Sunday, January 31, 2010

శ్రీమతి . డాక్టర్ . పద్మశ్రీ శోభారాజ్ గారికి అభినందన




" జో అచ్యుతానంద జో జో " పాట చిన్నప్పటి నుండి వింటున్నా , పిల్లలకు పాడినా అది అన్నమయ్య రచన అని నాకు తెలీదు . అలాగే " ముద్దు గారే యశోదా ముంగిట ముత్యము వీడు " అని మురిపెంగా పాడుకున్న పాట కూడా అన్నమయ కీరన అని , నాలాంటి సామాన్యుల కు తెలిసింది శ్రీమతి . డాక్టర్ . పద్మశ్రీ . శోభా రాజ్ గారి అన్నమయ్య కీర్తనల కాసెట్ల ద్వారానే . అన్నమయ్య కీర్తనలకు ప్రాచుర్యం కల్పించటము లో శోభా రాజ్ గారి కృషి వెలలేనిది . వారి కృషిని " పద్మశ్రీ " బిరుదు తో ప్రభుత్వము సత్కరించటము సముచితము

శోభా రాజ్ గారికి " పద్మశ్రీ " లభించిన సంధర్భములో " అన్నమయ్య పురం " లో వారి విద్యార్ధులు నిన్న 30 - 1 2010 న సన్మానము జరిపారు . నా కంప్యూటర్ టీచర్ , అనిత , ఆవిడ విధ్యార్ధిని . నాకు శోభా రాజ్ గారిని కలిసి అభినందించాలన్న అభిలాష వుండటము వలన అనిత తో పాటు నేనూ ఆ సన్మాన సభ లో పాలుగొన్నాను .

అన్నమయ్యపురం లోనికి ప్రవేశించగానే ఇది అన్నమయ్య పురమా లేక ఆద్యాత్మిక పురమా అనిపించింది . అంతటా వెంకటేశుడే అగుపించాడు . పద్మశ్రీ . శోభా రాజ్ గారిని నేను , పుష్ప గుచ్చము తో అభినందించిన క్షణం , నాకు చాలా అపురూపం గా అనిపించింది . అనిత నన్ను పరిచయము చేయగానే , ఆప్యాయం గా నా చేయి అందుకున్నారు . చాలా సంతోషం వేసింది .

శ్రీమతి . డాక్టర్ . పద్మశ్రీ . శోభా రాజ్ గారికి విద్యార్ధు లందరూ దండలు వేసి , పుష్ప గుచ్చాలిచ్చి , శాలువా తో సత్కరించారు .అన్నమయ్య కీర్తనలు ఆలపించారు . చిన్న పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు .కుండల మీద నిలబడి , చేతుల లో కాండిల్స్ వెలింగించి పట్టుకొని , చిన్న పిల్లలు చేసిన భరత నాట్యం అద్భుతం . వేడుకుందా పాటకు ఆహుతుల లోనుండి కూడా కొంతమంది లేచి నర్తించారు . అందరిలో నెలొకొన్న భక్తి భావం పరమాద్బుతం ! వినాయకుడు , శ్రీదేవి , భూదేవీ సహిత వెంకటేశ్వరస్వామి , అన్నమయ్య , షిరిడీ సాయి , పకీరు వేషధారణల లో పిల్లలు చాలా ముద్దుగా అనిపించారు . అంతటా భక్తిరసం తో పులకించి పోయింది .

శోభా రాజ్ గారు , మీకు మరిన్ని పురష్కారాలు జరగాలని మనసారా కోరుకుంటూ , అభినందనలు .



ఇంకా కొన్ని అన్నమయ్య సంకీర్తనలు ఇక్కడ వినవచ్చు.

Saturday, January 23, 2010

" జనగణమన " కు రేపటి తో అరవైయ్యేళ్ళు




అధినాయక జయహే . . భారత భాగ్య విధాత . . .అంటూ యావత్ దేశం లో జాతీయభావాన్ని పురికొల్పే " జన గణ మన " గీతం . . . మన జాతీయ గీతంగా ఏర్పాటు చేసుకొని రేపటికి సరిగ్గా అరవైయ్యేళ్ళు ! విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కలం నుంచి జాలువారిన ఈగీతాన్ని 1950 జనవరి 24 న రాజ్యాంగసభ , జాతీయగీతం గా అధికారికం గా ఆమోదించింది . వాస్తవానికి ఈ గీతాన్ని గురుదేవుడు 1911 డిసెంబర్ 27నే రాసారు . 1919 ఫిబ్రవరి లో ఈ గీతాన్ని స్వరపరిచారు .అందుకు ఆంద్రప్రదేశ్ లోని మదనపల్లి వేదిక కావటం విశేషం . ప్రస్తుతం మనం అదే స్వరం లో ఇప్పటికీ పాడుకుంటున్నాము . ఈ గీతాలాపనకు సాధారణం గా 55 సెకెండ్లు పడుతుంది . సంక్లిష్టమైన బెంగాలీ సంస్కృతములో రాసిన ఈ గీతాన్ని రవీంద్రుడు అనంతరం ఇంగ్లీషు లోనికి అనువదించారు . బహుళ భాషలు , యాసలు సమ్మిళితమైన భారతదేశం లో అన్ని ప్రాంతాల్లోనూ ఈ గీతాన్ని ఆలపించినా . .ఆయా ప్రాంతాలను బట్టిపదాలలో మార్పులు కనిపిస్తుంటాయి . అసలు గీతం లోని కొన్ని నిశ్శబ్దాక్షరాలూ కనిపిస్తుంటాయి . 1911 లోనే ఈ గీతం రాసినా .. చాలాకాలం వరకు పెద్దగా వెలుగులోకి రాలేదు . అప్పట్లో రవీంద్రుని సంపాదకత్వములో వెలువడిన బ్రహ్మోసమాజ్ పత్రిక " తత్వ బోధ ప్రకాశిక " పాఠకులకు మాత్రం ఇది పరిచితం .

మన రాష్ట్రంతో సంబంధం
ఐరిష్ కవి , తన స్నేహితుడు జేంస్ హెచ్ క్యూజిన్స్ ఆహ్వానముతో ఠాగూర్ కొంతకాలం మదనపల్లి లోని బీసెంట్ థియోసోఫికల్ కాలేజ్ లో గడిపారు . ఆ కాలేజీకి క్యూజిన్స్ ప్రిన్సిపల్ గా వుండే వారు . ఫిబ్రవరీ 28 వ తేదీ సాయంత్రం గురుదేవుడు అక్కడి విద్యార్థులతో ఇష్టా గోష్టి జరిపారు . వారందరి విజ్ఞప్తి మేరకు బెంగాలి లో జనగణమన గీతాన్ని ఆలపించారు . ఆ సంధర్భంగానే ఆ గీతాన్ని ఆంగ్లం లోకి అనువదించారు . క్యూజిన్స్ భార్య మార్గరేట్ .. పశ్చిమ సంగీతములో నిపుణురాలు . ఆమె చివరిసారి ఈ గీతాన్ని స్వరపరిచారు . అలాగే ఈ గీతాన్ని , ఇప్పటికీ మనం పాడుకుంటున్నాము . మదనపల్లి లోని బీసెంట్ థియోసోఫికల్ కాలేజ్ లో ఆంగ్ల రాత ప్రతి ఇప్పటికీ ఫ్రేం కట్టి భద్రం గా వుంచారు .

వివాదాలూ వున్నాయి
ఈ గీతం పై వివాదమూ వుంది . ఈ గీతం బ్రిటిష్ వలస పాలకులను కీర్తిస్తూ వుందనేది ఆ వివాదం . ఈ గీతం తొలిసారి 1911 డిసెంబర్ లో కలకత్తా లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేసాల్లో ఆలపించారు . ఆ సదస్సు లో రెండవ రోజును బ్రిటిష్ నేత ఐదవ జార్జి రాకకు స్వాగతం పలికేందుకు వుద్దేశించారు . ఈ సంధర్బం గా స్టేట్స్ మన్ పత్రిక తన మరుసటి రోజు పత్రికలో " బెంగాలీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ .. చక్రవర్తిని ఆహ్వానిస్తూ , తను రాసి స్వరపరచిన గీతం ఆలపించారు " అని పేర్కొంది . దీనితో చక్రవర్తి గౌరవార్ధం ఈ గీతం రాసారనే దురభిప్రాయం నెలకొంది . అదే సదస్సు లో చక్రవర్తిని కీర్తిస్తూ మరో పాట కూడా పాడారు . దీంతో మీడియా ఈవిషయం లో పొరబడిందని కొందరు చెబుతుంటారు . అయితే తాను ఈ పాటను దేవుడి ( భారత భాగ్య విధాత ) ని ఉద్దేశించి రాసిందేనని , బ్రిటిష్ చక్రవర్తిని ఉద్దేశించి రాసింది కాదని ఠాగూర్ అప్పట్లోనే స్పష్టం చేసారు . 2005 లో ఈ గీతం లోని సింధు అన్న పదాన్ని తొలిగించాలని కొందరు వాదించారు . సింధ్ ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉందనేది వారి వాదన . అయితే , సింధు అనే పదం హిందూ , సింధూ నాగరికతలను ఉద్దేశించినదంటూ కొందరు ఆ ప్రతిపాదనను విభేదించారు .

ఈ ఆర్టికల్ ఈ రోజు 23- 1- 2010 ,ఆంధ్రజ్యొతి డైలీ పేపర్ లోనిది యధాతధంగా .

Tuesday, January 12, 2010

భారత్ మాతా కీ జై




ఈ. యం . ఈ స్లోగన్ " కరం హీ ధరం " .

ఈ.యం .ఈ ( ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీయర్ ) ఇండియన్ ఆర్మీ లో ఒక విభాగము . ఇది 1943 లో ఐ .ఈ.యం .ఈ గా ఏర్పడినది . తరువాత 1964 అక్టోబర్ 15 న ఈ. యం .ఈ గా మార్చారు . అప్పటినుండి ప్రతి సంవత్సరము అక్టోబర్ 15 న ఈ.యం .ఈ కోర్ డే గా జరుపుకుంటున్నారు . ప్రతి సంవత్సరము ఈ ఫంక్షన్ ను ఎవరి యూనిట్ లో వారు జరుపుకున్నాను , ప్రతి నాలుగు సంవత్సరములకు ఒకసారి , రీ యూనియన్ డే అని సికింద్రాబాద్ లో వున్న ఈ. యం. ఈ సెంటర్ మరియు యం .సి యం. ఇ ( మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీయర్ ) వారు సమ్యుక్తముగా ఇండియా మరియు విదేశములో వున్న ఈ.యం .ఈ ,రిటైర్డ్ అండ్ సర్వింగ్ ఆఫీసర్లను ఆహ్వానించి , కార్యక్రమములను నిర్వహిస్తారు . ఈ సంవత్సరము కొన్ని కారణాలవలన అక్టోబర్ 15 న కాకుండా , జనవరి 7 వ తారీకు నుండి 10 వరకు ఘనంగా జరుపుకున్నారు .

ఈ వేడుకలలో వివిధ బాద్యతలు నిర్వర్తిస్తున్న 8 వేలమంది అధికారుల తో పాటు , పదవీవిరమణ చేసినవారు కూడా పాల్గొన్నారు . సెరొమొనియల్ పెరేడ్ ,రీథ్ లేయింగ్ సెర్మొని , కార్నివాల్ , డిన్నర్ , బరాఖానా మొదలైన వివిధ కార్యక్రమాలను జరిగాయి . కార్నివాల్ లో సూర్య కిరణ్ సారంగ్ ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలు , ప్యారాసైలింగ్ హాట్ ఎయిర్ బెలూన్ , శిక్షణ పొందిన డాగ్ షో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి . ఈ కార్యక్రమాలకు ,చీఫ్ లెఫ్ట్ నెంట్ జనరల్ అజయ్ కుమార్ సింగ్ చాంద్లే హాజరయ్యారు .

1 ఈ.యం .ఈ సెంటర్ లోని యుద్ధవీరుల స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్చాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు .శత్రు సేనల తో పోరాడుతున్న వీరులను స్మరించుకున్నారు . దేశభద్రత కోసం ప్రాణాలర్పించిన వీరుల భార్యలను బహుమతులతో సత్కరించారు . రీథ్లేయింగ్ సెర్మొని లో ఈ కార్యక్రమము జరుగుతున్నంత సేపు , చెమ్మగిల్లని కనులు , భారమెక్కని గుండెలు లేవు అంటే అతిశయోక్తి కాదేమో ! ఎన్ని బహుమతులు ఇచ్చినా వారి ఋణమును తీర్చుకోగలమా ?

భారమెక్కిన హృదయాలను దలేర్ మెహంది తన ఆట , పాట తో బరాఖానా , ( ఆఫీసర్ లు , జేసిఓ లు , జవానులు , అందరూ కుటుంబాలతో కలిసి చేసిన విందుబోజనం ) లో తేలిక పరిచాడు . చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ దలేర్ మెహంది తో అడుగులు కలిపి ఆనందించారు .

మరునాడు ఆఫీసర్స్ మెస్ లో జరిగిన డిన్నర్ లో ఈ. యం . ఈ జన్మదిన కేక్ కట్ చేసారు . 1943 లో ఈ.యం . ఈ లో చేరిన కల్నల్ . మదన్ సింగ్ ను , ఆయనకు 100 సంవత్సరాలు నిండిన సంధర్భము లో సత్కరించారు .

చివరగా రామోజీ ఫిలిం సిటీ లో పిక్నిక్ తో రీయునియన్ డే కార్యక్రమములు ఆనందముగా ముగిసాయి .

అన్ని కార్యక్రమములు ఒకెత్తైతే , 8 వ తారీకున , 1 ఈ . యం . ఈ సెంటర్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన సెరెమొనియల్ పెరేడ్ ప్రత్యేకమైనది . ప్రతి సంవత్సరమూ , మేము ఏ ప్రోగ్రాం కి వెళ్ళినా , మానినా , ఈ ప్రోగ్రాం కు మటుకు తప్పక వెళుతాము . ( మావారు ఈ.యం .ఈ నుండి మేజర్ గా వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు ) ఉదయము 7.45 కు పెరేడ్ మొదలయింది . ఆహుతులందరూ వచ్చే సరికే సైనికులు పెరేడ్ గ్రౌండ్ లో వరుసలో పొజిషన్ తీసుకొనివున్నారు . కలర్స్ - ఏదైనా బ్రాంచ్ కొత్తగా మొదలు పెట్టి , అది సక్రమముగా పనిచేస్తూ నిలదొక్కుకున్నప్పుడు , మెచ్చుకోలుగా ఇచ్చే ఝండాను కలర్స్ అంటారు . ఆ బ్రాంచ్ కు కలర్స్ రావటమును ఘనంగా భావిస్త్తారు . ముగ్గురు సైనికులు కలిసి కలర్స్ ను తీసుకొని వస్తున్నప్పుడు , ఆహుతులందరూ గౌరవ సూచకముగా నిలబడి సెల్యూట్ చేసారు . పెరేడ్ జరిగేటప్పుడు , తిరిగి తీసుకొని వెళుతున్నప్పుడు కూడా నిలబడుతారు . " కదం కదం సే మిలాకె " అంటూ , ఈ. యం . ఈ అడాప్ట్ చేసుకున్న " సారే జహాసె అచ్చా హిందూ సితా హమారా " అనే పాటను బాండ్ వాయిస్తుండగా , సైనికులు లయ బద్ధముగా మార్చ్ ఫాస్ట్ చేస్తుంటే చూసేందుకూ రెండు కళ్ళూ చాలవనిపిస్తుంది . పెరేడ్ గ్రౌండ్ సైనికుల కవాతు తో పులకించి పోయింది . " భారత్ మాతాకీ జై " , " ఈ. యం. ఈ కోర్ కీ జై " అని మూడుసారులు నినాదించటము తో పెరేడ్ ముగిసింది .పెరేడ్ ముగిసినంతనే , ఆహుతులందరూ నిలబడి చప్పట్ల తో తమ అభినందనలను తెలిపారు .
పెరేడ్ ప్రాంగణమంతా దేశ భక్తి గేయాల తో మారు మ్రోగింది . అందులో కొన్ని పాటలను ఇక్కడ వినండి .

పైన ఫొటో లో వున్నది ఈ. యం. ఈ కలర్స్ .

భారత్ మాతాకీ జై .

Friday, January 1, 2010