఎప్పటికో నిద్రపోయాను.పొద్దున లేవగానే అందరమూ రెడీ అయ్యి,సోమనాథ్ చూసి ,బేట్ ద్వారక చూద్దామని వెళుతున్నాము.సముద్రము పక్క నుంచి వెళుతుంటే ఏమండీకి కాసేపు బోట్ లో వెళ్ళాలనిపించి బోట్ ఎక్కాము.వచ్చీ రాని గుజరాతి లో పడవతని తో ముచ్చట్లేస్తున్నారు ఏమండి. మనము ఏ స్టేట్ లో ఉంటే అక్కడి భోజనం తినటం,వాళ్ళ భాషా కొంచమైనా నేర్చుకోవాలి అని ఏమండీగారి సిద్దాంతము.ఇంతలో కొంచం దూరం లో ఓ పెద్ద భవనము చూపించి అదే బేట్ ద్వారక అన్నాడు పడవతను.
దానితో మహా ఉత్సాహంగా "అదిగో ద్వారక, ఆల మందలవిగో"పద్యం ఎత్తుకున్నారు ఏమండీ.డాడీ తోపాటు కొడుకుకు కూడా అంతకన్నా ఉత్సాహం ఎక్కువైపోయి ,"బావా ఎప్పుడు వచ్చితివీవు ?"అని ఎత్తేసాడు.
""ఓరోరి బేటా ఈ పద్యం దీనికి చదవరురా"అంటే వింటేనా! తండ్రీకొడుకులు ఓ వచ్చిన పద్యాలన్నీ పాడేసుకుంటూ , బోట్ షికార్ ముగించి , ద్వారక చేరాము.అసలు ద్వారక సముద్రము లో మునిగిపోయాక, ఈ భవనం ఒక్కటే మిగిలిందని గైడ్ చెపుతూ , ఇది రుక్మిణి అంతఃపురం, ఇది సత్యభామ అంతఃపురం అని చూపించాడు.ఏమిటబ్బా ఇంత చిన్న గుమ్మాలున్నాయి.ఇన్ని రంగులేసారు అనుకుంటుంటే ఏమండీ "బహుశా ఇది తరువాత జ్ఞాపకచిహ్నంగా కట్టి ఉండవచ్చు అన్నారు.
మొత్తానికి ఏదైతేనేమి ద్వారక చూసాము.సోమనాథ్, గాంధీజీ ఇల్లు,కస్తూరిబా ఇల్లు,కచ్ దగ్గర గాంధీజీ ఉప్పుసత్యాగ్రహం చేసిన ప్రదేశము అన్నీ చూసుకొని, సుధీర్ కు థాంక్స్ చెప్పి తిరుగు ప్రయాణమయ్యాము.
దారంతా చిన్న చిన్న పల్లెటూళ్ళు.పొద్దున్నే బయలుదేరటము తో పోర్ బందర్ లో లంచ్ పాక్ చేసి తెచ్చుకోలేక పోయాము.ఏమి చేయాలా అనుకుంటూ ఓ ఊరు కొంచం పెద్దగా కనిపిస్తే ,పక్కన కార్ ఆపి అక్కడున్న ఒకతనిని అడిగారు ఇక్కడ భోజనం ఏమైనా దొరుకుతుందా? అని అతను ఆ పక్కనే ఉన్న గుడిసె చూపించి , ఇందులో ఒక ముసలమ్మ రోటీ, సబ్జీ చేసి అమ్ముతుంది అని చెప్పాడు.అమ్మయ్య అనుకొని ఏమండీ లోపలికి వెళ్ళి రోటీ, సబ్జీ పాక్ చేయించుకొచి "లక్కీగా టైం కు వచ్చాము.ఆవిడ చేయటం ఆపేస్తోంది.మన కోసం అని వేడి వేడిగా జొన్న రొట్టెలు చేసిచ్చింది. మూంగ్ సబ్జీ కూడా ఇచ్చింది.కాని అక్కడ తినేందుకు వీలుగా లేదు ఎక్కడన్నా ఆపుకొని తిందాము."అన్నారు.కొంచము ముందుకు వెళ్ళగానే రోడ్ పక్కన ఒక పొలం కనిపించింది.దాని గేట్ ముందు పెద్ద రావి చెట్టు ఉంది.దాని కింద కార్ ఆపారు.అందరము కిందికి దిగాము.నేను కార్ డిక్కీ లో నుంచి ప్లేట్ లూ, గ్లాస్ లూ ఉన్న బుట్ట తీస్తున్నాను .ఇంతలో లోపల నుంచి ఒకతను బయటకు వచ్చి,మమ్మలిని చూసి,” థం బద్దా బాహర్ బైఠా చో.ఘర్మా అందర్ ఆవో. (బయటెందుకు కూర్చున్నారు? లోపలికి రండి. ).అన్నాడు.
అతనితో నలుగురమూ లోపలికి వెళుతూ ఏమండీ ఆ రైతును "తమారూ సూ నాం చే?"(నీ పెరేమిటి?) అని అడిగారు.
"మారూ నాం ముకుంద్".అని చెప్పాడు.
లోపలికి తీసుకెళ్ళి ముకుంద్, పెద్ద మామిడి చెట్టు కింద మాకోసం రెండు నులక మంచాలు తెచ్చి వేసాడు.వాటి మీద దుప్పట్లు వేసాడు .మేము ముసలమ్మ దగ్గర నుంచి తెచ్చిన జొన్నరొట్టెలు,మూంగ్(పెసల)కూర తీసి, నా దగ్గర ఉన్న పళ్ళాలల్లో వేస్తున్నాను. ఇంతలో ముకుంద్ ఒక పెద్ద కటోరీ నిండా తెల్లటి పేరి నెయ్యి, ఒక కూజాలో మంచి నీళ్ళు తెచ్చిచ్చాడు మళ్ళీ వెళ్ళి,తళతళా బంగారం లా మెరుస్తున్న నాలుగు పెద్ద పెద్ద ఇత్తడిగ్లాస్ ల నిండా మజ్జిగ తెచ్చిచ్చాడు. అన్నీ అక్కడ పెట్టి ఆరాం గా తినమని చెప్పి తన పనిలోకి వెళ్ళిపోయాడు.ఏమండి వెన్నముద్దలా ఉన్న ఆ నెయ్యి కొద్ది కొద్దిగా తీసి రొట్టెల మీద వేసి పిల్లలకు ఇచ్చారు.జొన్న రొట్టెలు అలవాటు లేవు,పిల్లలు  ఎట్లా తింటారా అనుకున్నాను కాని , చల్లగా హాయిగా ఉన్న ఆ పొలం లో చెట్టు నీడన కూర్చొని "డాడ్ నువ్వెప్పుడూ భలే పిక్నిక్ అరేంజ్ చేస్తావు"  అంటూ ఆ వేడి వేడి రొట్టెలు ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మా భోజనం అయ్యాక ఏమండీ ముకుంద్ తో ముచ్చట్లేస్తూ పొలం అంతా ఓ రౌండ్ కొట్టచ్చారు.
కాసేపు విశ్రాంతి తీసుకున్నాక, బయిలుదేరుతూ ఏమండీ ముకుంద్ భుజం చుట్టూ చేయివేసి దగ్గరకు తీసుకొని , "బహు మజా ఆవీ.మహర్మాని"( చాలా ఎంజాయ్ చేసాము.థాంక్ యూ ) అని  ధన్యవాదాలు చెప్పారు.ముకుంద్ విప్పారిన మొహం తో మాతోపాటు గేట్ దాకా వచ్చి,"ఆవ్ జో " (బై) అన్నాడు.
'మాధవపురం ' అని బోర్డ్ చూసి కార్ ఆపి,ఇక్కడేమన్న ప్రత్యేకమా అని అడిగారు అక్కడున్న ఓఅతనిని.అతను కొంచం దూరం లో ఉన్న ఓ చెట్టు చూపించి , ఈ చెట్టు కిందనే శ్రీకృష్ణుడు నిర్యాణము చెందాడని, అప్పటి నుంచి ఈ చెట్టును ఎండిపోకుండా కాపాడుతున్నారని చెప్పాడు.చూద్దాం అని దిగి పిల్లలను ఆ చెట్టుకు దండం పెట్టమని ఫొటో తీసాను.
"బాగుంది.అతను చెప్పటమూ, నువ్వు నమ్మటము, పిల్లలను నిలబెట్టి ఫొటో తీయటమూ "అంటూ నవ్వారు ఏమండి.
"పోనీయండి నాది పిచ్చే.పిల్లలూ పెద్దయ్యాక ఈ ఫొటో చూసి నవ్వుకుంటారు సరదాగా"అన్నాను కాస్త కినుకగా.
కనుచీకటి పడుతుండగా 'వీర్ పూర్ ' చేరాము.ఇదేదో కాస్త పెద్ద ఊరులా ఉంది ఈ రోజు ఇక్కడ ఉండి రేపు పొద్దున వెళుదాము అని అక్కడ ఉండేందుకు ఏముందా అని కనుక్కుంటే "జలారాం" మందిర్ ఉందని, దానికి అనుబంధంగా ధర్మశాల ఉందని, భోజనము కూడా అక్కడ పెడతారని చెప్పారు.ధర్మశాల క్లర్క్ తో మాట్లాడి గది తీసుకున్నాము.గది శుభ్రంగా బాగుంది కాని కామన్ వాష్ రూంలే వాడుకోవాలి.గుణుస్తున్న పిల్లలకు ఇదీ ఒక ఎక్స్పీరియన్స్ .అన్నీ నేర్చుకోవాలి అని నచ్చ చెప్పారు ఏమండీ.ఏమాటకామాటే చెప్పాలి కామన్ ఐనా చాలా శుభ్రంగా ఉన్నాయి.
రాత్రి భోజనం లో,పెద్దగా గుండ్రంగా ఉన్న ఇత్తడి కంచం లో ,ఒక కటోరీ లో ఆలూ సబ్జీ, ఒక కటోరీలో, ఉల్లిగడ్డ ముక్కలూ, నిమ్మకాయ ముక్క, ఒక కటోరీలో దాల్ వేసి తెచ్చి ముందు పెట్టారు. రోటీలు వేడిగా చేస్తూ వడ్డించారు.కటోరీలు, గ్లాస్ లూ అన్నీ ఇత్తడివే.తళతళా బంగారంలా మెరిసిపోతున్నాయి. గుజరాతీలు పాత్ర సామానులన్నీ ఇత్తడివే వాడుతారు.పైగా మెరిసేట్టుగా తోముతారు.అంతలా ఎలా మెరిపిస్తారా అని నాకెప్పుడూ ఆశ్చర్యమే!
రాత్రి హాయిగా విశ్రాంతి తీసుకొని, పొద్దున్నే ధర్మశాల వాళ్ళు పెట్టిన పోహా తిని మళ్ళీ రోడ్ ఎక్కాము.దారిలో వస్తున్న చిన్న చిన్న ఊళ్ళన్నిటికీ కృష్ణుని పేర్లే ఉన్నాయి.అవన్నీ శ్రీకృష్ణుడు నడయాడిన ఊళ్ళట.శ్రీకృష్ణపరమాత్మ బాల్యం అక్కడే గడిచిందని ఒక్కో ఊళ్ళో ఒక్కో కథ చెప్పారు.అన్నీ తాఫీగా చూసుకుంటూ వెళుతున్నాము.పిల్లలు వెనక సీట్లో ఏవో ఆటలాడుకుంటున్నారు.ఏమండీ చిన్నగా విజిల్ వేస్తూ డ్రైవ్ చేస్తున్నారు.మాధవుడు బాల్యం గడిపిన ప్రదేశాలు చూస్తుంటే పవిత్రమైన భావన కలుగుతోంది.చిలిపి కృష్ణుడు గుర్తొచ్చి, "బడ నట్ కట్ హైరే కిషన్ కన్నయ్యా ,
కా కరూ యశోమతి మయ్యా."
అని కూని రాగం తీస్తూ పరవశించిపోతున్నాను.
"డాడ్"
వెనక నుంచి పిల్లలు పిలిచారు.కూనిరాగం ఆపి,ఏమైందా అని వెనక్కి తిరిగాను.
"వాట్?" అన్నారు ఏమండి.
నాలుగు రోజుల నుంచీ ప్రయాణం చేస్తున్నారేమో ,ఆటలూ, పాటలూ అన్నీ ఐపోయి విసుగొచ్చేసినట్లుంది, "ఇంకెంత దూరం?" అన్నారు కోరస్ గా.
"అట్లా అడగ కూడదు.ఎంతెంత దూరం అని అడగాలి."జవాబిచ్చారు.
"సరే ఎంతెంత దూరం ?" అన్నారు ఇద్దరూ.
ఏమండీ నాతో "ఇప్పుడు నువ్వేమనాలి?" అన్నారు.
ఓహో పిల్లలను ధ్యాస మళ్ళించి, ఎంగేజ్ చేస్తున్నరన్నమాట అనుకొని "కోసు కోసు దూరం." అన్నాను.
"కోసు అంటే ఏమిటి డాడీ? సుపుత్రిక ప్రశ్న.
"కోసు అంటే కొంచం దూరం అన్నమాట.ఏదీ మళ్ళీ అడగండి ఎంతెంత దూరం అని."
"వెనక నుంచి వాళ్ళు ఎంతెంత దూరం అనటం , ముందు నుంచి మేము కోసు కోసు దూరం అనటం.ఇంతలో జునాఘడ్ వచ్చింది.అక్కడే ఓ పక్కన ధాభా దగ్గర ఆపి కాసేపు కూర్చొని,మేము చాయ్, పిల్లలు ఐస్ క్రీం కానిచ్చేసాము.
మళ్ళీ "ఎంతెంత దూరం డాడీ ?"
"కొంచం కొంచం దూరం బేటీ."
సరే ఇంకేం బేటా, బేటీ, డాడీ పాడుకుంటుంటున్నారుగా అని నేను నా కన్నయ్య లోకం లోకి వెళ్ళాను.
"శ్యాం తేరీ, కన్నయ్యా తేరీ బంశీ పుకారే రాధా నాం,
రాధా కాభీ శ్యాం హైతో, మీరా కాభీ శ్యాం హై."
 చిన్న జర్క్ తో కార్ సడన్ గా ఆగింది.నేను ఏమైందా అని చూసాను.ఏమండీ కిందకి దిగి చూస్తున్నారు.
"డాడ్ మేము కార్ తొయ్యం.” పిల్లలు గట్టిగా అరిచారు. ఓసారి ఇలాగే సుధీర్ పాత కార్ లో పిక్నిక్ కు వెళితే, కార్ స్టార్ట్ చేయాల్సిన ప్రతిసారీ కొద్ది దూరం తోస్తే కాని ముందుకు పోనని మారాము చేసేది.పాపం పిల్లలు పిక్నిక్ సరదా లో కార్ వెనుక చేరి వాళ్ళ డాడీ చెపుతుంటే "హైలెస్సో హైలెస్సా "అని నెట్టారు.పైగా అప్పుడు వాళ్ళ పిల్లలిద్దరు, మా పిల్లలిద్దరు , సుధీర్ ఉన్నారు కాబట్టి సరిపోయింది.ఆ తరువాత ఆ కార్ మళ్ళీ ఎక్కమని ప్రతిజ్ఞ చేసారు.అది గుర్తొచ్చి ,"మేము తొయ్యమంటే తొయ్యం ."అని గొడవ మొదలుపెట్టారు.
"అబ్బ ఆగండి డాడీ చూస్తున్నారు గా ఏమైందో."అన్నాను.
ఏమండి లోపలికి వచ్చి "అంతా బాగానే ఉంది, పెట్రోల్ చెక్ చేస్తాను "అని చెక్ చేసి,"అరే పెట్రోల్ తక్కువగా ఉందే.ముందు చూసుకోలేదే "అన్నారు.
"అమ్మో మరి ఎట్లా ?బరోడా ఇంకెంత దూరం ఉంది? ఎట్లా వెళుతాము?"అన్నాను గాభరాగా.
"ఇంకో గంటా ,రెండు గంటలు పట్టవచ్చు.చూద్దాం అక్కడి దాకా వస్తుందిలే."అన్నారు కాస్త నీరసంగా.
"కొంచం ఉంది కదా.దారి లో ఎక్కడైనా పెట్రోల్ బంక్ కనిపిస్తే పోయించుకుందాం లెండి."అన్నాను.
కార్ స్టార్ట్ చేసి "డబ్బులు లేవు ఐపోయాయి."అన్నారు .
"ఆ"అన్నాము ముగ్గురమూ ఒక్కసారే పెద్దగా.చూద్దాం అన్నారు.అప్పటి దాకా అందంగా కనిపించి, ఊహల్లో విహరింపచేసిన ఆ ప్రదేశం ఇప్పుడు భయం కలిగిస్తోంది.
"పోనీ లెండి. నా చెవికి రింగులున్నాయి. చేతికి గాజులున్నాయి.అవెక్కడన్నా అమ్మవచ్చు." అన్నాను కాస్త తేరుకొని.
"ఎక్కడ అమ్ముతావు ?"అన్నారు.
నిజమే ఎక్కడ అమ్ముతాము ?అంతా అడవి లాగా ఉంది .రోడ్ కు రెండు వైపులా దయ్యాల్లా పెద్ద పెద్ద చెట్లు తప్ప ఎక్కడా ఊరు కనిపించటం లేదు.పిల్లలు "డాడ్ ఇప్పుడేం చేద్దాం." అన్నారు ఏడుపు గొంతుతో.
"ఓ పని చేద్దాం. మనం జలారాం ను దర్శించుకొని వచ్చాము కదా ఆయననే ప్రార్దిద్దాం క్షేమం గా బరోడా చేర్చమని.సరే నా అనండి , శ్రీరాం, జై రాం,జై జలారాం.అని మనం ఇంటికెళ్ళేదాకా భజన చేయండి ఓకే నా స్టార్ట్." అన్నారు.
పిల్లలిద్దరూ "శ్రీరాం, జై రాం,జై జలారాం"అని భజన మొదలు పెట్టారు.
"అహ్మదాబాద్ లోనే అన్నాను మొదట్లోనే షాపింగ్ ఎందుకు అని.అన్ని బట్టలు కొన్నారు.అవి కొనకుండా ఉంటే డబ్బులైపోయేవి కాదు కదా."చిన్నగా గొణిగాను.
"ఏదో నువ్వు సంతోషిస్తావని కొన్నాను కాని ఇట్లా అవుతుందనుకున్నానా?"విసుక్కున్నారు.
ఇంకా ఏమీ మాట్లాడే ధైర్యం లేక "నాకోసం కొన్నారట."అని గొణుక్కుంటూ పిల్లలతో నేనూ గొంతుకలిపాను శ్రీరాం, జై రాం,జై జలారాం అంటూ.పాపం అనీ అనీ నీరసిస్తున్నారు పిల్లలు అనుకున్నట్లున్నారు."ముగ్గురూ ఒకేసారి కాకుండా ఒకళ్ళ తరువాత ఒకరు  బారీ బారీ అనండి."అన్నారు ఏమండీగారు.
ఏమి చేస్తాం హై కమాండ్ ఆర్డర్.మధ్య మధ్య "డాడ్ ఇంకెంత దూరం ఉంది ?"అని అడుగుతున్నారు.ఎంతెంత దూరం అనుకుంటూ అమ్మయ్య మొత్తానికి చీకటి పడక ముందే ఇంటికి చేరాము.ఇంటి ముందు కార్ ఆగగానే ఊఫ్ అమ్మయ్య జలారాముడు క్షేమంగా చేర్చాడు అనుకున్నాను.పిల్లలిద్దరూ "హే హే హే"అని సంతోషంగా అరుచుకుంటూ కార్ లో నుంచి దూకినట్లుగా దిగారు.ఏమండీ డిక్కీ తీస్తుంటే, "ఇంటి కీ ఇవ్వండి"అని అడిగాను.
జేబులో నుంచి కీ తో పాటు పర్స్ కూడా వచ్చింది.అదీ అందుకున్నాను.అప్రయత్నంగా పర్స్ లో చూస్తే వంద రూపాయల నోటు, ఇంకా చిల్లర నోట్లూ కనిపించాయి."డబ్బులున్నాయిగా?లేవన్నారేమిటి?"అడిగాను ఆశ్చర్యంగా.
"కార్ లో పెట్రోల్ కూడా ఉంది."అన్నారు నవ్వుతూ.
"ఐతే "ఆ తరువాత ఏమనాలో తెలీక ఏమండీ వైపు చూసాను.పిల్లలు కూడా గంతులాపి మావైపు చూసారు.
"మీకందరికీ బోర్ కొడుతోందని , కాస్త ఉషార్ చేద్దామని అట్లా చెప్పాను."అన్నారు నవ్వుతూ .పిల్లలిద్దరూ "డాడీ" అంటూ ఏమండీని కొట్టసాగారు.ఏమండీ వాళ్ళ నుంచి తప్పించుకుంటూ,"నేనట్లా మిమ్మలిని భజన చేయించకపోతే డాడీ ఎంతెంత దూరం అంటూ ఎంత గోల చేసేవారు."అని తల పైకెత్తి ఓ అంటూ బిగ్గరగా నవ్వారు.
(సాహితి-29/4/2020)

( ఈ కథా కాలం 1983.అప్పుడు పోర్ బందర్ లో రోడ్ లవీ అట్లాగే ఉండేవి.ఇప్పుడు చాలా డెవలప్ అయ్యింది.చౌపాటీలో ఉండక్కర లేదు.ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయట.అట్లాగే వీర్ పూర్ కూడా బాగా డెవలప్ అయ్యిందిట.షిరిడీ సాయిబాబా లాగా మేమంతా జలారాం ను కొలుస్తాము.మేము రెగ్యులర్ గా వెళుతుంటాము అని చెప్పింది మా ఫ్రెండ్ ఉష. అలాగే అప్పుడు వంద రూపాయలంటే ఎక్కువ మనీ కిందే లెక్క  :) పాఠకులు ప్రశ్నించకుండా ముందు జాగ్రత్త అన్నమాట.)