Tuesday, August 22, 2017

ఈ నేలా . . . ఈ గాలీ



కళ్ళు తెరవగానే కిటికీ లో నుంచి కనిపిస్తున్న వెలుతురు. . .
గోడ మీద గడియారంలో టైం . . . 
గాలిలో తేలి వస్తున్న ,పారిజాతం , మాలతీ సౌరభాలు. . . 
చెట్టు మీది పక్షుల కూతలు . . . 
రోడ్ మీద ఆకుకూరల వాళ్ళ అరుపులు . . . 
పక్కింటి నుంచి నల్లాలో పడుతున్న నీళ్ళ చప్పుడు . . .
ఎక్కడి నుంచో , కాదు మా ఫోనే రింగవుతోంది 
కింద నుంచి అమ్మ " కమలా లేచావా ? కాఫీ పంపనా ?"
"వద్దమ్మా నేను కలుపుకుంటాను "
కాఫీ గ్లాస్ తో బాల్కనీలోకి రాగానే ఎదురు కరెంట్ తీగ మీద పరిగెడుతున్న ఉడతమ్మ పరుగాపి , నా వైపు చూసి " హాయ్ వచ్చావా ? " పలకరింపు . . .
"హాయ్ చిన్నారీ ఎలా వున్నావు ? ఐ మిస్ యు ". . .
"ఐ టూ " అంటూ పరుగో పరుగు . . .
బుజ్జిపాపాయి బోర్లా పడుకున్నట్లు మెట్ల మీద ముద్దుముద్దుగా బోర్లా పరుచుకున్న పారిజాతాలు . . .
మణి పైకి వస్తూ "అమ్మా కాఫీ డికాక్షన్ వేసాను . ఫ్రిడ్జ్ లో పాలున్నాయి. చూసుకున్నారా ? కూరలు తెచ్చాను కాని , పండ్లు తెచ్చుకోవాలి. గాస్, కాఫీ పౌడర్ బుక్ చేయాలి. బియ్యం , సరుకులు తెచ్చుకోవాలి."
ఊం , గీజర్ ఆన్ చేసుకోవాలి నల్లా తిప్పగానే వేడి వేడి నీళ్ళు రావు మినియాపోలీస్ లో లేను , హైద్రాబాద్ లో ఉన్నాను 

Tuesday, August 15, 2017

పొదరిల్లు





" అత్తగారిని హీరోయిన్ గా పెట్టి రాసేసిన భానుమతిగారు . వూళ్ళో వాళ్ళ మీద రాస్తే దెబ్బలాటకి రారూ ! మాఇంట్లో వాళ్ళమీద రాస్తే ఏగోలా ఉండదు అన్న బీనాదేవిగారు , తన బాల్యం .తనఫాక్టరీ నేపధ్యంగా ,తీసుకుని కధలు అల్లిన సోమరాజు సుశీలగారూ ,
తన పల్లెటూరూ తన అనుభవాలని కధల రూపంలో చెప్పే పొత్తూరి విజయలక్ష్మీ (అంటే నేనే )
వీళ్ళందరూ ఆకోవకే చెందుతారు . 
వీళ్లకధల్లో ఏముంది అని అంటే ఏమీ ఉండదు . కానీ పాఠకులకు వీళ్లంటే వల్లమాలిన అభిమానం . వీళ్ళ పుస్తకాలు బాగానే అమ్ముడవుతాయి . 
ఆ రచయిత్రుల్లాటి ఓ ఇల్లాలే ఈ మాలాకుమార్ . ఈవిడ అనుభవాలను అలవోకగా చెప్పటం తో.
అవన్నీ హాయిగా చదివిస్తాయి .
మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి సాహితి అనే బ్లాగ్ లో రాసుకున్న వన్నీ ఒక మాలగా కట్టి ఈ బుక్ గా మనకు అందిస్తున్నారు .
ఈ సువిశాలమైన సాహితీ ప్రపంచంలో ఇది నాతొలి ప్రస్థానం అంటూ భారీగా చెప్పలేదు .
నా చిన్నిప్రపంచం . పొదరిల్లు అన్నారు ఆమె తరహాలో .
నిజమే .పొదరింట్లో కి అడుగు పెడితే కలిగే అనుభవం వేరుకదా. " అని నా అభిమాన రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారు ,
" ఎంతో తెలివైనపని చేసేననుకుని గొప్పలు పోయే అమాయకపు ముదిత ముచ్చటైన కబుర్లు వినాలన్నా, ముఖ్యంగా మురిసిపోతూ చెప్పే “ఏవండీ” గారి కబుర్లు ముగ్ధులై వినాలన్నా ఈ సాహితి పుస్తకం వెంటనే చదివెయ్యడం ఒక్కటే మార్గం." అని జి.యస్.లక్ష్మి గారు ( రచయిత్రి బ్లాగర్ ) ,
"షడ్రసోపేతమైన విందు ఆరగించబోతున్నారు కదా, దాని రుచి నేను చెప్పటమెందుకు. మీరే ఆస్వాదించండి.అని పి.యస్.యం లక్ష్మి గారు (రచయిత్రి,బ్లాగర్),

తన పిల్లల్లూ, తన పిల్లల పిల్లలూ వారి ముచ్చట్లూ గురించి రాస్తున్నప్పుడు సంపూర్ణమైన కుటుంబజీవితంలోని ఆనందాన్ని మాధుర్యాన్ని ఆస్వాదించిన గృహిణిగా తల్లిగా కనిపిస్తారు. అలాగే కంప్యూటర్ నేర్చుకోవడంలో ఆవిడ పట్టుదల, పూల పెంపకంలోనూ ఇతర కార్యక్రమాలలోనూ ఆవిడ సౌందర్యారాధనా - వెరసి పాఠకులకి ఒక చక్కని ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. " అని సీనియర్ బ్లాగర్ కొత్తపాళీ గారు అభినందించిన, (అడిగి పోగిడించు కున్నాను అని ఏమండి అంటున్నారు కాని ఆయన మాట వినకండి ) 

ఈ సాహితి నా స్వంతం . . నా ఊహల ప్రతి రూపం.. నా  చిన్ని ప్రపంచమైన నా కుటుంబములోని సరదా సంఘటనలను  పోడుపుకున్న చిన్ని పొదరిల్లు.ఈ  నా "సాహితీ" బ్లాగ్ పోస్ట్ ల తో చేసిన ఈ బుక్ "సాహితీ " నిన్న మా ఏమండి గారు ఆవిష్కరించారు. 
నా సాహితిని , నీ జతగా నేనుండాలి కథా సంపుటిని , అనగనగా ఒక కథ పుస్తక సమీక్శలను ఇంత చక్కగా , ఓపిక గా ఈబుక్స్ చేసి ఇచ్చింది మా కోడలు అను. తన ప్రోత్శాముతోనే తొమ్మిదేళ్లుగా నేనూ చేసుతున్న రచనలన్నీ ఈబుక్స్ గా మారాయి. థాంక్ యు అను. 
ఈ మూడు పుస్తకాలూ , ఇక్కడ సైడ్ బార్ లో ను , 

http://kinige.com/kbook.php?id=8242

https://telugu.pratilipi.com/read?id=4546056755347456


ఇక్కడా ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకొని చదవచ్చు.  
నా పొదరింటి కి ఇదే స్వాగతం .

Friday, July 14, 2017

కూ . ..చుక్ . . . చుక్. . . చుక్




పుస్తకాలు సద్దుకుంటూ , భాను వైపు చూసాను.అప్పటి కి తనూ లేచింది. పుస్తకాల బాగ్ భుజానికి తగిలించుకొని కూ  అని కూత  పెడుతూ పరుగు తీసాము. అవును మరి అప్పటికే కొంచం ఆలశ్యం అయ్యింది. సోషల్ సారు బెల్ల్ మోగినవెంటనే  వదల్లే . అడ్డం వచ్చిన రాళ్ళను తన్నుకుంటూ పరుగులు పెట్టాము. అప్పటి కే గూడ్స్ వచ్చేస్తోంది. దాని వెంట ఒక్కో పెట్టే తో పాటు పరిగెడుతూ చివరి పెట్టే దగ్గర కోచ్చాము. అందులో నుంచి గార్డ్ మామయ్య దిగుతున్నాడు. మమ్మలిని చూసి నవ్వుతూ ఈ రోజు ఆలశ్యం అయ్యిందెందుకు అమ్మాయిలూ అని పలకరించాడు. మామయ్యా ఆ జెండా ఇవ్వవా అని ఆశ గా చూస్తూ అడిగాను. తప్పమ్మా మీకు ఇవ్వకూడదు అని పక్కకు వెళ్ళాడు. అక్కడి నుంచి వెనక్కి కూ అని కూతేసుకుంటూ పరిగేట్టాము. డ్రైవర్ మామయ్యదగ్గరకు వెళ్ళాము. డ్రైవర్  మామయ్యా ఇద్దరికీ చెరొక గాజు గొట్టం ఇస్తూ ఇక  వెళ్ళండమ్మా అన్నాడు. అప్పుడేనా అనుకుంటూ ఆ చివరనుంచి ఈ చివర దాకా పెట్టలు లెక్కపెడుతూ పరుగెత్తి , పట్టాలు దాటి అవతలి ప్లాట్ ఫాం కు వెళ్ళాము. అక్కడ ఫ్లాట్ ఫాం చివర ఉన్న పసుపచ్చని బోర్డ్ మీద నల్లటి అక్షరాల తో రాసి ఉన్న “ మహుబూబాబాద్ “ అక్షరాలను  ఆరాధనగా చూసి, అవి అందుకుందామని ఎగిరాము .కాని ఊమ్హూ  అందలే. కాసేపు బెంచ్ మీద కూర్చున్నాము. అక్కడున్న గానుగ చెట్టు చుట్టు పరిగెత్తాము .ఇంకా అలిసిపోయి ఇంటికి బయలు దేరాము. ఇంతలో ఎక్కడి నుంచో “ ... . . పోవు పాసెంజర్ కొద్దిసేపట్లో . . . “ అని వినిపించింది.  నా కాళ్ళు అప్రయత్నం గా ఆగిపోయాయి. చెవులు నిక్కబొడుచుకొని పూర్తి గా  విన్నాను. అబ్బ ఆ అమ్మాయి ఎంత బాగా చెపుతుందో. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. కాని నాకు అలా వినటం భలే ఇష్టం!  అది పూర్తయ్యే దాకా అక్కడి నుంచి కదిలేదానిని కాదు. నేనూ ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పుడు మానుకోట లో ఇంటి కి వెళ్ళటానికి రైల్వే స్టేషన్ దాటి  వెళ్ళాల్సి వచ్చేది. అదో అప్పుడు అక్కడ నేనూ, నాఫ్రెండ్ భాను ఇలా అలిసిపోయే దాకా ఆడుకునేవాళ్ళం!  ఆ వెళుతున్న పాసెంజర్ ఎప్పుడు ఎక్కుతామా అనుకునే వాళ్ళం. అలా అనుకుంటూ అనుకుంటూ  మా నాన్నగారికి మానుకోట నుంచి వరంగల్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు వరంగల్ వెళ్ళటానికి ఎక్కాము. ఆ డబ్బా లో అమ్మ, నాన్నగారు, నేనూ . అంతే ఇంకెవరూ లేరు. అందులో అద్దం  కూడా ఉంది.ఆ అద్దం  లో ఎన్ని సార్లు చుసుకున్నానో! అలా ఆ మానుకోట రైల్వే స్టేషన్ నా మనసులో ఉండిపోయింది.చిన్నపుడే రైలంటే ఏర్పడిన ఇష్టం మనసులో ఉండిపోయింది.చాలా ఏళ్ళవరకు ఎనౌన్సర్ గా జాబ్ చేయాలని కోరికగా ఉండేది.ఇప్పటికీ రైల్వే స్టేషన్ లొ ఎనౌన్స్మెంట్ వినగానే నా కాళ్ళు ఒక్క క్షణం ఆగిపోతాయి. చెవులు దోర విచ్చుకుంటాయి.
ఆ తరువాత చాలా ఏళ్లకు , పెళ్ళయ్యాక పాటియాలా వెళ్లేందుకు సదరన్ ఎక్స్ ప్రెస్ ఎక్కాను. మూడు రోజుల ప్రయాణం. అందులోనే స్నానం, భోజనం అన్నీ అంటే ఎంత వింతగా అనిపించిందో. ఫస్ట్ క్లాస్ కూపే,కిటికీ దగ్గర కూర్చొని వెనక్కి పరిగెడుతున్న స్తంబాలు,ఇల్లు, పొలాలు అన్నీ తెగ నచ్చేసాయి. మూడు రోజులు రైల్ లో ఉన్నా బోర్ కొట్టలేదు. ఆ తరువాత దేశం నలుమూలలా, కలకత్తా, డిల్లీ , మద్రాస్, పూనా , బొంబాయ్ మొత్తం తిరిగాము.  అప్పట్లో మొదటగా వచ్చిందిట భోగీల మధ్య కనెక్షన్ లేని రైల్ , ఆగ్రా నుంచి డిల్లీ .దాని లో సరదాగా ఈ చివర నుంచి ఆ చివరకు తిరిగాము. కొత్తగా వచ్చిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గంగాకావేరి , బాంబే లో లోకల్ ట్రేన్స్ అబ్బో తనివితీరా ఎన్నిరైళ్ళల్లోప్రయాణం చేసానో! కాకపోతే డార్జ్ లింగ్ లో టాయ్ ట్రేన్ ఎక్కటమే పడలేదు ! సిలిగురి వెళ్ళేటప్పుడు ఆ రోజులల్లో  ఏ.సి భొగీ లు లేవు. మా అబ్బాయి మూడు నెలల వాడు.అమ్మాయి మూడేళ్ళది . మంచి ఎండాకాలం . వడగాలులు. కూపే కిటికీ కి పలచటి గ్లాస్కో దోతీ కట్టి, ప్రయాణం అంతా దానిని తడుపుతూ ఉన్నాము.  ప్రతి రైల్ స్టేషన్ లో అక్కడ దొరికే స్పెషల్స్ తింటం సరదాగా ఉండేది. కలకత్తా లో చిన్న చిన్న మట్టి ముంతలల్లో చాయ్, రసగుల్లాలు, ఇటార్సీ స్టేషన్ లో స్టీల్ గ్లాస్ లో గరమాగరం చాయ్, నాగ్ పూర్  లొ ఆరెంజెస్, లోనావలాలో చిక్కీ , బటాకా వడా, రాజమండ్రి లో ఆకుపచ్చని బత్తాయిలు, వైజాగ్ లో ముసలతని బండి మీది కందిపొడి, జాల్నా లో జామకాయలు ఇలా అన్నీ బాగుండేవి. అన్నింట్లోకి బాంబే వి.టి స్తేషన్ దగ్గర పావ్ భాజి, చాట్ , పానీ పూరీ , భేల్ పూరీ నాకు భలే నచ్చేవి. అంతేనా బరోడా నుంచి బాంబే వెళ్ళేటప్పుడు ఆ కాస్త ప్రయాణానికీ గుజరాతీ లు పెద్ద పెద్ద డబ్బాల నిండా స్నాక్స్ తెచ్చుకునేవారు.మాకూ తినమని పెట్టే ఆ చుడువా , ఘమండ్ , స్వీట్స్ అన్నీ చాలా టేస్టీ గా ఉండేవి. కేరళ, ఉత్తరప్రదేశ్ తప్ప దాదాపు భారతదేశం లోని అన్ని రాష్ట్రాల నుంచీ మా కూ. . . చుక్. . . చుక్ ప్రయాణించింది. ఈ రాష్ట్రం దాటాము, ఈ రాష్ట్రం లోకి వచ్చాము , రాత్రి పడుకున్నప్పుడు ఒక రాష్ట్రం లో, తెల్లారి లేచేటప్పటికి ఇంకో రాష్ట్రం లో, ష్టేషన్ లల్లో వివిధ భాషలు మాటలు గల గలా వినిపించటం అంతా తమాషా గా ఉండేది.

అలాగే రైలు ప్రయాణం లో ఎంతో మంది ప్రయాణికులు పరిచయము అవుతారు.అందులోనూ మా ఏమండీ అందరినీ పలకరిస్తారు . కాకపోతే రైలు దిగగానే వాళ్ళను మర్చిపోతాము అది వేరే సంగతి. కాని ఒక్క జంటను మాత్రము నేను ఇప్పటికీ మర్చిపోలేను . మాకు ఆగ్రా హోటల్ లో పరిచయం అయ్యారు.వాళ్ళూ మాలాగే కొత్త గా పెళ్ళైనవాళ్ళు. నలుగురమూ కలిసి టాక్సీ మాట్లాడుకొని ఆగ్రా అంతా తిరిగాము. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే , తాజ్ మహల్ దగ్గర నేను ఫొటో గ్రాఫర్ తో ఫొటో తీయించుకుందామనుకున్నాను.నై నై భాభీ మై కీంచూంగా అని రకర్కలా ఫొజులల్లో మా ఇద్దరి ఫొటోలు తీసాడు. ఆ తరువాత డిల్లీ దాకా కబుర్లు చెప్పుకుంటూ , రైలంతా కలియ తిరుగుతూ కలిసి ప్రయాణించాము. మా ఎడ్రెస్ కూడా తీసుకున్నాడు.పాటియాలా లో ఉన్నన్ని రోజులూ ఎదురు చూసాను ఆ ఫొటోలకోసం.రాలేదు. పక్కింటి మిసెస్.జగన్నధం కు వస్తాయేమో , వస్తే పంపించమని చెప్పాను . ఇప్పటికీ ఎదురుచూస్తున్నాను ఆ ఫొటోల కోసం . ఆ తరువాత డిల్లీ ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ  ఆగ్రా వెళ్ళటం పడలేదు. సన్నగా పొడుగ్గా ఉన్న ఆయన మటుకు గుర్తుండిపోయాడు !
అన్నింటి లో కి మరుపురాని ప్రయాణం పాటియాల నుంచి పూనా కు వెళ్ళింది. పెళ్లి తరువాత మొదటి సారిగా వెళ్ళింది పాటియాలా అయినా అక్కడ ఒక్క నెలనే  ఉన్నాము. అప్పటి కే పూనా పోస్టింగ్ వచ్చింది. పాటియాలా చూపించాలని తీసుకెళ్ళారు. ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాము. మా కొత్తకాపురం మొదలయ్యింది పూనా లో. పాటియాలా స్టేషన్ కు యూనిట్ వాళ్ళంతా వీడ్కోలు ఇచ్చేందుకు కుటుంబాలతో వచ్చారు. అందరమూ స్టేషన్ లో నిలబడి మాట్లాడుకుంటున్నాము. ఇంతలో ఇద్దరు జవానులు ఒక పెద్ద కర్ర కు మల్లె పూల దండలు వెళ్లాడదీసుకొని  చెరో వైపు పట్టుకొని మార్చ్ ఫాస్ట్ చేస్తూ వచ్చారు. యూనిట్ కమాండింగ్ ఆఫీసర్  (c.o) ఒక దండ తీసుకొని మావారి మెళ్ళో వేసాడు. ఆతరువాత ఒక్కక్కరే వచ్చి ఆయనకు ధన్ మని సెల్యూట్ చేసి దండ వేసారు. నేను ఆశ్చర్యం గా చూస్తూ ఉండగా సి.ఓ గారి భార్య  నాకు పెద్ద బుకే ఇచ్చి , “ తుమారా జిందగీ హమేషా ఫూలే ఫలే రహే “ అంది. నాకు అప్రయత్నంగా కళ్ళల్లో  నీళ్ళొచ్చాయి. ఆ తరువాత ఆడవాళ్ళందరు నాకు బుకే లు ఇచ్చారు. జవానులొచ్చి , మా వారికి వేసిన దండలు , నాకిచ్చిన బుకేలు తీసుకుపోయారు.అయ్యొ తీసుకుపోతున్నారే అని మనసులొ బాధ పడ్డాను కాని ఏమీ అనలేదు. రైల్ కదిలాక తలుపు దగ్గర నిలబడి అందరికీ చెయి ఊపి లొపలికి వెళ్ళాము.అద్భుతం. మా దగ్గర తీసుకున్న మల్లెల దండలన్నీ , బుకేలనీ  కిటికీలకి, బర్త్ కి అలంకరించారు. యూనిట్ వాళ్ళు ప్రెజెంట్ చెసిన ఇత్తడి కాండిల్ స్టాండ్ ను తళతళా నెరిసేట్టుగా పాలిష్ చేసి , అందులొ కొవ్వొత్తులు వెలిగించారు. ఆకొవ్వొత్తుల వెలుగు, బయట నుంచి పడుతున్న దీపాల వెలుగు లొ ఆ కూపే ఎంత అందంగా ఉందో చెప్పలేను. కొత్త కాపురానికి తీసుకెళుతున్న పూలరధం లా ఉంది. ఆ ప్రయాణం మరుపురానిది.

అలాగే ఇంకోటి గుర్తొచ్చినప్పుడల్లా భయపెట్టేది. సిలిగురివెళ్ళి నప్పుడు , కలకత్తా లో రైల్ మారాల్సి వచ్చేది. కలకత్తా లో దిగాక నెక్స్ట్ ట్రేన్ కు టికెట్ కంఫర్మ్ అయ్యిందో లేదో కనుక్కొని వస్తాను అని మా వారు వెళ్ళారు. ఎంత కూపే కిటికీలకు గ్లాస్కో ధోతి కట్టి , తడుపుకుంటూ జాగ్రత్తగా తీసుకొచ్చినా మా అబ్బాయి కి వడదెబ్బ తగిలినట్టయ్యి కందిపోయాడు.చాలా చికాకు చేసుకుంటున్నాడు. వాడిని సముదాయించటం లో సతమతమవుతున్నాను. ఇంతలో మావారొచ్చి ఏమిటీ సంజు ను ఇట్లా వదిలేసావు అని కోపం గా అడిగారు.నేను వదలటమేమిటి మీతో వచ్చింది కదా అన్నాను నేను. నా దగ్గర ఉందని ఆయన అనుకున్నారు.ఆయనతో వెళ్ళిందని నేను అనుకున్నాను. ఆయన వెనుక పరిగెత్తిందిట డాడీ అంటూ . ఆయన హడావిడి గా వెళుతూ వినలేదు. నా గుండె జారిపోయింది. మరి అని ఇక అడగలేక పోయాను. నేనూ డాడీ అని పరిగెత్తుతుంటే ఒక తాతయ్య చేయి పట్టుకున్నాడు అంది.ఆ పెద్దాయన దానిని ఆపి అటూ ఇటూ మాకోసం చూస్తున్నాడుట. మావారు తిరిగి వస్తూ చూసారు. మా అదృష్టం  ఎక్కువ దూరం వెళ్ళలేదు అందుకే దొరికింది . అమ్మో లేకపోతే అంత పెద్ద హౌరా ష్టేషన్ లో తప్పిపోతే ! బాబోయ్ తలుచుకుంటేనే ఇప్పటికీ వళ్ళు జలాదరిస్తుంది.
హైద్రాబాద్ వచ్చేసాక రైల్ ఎక్కే సందర్భాలు అంతగా రాలేదు . మావారి కాంట్రాక్ట్ పనులన్నీ ఆంధ్రప్రదేశ్ లోనే కాబట్టి, ఎక్కడికెళ్ళినా కార్ లో , దూరం వెళ్ళాల్సి వస్తే విమానం లోనే వెళ్ళటం! చాలా ఏళ్ళతరువాత  మావారి ఫ్రెండ్ మనవరాలి పెళ్ళి కి బెంగుళూర్ రైల్ లో వెళుతున్నాము. నిన్న రాత్రి రైల్ ప్రయాణం, మళ్ళీ రేపు హైద్రాబాద్ లో పనుండటం వల్ల ఈ రోజే రైల్ ఎక్కాము. రెండు రాత్రులు వరుసగా ప్రయాణం చేసినా అలసటగా లేదు . బయటకు చూద్దామంటే ఏ.సి కంపార్ట్మెంట్ కావటం తో అద్దాలు బిగించి ఉన్నాయి.అంతా మసకగా తప్ప ఏమీ కనిపించటం లేదు. ఆ రోజులల్లో నా కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూసే పిచ్చిని పాపం మావారు ఎంత భరించారో ! ఎక్కడికెళ్ళినా మూడు రోజుల ప్రయాణం తప్పనిసరి.అన్ని రోజులూ నేను వదలకుండా కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తూ ఊహలల్లో ఉంటే పాపం ఆయనే పిల్లలను ఎంగేజ్ చేసేవారు. చీకటి పడింది. అందరూ కబుర్లాపి పక్కలేసారు. పెద్ద లైట్ ఆపేసి చిన్న బ్లూ లైట్ వేసారు. అంతటా నిశబ్ధం  నేనూ పడుకున్నాను కాని నిద్ర రావటం లేదు . బయటకు చూస్తే చీకట్లో అక్కడక్కడ దీపాలు మిణుక్కుమంటున్నాయి.పక్కకు తిరిగి పడుకున్నాను. రైల్ చక్రాలు లయబద్ధంగా కదులుతున్నాయి. వాటి తో పాటే సాగిపోతున్నాయి నా మది లోని మధురానుభూతులు అలా. . .అలా. . .